CSK Won: వామ్మో.. ఇదెక్కడి ఐపీఎల్ ఫైనల్ దేవుడోయ్.. చెన్నైని జడేజా ఎలా గెలిపించాడో చూడండి..!

ABN , First Publish Date - 2023-05-30T02:55:57+05:30 IST

గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నై జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదోసారి ఐపీఎల్ కప్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.

CSK Won: వామ్మో.. ఇదెక్కడి ఐపీఎల్ ఫైనల్ దేవుడోయ్.. చెన్నైని జడేజా ఎలా గెలిపించాడో చూడండి..!

ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ (IPL Final). గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (GT vs CSK) జట్లు తలపడుతున్నాయి. ఒకే ఒక్క ఓవర్ మిగిలి ఉంది. 13 పరుగులు చేస్తేనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు (Chennai Super Kings) విజయం దక్కుతుంది. అప్పటికే చెన్నై జట్టు 5 కీలక వికెట్లను కోల్పోయింది. గెలుస్తామన్న ఆశ ఉన్నప్పటికీ అంబటి రాయుడు, ధోనీ వికెట్లను వెంటవెంటనే కోల్పోవడంతో చెన్నై అభిమానుల్లో నమ్మకం సన్నగిల్లింది. కొందరు అభిమానులైతే ఈ ఐపీఎల్ కప్ (2023 IPL Cup) చేజారిపోయిందని వెక్కివెక్కి ఏడుస్తూ కనిపించారు. చివరి ఓవర్ మొదలైంది. ఒక్క ఓవర్‌లో 17 పరుగులు ఇచ్చినప్పటికీ అంబటి రాయుడు, ధోనీ వికెట్లు తీసి చెన్నైని చావు దెబ్బ కొట్టిన మోహిత్ శర్మ (Mohit Sharma) చివరి ఓవర్ బౌలింగ్ వేస్తున్నాడు.

FxUOYGBacAA3cUR.jpg

చెన్నై బ్యాటర్లు జడేజా (Jadeja), శివం దూబే (Shivam Dube) క్రీజులో ఉన్నారు. చెన్నై జట్టు కెప్టెన్ ధోనీ మౌనంగా తలదించుకుని దేవుడిపైనే భారం వేశాడు. తొలి బంతి యార్కర్ వేసి మోహిత్ శర్మ కట్టడి చేశాడు. దీంతో.. చెన్నై అభిమానుల్లో నైరాశ్యం కమ్ముకుంది. శివం దూబే ఆడిన రెండో బంతికి ఒక పరుగు మాత్రమే వచ్చింది. మూడో బంతికి ఒక్క పరుగు. నాలుగో బంతికి ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. చివరి రెండు బంతుల్లో 10 పరుగులు సాధిస్తేనే చెన్నై గెలుస్తుంది. లేదంటే ఫైనల్ మ్యాచ్ కోసం మూడు రోజులుగా నిరీక్షించిన చెన్నై అభిమానులు నిరాశతో వెనుదిరగక తప్పదు.

FxUc0GDakAAGKnL.jpg

చెన్నై అభిమానులు దాదాపుగా ఆశలు వదిలేసుకున్నారు. కానీ.. బెస్ట్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న జడేజా క్రీజులో ఉన్నాడని ఎక్కడో ఒక చిన్న ఆశ. అలాంటి ఉత్కంఠ సమయంలోనే.. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందనే మాటను నిజం చేస్తూ జడేజా ఐదో బంతికి సిక్స్ బాదేశాడు. ఒక్కసారిగా సీఎస్‌కే ఫ్యాన్స్ విజిల్స్‌ సౌండ్‌తో అహ్మదాబాద్ స్టేడియాన్ని మోతపుట్టించారు. చెన్నై అభిమానుల కోసమో, నిరాశతో తలదించుకున్న తన కెప్టెన్ ధోనీ కోసమో, ఈ సీజన్‌తో ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడు కోసమో.. ఎవరి కోసమో తెలియదు. రవీంద్ర జడేజా చివరి బంతికి ఫోర్‌ కొట్టి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐపీఎల్ కప్‌ను కానుకగా అందించాడు. అహ్మదాబాద్ స్టేడియం చెన్నై అభిమానుల కేరింతలతో, ఈలలుకేకలతో దద్ధరిల్లిపోయింది. తమకు ఇంత ఘన విజయాన్ని, ఐపీఎల్ కప్‌ను అందించిన జడేజాను చెన్నై అభిమానులు హర్షధ్వానాలతో కీర్తించారు.

FxUje7MagAA3UPU.jpg

ఇదీ 2023 ఐపీఎల్ సీజన్ ముగిసిన తీరు. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మే 28న జరగాల్సిన గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా మే 29న జరిగింది. చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 4 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని చెన్నై జట్టు ముందు నిలిపింది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్లు సాహా 54 పరుగులు, గిల్ 39 పరుగులతో రాణించారు. అయితే.. గుజరాత్ జట్టుకు భారీ స్కోర్ అందించడంలో సాయి సుదర్శన్ చేసిన 96 పరుగులు కీలకమైనవి. 47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో ఈ చిచ్చరపిడుగు చెలరేగి ఆడాడు. ఐపీఎల్ ఫైనల్‌లో తన బ్యాటింగ్‌తో ఔరా అనిపించాడు.

