Madhubala: హీరోకి ఉన్న ఆ అలవాటు మాన్పించిన హీరోయిన్...

ABN , First Publish Date - 2023-02-23T14:32:18+05:30 IST

ప్రపంచంలోనే అత్యంత అందమైన అమ్మాయి తనకు ప్రపోజ్ చేసిందంటే నమ్మలేకపోయాడు.

Madhubala: హీరోకి ఉన్న ఆ అలవాటు మాన్పించిన హీరోయిన్...
Madhubala

మధుబాల పేరువెనుక మసకబారి, పొగచూరిన ఆమె వేదన ఉంది. ఆ కన్నుల వెనుక దాచేసిన అనంత దుఃఖం నిక్షిప్తమై ఉంది. ప్రేక్షకుని పెదవులపై ఆనందకాంతులు పూయించే ఆ మోము వెనుక ఎన్ని అగాథాల చీకటులున్నాయో, మధుబాలను తలుకోగానే ఆమె పోషించిన పాత్రలన్నీ మనసులో మెదులుతాయి. నటనలో లెజెండ్, కళామతల్లికి గారాలపట్టి, రూపంలో ఊర్వశి, నడక, నడతా అంతా మేనక పోలికే‌. అంతటి అందగత్తె నడుచుకుంటూ సెట్స్‌లోకి వస్తుంటే చుట్టుపక్కలున్న ప్రతి మగాడికీ ఆమె చూపు సోకితే చాలానే కోరిక తప్పక కలిగేది. నల్లని గుండ్రటి కళ్ళతో, మంత్రముగ్ధుల్ని చేసే ముఖారవిందాన్ని చూస్తేనే కడుపునిండిపోయేది. అది తెరమీద సినిమా అయినా సరే, మధుబాల రూపానికి దాసోహమవ్వాల్సిందే.. చక్కని డాన్సర్, అనార్కలిగా కనిపించి తన హావభావాలతో తళుక్కుమనిపించింది. మొఘల్-ఎ-ఆజమ్ సినిమా తెరమీదనే కాదు ఆమె జీవితంలోనూ మరపురానిదిగా మిగిలిపోయింది.

కొందరు ఎందుకు పుడతారో, ఎందుకు తొందరగా వెళిపోతారో అర్థం చేసుకోలేం. గొప్పవారంతా వీలైనంత త్వరగా భూమ్మీద పని చూసుకుని బయలుదేరిపోతారు కామోసు. 1933 ఫిబ్రవరి 14న జన్మించిన మధుబాల నిజంగా ప్రేమదేవతే.. ఈ 14న ఆమెను తలుచుకోని వారుండరు. ప్రపంచమంతా ప్రేమలో మునిగితేలిపోతూనే, ప్రేమదేవతగా మనసుల్ని తన రూపంతో నింపేసిన ఈ దేవత కోసం తలుచుకుని మనసు తడిచేసుకోని మధుబాల ఆరాధకులుండరు. ఈ అందాల రాశి పక్కన పోటీపడి అప్పటి తారలెవరూ నిలవలేకపోయారు. అది మధుబాలకున్న ఫాలోయింగ్.. ఈరోజు, మధుబాల 54వ వర్ధంతి సందర్భంగా, ఆమె నాలుగు అసంపూర్ణ ప్రేమకథలు, విఫలమైన వివాహం, సినిమా పోరాటాల గురించి తలుచుకుంటే ఆ కూనలమ్మ హృదయవేదన మన మనసుల్ని కూడా ద్రవించేలా చేస్తుంది.

కుటుంబ పోషణ కోసం తండ్రి రిక్షా నడిపాడు.

మధుబాల ఫిబ్రవరి 14, 1933లో ఢిల్లీలో జన్మించింది. తండ్రిపెట్టిన పేరు ముంతాజ్ జహాన్ బేగం దేహ్లావి. తండ్రి అతావుల్లా ఖాన్, తల్లి అయేషా బేగం 11 మంది పిల్లలలో ఆమె ఐదవ సంతానం. మధుబాల తండ్రి తొలినాళ్లలో కుండలు తయారు చేసే వ్యక్తి దగ్గర పనిచేసేవాడు. ఆ తర్వాత పెషావర్‌లోని పొగాకు ఫ్యాక్టరీలో పనిచేశాడు, కానీ కొద్ది రోజుల్లోనే ఆ ఉద్యోగం కూడా పోగొట్టుకుని కుటుంబ పోషణ కోసం రిక్షా లాగాడు.

