Share News

IND vs AUS 3rd T20I: మ్యాడ్‘మ్యాక్స్’ ఇన్నింగ్స్.. భారత్‌పై ఆస్ట్రేలియా సంచలన విజయం

ABN , First Publish Date - 2023-11-28T23:03:32+05:30 IST

వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు దాదాపు ఓడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు.. మ్యాక్స్‌వెల్ సింగిల్ హ్యాండెడ్‌గా తన జట్టుని గెలిపించిన సందర్భం గుర్తుందా? ఇప్పుడు భారత్‌తో జరిగిన మూడో టీ20లోనూ..

IND vs AUS 3rd T20I: మ్యాడ్‘మ్యాక్స్’ ఇన్నింగ్స్.. భారత్‌పై ఆస్ట్రేలియా సంచలన విజయం

IND vs AUS 3rd T20I: వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు దాదాపు ఓడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు.. మ్యాక్స్‌వెల్ సింగిల్ హ్యాండెడ్‌గా తన జట్టుని గెలిపించిన సందర్భం గుర్తుందా? ఇప్పుడు భారత్‌తో జరిగిన మూడో టీ20లోనూ అతడు అదే ఊచకోత కోశాడు. తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రంగంలోకి దిగిన అతగాడు.. శతక్కొట్టి గెలిపించుకున్నాడు. భారతదేశానికి దక్కాల్సిన విజయాన్ని అతడు లాక్కున్నాడు. ఇతర బ్యాటర్లను కట్టడి చేయగలిగిన భారత బౌలర్లు.. అతడ్ని మాత్రం ఔట్ చేయలేకపోయారు. అతడు చితక్కొట్టడం వల్లే.. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని ఐదు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఛేధించగలిగింది.


తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (123 నాటౌట్) అద్భుతమైన సెంచరీ చేయడం వల్లే భారత అంత భారీ స్కోరు చేయగలిగింది. సూర్యకుమార్ యాదవ్ (39), తిలక్ వర్మ (31) పర్వాలేదనిపించారు. ఇక 223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసి గెలుపొందింది. ఆసీస్ ఓపెనర్లు రావడం రావడంతోనే భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఎడాపెడా షాట్లతో రెచ్చిపోయారు. కానీ.. ఆ తర్వాత భారత బౌలర్లు ఆసీస్ ఆటగాళ్లకు ఝలక్ ఇచ్చారు. వెనువెంటనే మూడు వికెట్లు తీశారు. దీంతో.. మ్యాచ్ భారత్ వైపుకు మళ్లింది. ఇక విజయం భారత్‌దేనని అంతా ఫిక్సయ్యారు.

సరిగ్గా అప్పుడే ల్యాండ్ అయిన మ్యాక్స్‌వెల్.. ఆ ఆశలపై నీళ్లు చల్లుతూ వచ్చాడు. ఓవైపు స్టోయినిస్, టిమ్ డేవిడ్ ఔటైనా.. మ్యాక్స్‌వెల్ మాత్రం తన జోరుని ఆపలేదు. అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్‌పై ఎలా విరుచుకుపడ్డాడో, సరిగ్గా అలాగే భారత బౌలర్లను చీల్చి చెండాడాడు. తన 360 డిగ్రీ ఆటతో విధ్వంసం సృష్టించాడు. 48 బంతుల్లోనే 104 పరుగులు చేశాడంటే.. అతడు ఏ స్థాయిలో విజృంభించాడో మీరే అర్థం చేసుకోండి. అతనికి మాథ్యూ వేడ్ కూడా మంచి సహకారం అందించాడు. దీంతో.. చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. భారత బౌలర్లో ప్రసిద్ధ్ కృష్ణ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 68 పరుగులిచ్చాడు. రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్, అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్ తలా వికెట్ పడగొట్టారు.

Updated Date - 2023-11-28T23:03:34+05:30 IST