FxT3qabaUAA1R5V.jpg

సెంచరీకి 4 పరుగుల దూరంలో నిలిచిపోయిన సాయి సుదర్శన్ (96 పరుగులు) ఇన్నింగ్స్ ఈ ఫైనల్‌కే హైలైట్‌గా నిలిచింది. హార్థిక్ పాండ్యా 21 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టుకు ఆరంభంలోనే వరుణుడు అడ్డు తగిలాడు. చెన్నై ఓపెనర్లు కాన్వే, గైక్వాడ్ క్రీజులోకి వచ్చి తొలి ఓవర్ ఆడుతున్నారు. గుజరాత్ పేసర్ షమీ బౌలింగ్ చేస్తున్నాడు. తొలి రెండు బంతులకు ఒక్క పరుగు కూడా రాలేదు. మూడో బంతిని గైక్వాడ్ ఫోర్‌గా మలిచాడు. దీంతో.. చెన్నై జట్టు తొలి ఓవర్‌లో మూడు బంతులు ముగిసే సరికి నాలుగు పరుగులు చేసింది. అప్పుడే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. రాత్రి 9.50కి మొదలైన వర్షం పిచ్‌ను చిత్తడిచిత్తడి చేసింది. 20 ఓవర్లు ఆసాంతం జరిగే పరిస్థితి లేకుండా చేసింది. గ్రౌండ్ స్టాఫ్ నానా తంటాలు పడి మైదానాన్ని మ్యాచ్‌కు సిద్ధం చేసేసరికి 11.30 దాటింది.

FxUc0GDakAAGKnL.jpg

దీంతో.. అంఫైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో చెన్నై జట్టుకు టార్గెట్ ఫిక్స్ చేశారు. 15 ఓవర్లకు చెన్నై జట్టు 171 పరుగులు చేస్తేనే విజయం దక్కుతుంది. 12.10 AMకి మ్యాచ్ మొదలయ్యేసరికి తేదీ మారిపోయింది. మే 29న రాత్రి 7.30కి మొదలైన ఐపీఎల్ 2023 ఫైనల్ మే 30న ముగిసింది. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టుకు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, కాన్వే శుభారంభాన్ని అందించారు. 74 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గైక్వాడ్ 26 పరుగులు, కాన్వే 47 పరుగులు చేసి ఔట్‌గా వెనుదిరిగారు. ఆ తర్వాత.. రహానే 13 బంతుల్లోనే 27 పరుగులు చేసి దూకుడుగా ఆడుతుండగా మోహిత్ శర్మ బౌలింగ్‌లో విజయ్ శంకర్‌కు క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ బాట పట్టాడు.

FxU1rPuaMAAQTDy.jpg

అంబటి రాయుడు ఒక ఫోర్, రెండు సిక్స్‌లతో మెరిపించినా ఆ దూకుడును కొనసాగించలేకపోయాడు. మోహిత్ శర్మ బౌలింగ్‌లోనే బౌలర్‌కే క్యాచ్‌గా దొరికిపోయి ఔట్ కావడంతో చెన్నై జట్టు కష్టాల్లో పడింది. ఆ సమయంలోనే.. చెన్నై జట్టు కెప్టెన్ ధోనీ క్రీజులోకొచ్చాడు. ధోనీపై భారీ ఆశలు పెట్టుకున్న సీఎస్‌కే అభిమానుల ఆశలు అడియాసలయ్యాయి. మోహిత్ శర్మ బౌలింగ్‌లో తొలి బంతిని షాట్‌గా మలిచేందుకు యత్నించి మిల్లర్‌కు క్యాచ్‌గా దొరికిపోయి ధోనీ డకౌట్‌ కావడంతో చెన్నై అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.

FxUkhFkaQAAucid.jpg

శివం దూబే 32 పరుగులతో నాటౌట్, జడేజా 6 బంతుల్లోనే ఒక సిక్స్, ఒక ఫోర్‌తో 15 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచి చెన్నై జట్టు ఐదోసారి ఐపీఎల్ కప్‌ను అందుకునేలా చేశారు. తలదించుకున్న ధోనీనీ గర్వంగా తలెత్తుకునేలా చేయడంలో జడ్డూ పాత్ర మరువలేనిది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ మూడు వికెట్లతో రాణించగా, నూర్ అహ్మద్ 2 వికెట్లు సాధించాడు. చెన్నై బౌలర్లలో మతీషా పాతిరానా 2 వికెట్లతో రాణించగా, జడేజా, దీపక్ చాహర్ చెరో వికెట్ తీశారు. మొత్తంగా చూసుకుంటే.. గుజరాత్ టైటాన్స్ జట్టు ఓడిపోయినప్పటికీ శుభ్‌మన్ గిల్ ఈ ఐపీఎల్ సీజన్‌లోనే అత్యధిక పరుగులు (890) సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు.. అత్యధిక వికెట్లు దక్కించుకున్న బౌలర్‌గా కూడా గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ షమీ(28 వికెట్లు) నిలవడం విశేషం. మోహిత్ శర్మ (27), రషీద్ ఖాన్‌కు 27 వికెట్లు దక్కడం గమనార్హం. చెన్నై ఓపెనర్ కాన్వేకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. కాన్వే 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47 పరుగులు చేసి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Updated Date - 2023-06-18T16:57:28+05:30 IST