ఐదుగురు తోబుట్టువులూ చనిపోయారు..

మధుబాల కుటుంబం ముంబైలోని మలాడ్‌లో నివసించేప్పుడు తండ్రిని పట్టుబట్టి పక్కనే ఉన్న సినిమా హాలులో సినిమా చూడటానికి వెళ్ళింది మధుబాల. మిగతా తోబుట్టువులంతా ఇంట్లోనే ఉన్నారు, అకస్మాత్తుగా అక్కడ మంటలు చెలరేగి, ఇల్లు మొత్తం కాలిపోయింది. ఈ ప్రమాదంలోనే తోబుట్టువులందరినీ పోగొట్టుకుంది. ఈ ఘటనతోనే బోసిపోయిన ఇంటిని తన నవ్వులతో నింపాలని ఇంటి బాధ్యతను తన భుజాన వేసుకోవడానికి కారణమైంది. సుదీర్ఘ పోరాటం తర్వాత రంజిత్ ఫిల్మ్ స్టూడియోలో నెలకు రూ.300 ఉద్యోగం సంపాదించింది. బాల నటిగా పాత్రలు చేస్తూనే పెద్ద చిత్రాలకు బుక్ అయింది. దీని తరువాత, మధుబాల చలనచిత్ర ప్రపంచంలో ముందుకు సాగిందిమహల్, బాదల్, కలి, బర్సాత్ కీ రాత్, నీల్ కమల్ వంటి చిత్రాలలో తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకుంది.

అందమే చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రను ఇచ్చింది..

ఒకరోజు అతని తండ్రి ఒక జ్యోతిష్యుడిని కలిశాడు. తండ్రి తన కుటుంబంలోని కష్టాలను చెప్పాడు, అప్పుడు జ్యోతిష్కుడు అతని కుమార్తె మధుబాల అరుదైన వజ్రం అవుతుందని జోస్యం చెప్పాడు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఆయన పేరు మారుమోగిపోతుందన్నాడు. ఆ తరువాత ఈ జోస్యమే నిజం చేసాడు తండ్రి. ఆ రోజుల్లో ఆల్ ఇండియా రేడియోలో పిల్లల కార్యక్రమం జరిగేది, అందులో మధుబాల కూడా పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ కార్యక్రమంలోనే బాంబే టాకీస్ జనరల్ మేనేజర్ రాయ్ బహదూర్ చున్నీలాల్ పాల్గొన్నారు. అతని చూపు బేబీ ముంతాజ్‌పై పడగానే ఆమె అందానికి ఆరాధకుడయ్యాడు.

ఆ సమయంలో బాంబే టాకీస్‌లో 'బసంత్' సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం ఓ చిన్నారి కోసం వెతుకుతున్నారు. ఈ పాత్ర కోసం చున్నీలాల్ మధుబాల టాకీస్ ఓనర్ దేవికా రాణిని కలిసేలా చేశాడు. దేవికా రాణి చిన్ని మధుబాలను చూడగానే ఆ పిల్ల ముఖంలోని కళ ఆకట్టుకుంది. ఇంకేముంది చిత్రసీమకు మధుబాల 1942లో విడుదలైన బసంత్ చిత్రంతో నటనా జీవితాన్ని ప్రారంభించింది.

WhatsApp Image 2023-02-23 at 2.39.21 PM.jpeg

హాలీవుడ్ నుండి కూడా సినిమా ఆఫర్లు వచ్చినా..తండ్రి నిరాకరించాడు.

మధుబాల నటనలో వైవిధ్యానికి, నటనా కౌశలానికి విదేశాల్లో కూడా విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఒకసారి హాలీవుడ్‌కి చెందిన ప్రముఖ దర్శకుడు కాప్రా తన సినిమాల్లో నటించమని మధుబాలకు ఆఫర్ ఇచ్చాడు, కానీ ఆమె తండ్రి ఆ ఆఫర్‌ని తిరస్కరించాడు. బాగా డబ్బు, పేరు తెచ్చిపెడుతున్న కూతురు మీద పూర్తి అధికారం తండ్రి చేతిలోనే ఉండేది. మధుబాల స్వతంత్రంగా ఏ పనీ చేయలేని స్థితిలోకి వెళిపోయింది.

