WTC Final: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్.. దినేశ్ కార్తీక్ బోల్డ్ కామెంట్స్!

ABN , First Publish Date - 2023-03-16T17:39:07+05:30 IST

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు 2-1తో సొంతం చేసుకుంది. ఈ

WTC Final: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్.. దినేశ్ కార్తీక్ బోల్డ్ కామెంట్స్!

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు 2-1తో సొంతం చేసుకుంది. ఈ విజయంలో వెటరన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja)ది కీలక పాత్ర. బంతులతో ఇద్దరూ ఆసీస్‌ను బెంబేలెత్తించి జట్టుకు అపూర్వ విజయాన్ని అందించారు. ఈ సిరీస్‌లో వీరిద్దరే టాప్ వికెట్ టేకర్లు. అశ్విన్ 25, జడేజా 22 వికెట్లు పడగొట్టారు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు డ్రా అయినప్పటికీ మరో రూపంలో టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) ఫైనల్‌కు చేరుకుంది.

జూన్‌లో లండన్‌లోని ఓవల్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో మళ్లీ ఆస్ట్రేలియా-భారత జట్టు తలపడనున్నాయి. డబ్ల్యూటీసీలో తలపడే భారత జట్టు కూర్పుపై తాజాగా టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్(Dinesh Karthik) కీలక వ్యాఖ్యలు చేశాడు. అక్షర్ పటేల్(Axar Patel) ఆల్‌రౌండర్ అయినప్పటికీ భారత తుది జట్టులో అతడికి చోటు దక్కకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. తుది జట్టు నుంచి అశ్విన్, జడేజాలలో ఒకరిని పక్కనపెట్టాల్సి వస్తే కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ సిగ్గుపడాల్సిన అవసరమేమీ లేదని చెప్పుకొచ్చాడు.

నిజం చెప్పాలంటే అశ్విన్, జడేజా ఇద్దరూ ఫిట్‌గా ఉన్నారని, అప్పుడు అక్షర్ పటేల్‌కు తుది జట్టులో స్థానం దక్కదని అన్నాడు. అప్పుడు అతడి స్థానంలో శార్దూల్ పటేల్‌కు చోటు దక్కుతుందన్నాడు. అశ్విన్ లేదంటే జడేజాలలో ఒకరినే ఆడించాలని అన్నాడు. గత టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇద్దరినీ ఆడించి తప్పుచేసిందని అన్నాడు. ఆ మ్యాచ్‌లో వారిద్దరూ పెద్దగా రాణించలేకపోయారని గుర్తు చేశాడు. ఈసారి అలాంటి పొరపాటు చేయొద్దని అన్నాడు. దీనిని మరీ పెద్దగా చూడాల్సిన అవసరం లేదన్నాడు. జడేజాను తీసుకోవడం వల్ల బ్యాటింగ్‌కు కూడా పనికొస్తాడని అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ మ్యాచుల్లో అశ్విన్, జడేజా ఇద్దరినీ ఒకే మ్యాచ్‌లో చూడడం అరుదైన విషయమేనని కార్తీక్ గుర్తు చేశాడు.

Updated Date - 2023-03-16T17:39:07+05:30 IST