ప్రేమ అసంపూర్ణమే అయినా, గులాబి ఇవ్వడం మాత్రం మరిచిపోలేదు ఆప్రేమికుడు..

మధుబాలకు చిన్నవయసులోనే తొలి ప్రేమ పలకరించింది. ఆమె ఢిల్లీలో నివసించినప్పుడు, ఆమె లతీఫ్‌పై ప్రేమను పెంచుకుంది, అతను తరువాత IAS అధికారిగా విధుల్లో చేరాడు. మధుబాల ముంబైకి షిఫ్ట్ అయిందని తెలుసుకున్న లతీఫ్ చాలా బాధపడ్డాడు. ఆమె తన నుండి దూరం కావడం అతనికి ఇష్టం లేదు. అదే సమయంలో మధుబాల కూడా అతడికి దూరంగా ఉండాలనుకోలేదు. ముంబైకి బయలుదేరే ముందు ఇద్దరూ చివరిసారిగా కలుసుకున్నప్పుడు, మధుబాల అతనికి గులాబీని ఇచ్చింది. ముంబైకి వచ్చిన తర్వాత, మధుబాల సినిమాలలో బిజీ అయ్యింది, కానీ లతీఫ్ ఆమెను ఎప్పటికీ మర్చిపోలేదు. మధుబాల మరణానంతరం లతీఫ్ ఆమె వర్ధంతి రోజున సమాధిని చూసేందుకు వెళ్ళినప్పుడల్లా దానిపై గులాబీ పువ్వును చాలా ఏళ్ళు పెట్టేవాడట..

సెట్‌లో రక్తపు వాంతులు చేసుకున్న మధుబాల..

ఈ సినిమా షూటింగ్ సమయంలో మధుబాల ఒకరోజు రక్తపు వాంతులు చేసుకోవడంతో అంతా అవాక్కయ్యారు. చిన్నతనం నుండి గుండెలో రంధ్రం ఉందని, ఆ సమయంలో చికిత్స సాధ్యం కాదని తేలింది. డాక్టర్ ఆమెకు బెడ్ రెస్ట్ అవసరమని సలహా ఇచ్చారు, కానీ మధుబాల సినిమాల్లో నటిస్తూనే ఒకదాని తర్వాత ఒకటి హిట్ చిత్రాలను చేస్తూనే ఉంది, మరోవైపు ఆమె అనారోగ్యం కూడా పెరుగుతూ వచ్చింది.

మధుబాలకు ఇచ్చిన మాట కోసం 14 ఏళ్ల పాటు మద్యం ముట్టని హీరో..

1951లో విడుదలైన బాదల్‌లో ప్రేమనాథ్‌తో కలిసి మధుబాల కనిపించింది. ఒకరోజు షూటింగ్ సమయంలో, మధుబాల ప్రేమ్‌నాథ్ మేకప్ రూమ్‌కి వెళ్లి ప్రేమ లేఖతో పాటు ఓ గులాబీని ఇచ్చింది. అప్పుడు ఏం జరుగుతుందో ప్రేమనాథ్‌కు అర్థం కాలేదు. అతను లేఖను చదివినప్పుడు, అందులో ఇలా రాసి ఉంది - మీరు నన్ను ప్రేమిస్తే, దయచేసి ఈ గులాబీని అంగీకరించండి, లేకపోతే ఈ లేఖ, పువ్వులు తిరిగి ఇవ్వండి. ఈ లేఖ చదివి ప్రేమ్‌నాథ్ షాక్ అయ్యాడు. ప్రపంచంలోనే అత్యంత అందమైన అమ్మాయి తనకు ప్రపోజ్ చేసిందంటే నమ్మలేకపోయాడు. ఆమె ప్రేమను సంతోషంగా అంగీకరించాడు.

WhatsApp Image 2023-02-23 at 2.26.08 PM.jpeg

వీరిద్దరి మధ్య ప్రేమ ఎంత గాఢంగా ఉండేదంటే ప్రేమ్‌నాథ్‌కి సినిమా ఆఫర్ వచ్చినప్పుడల్లా మధుబాలని అడిగిన తర్వాతే సినిమాలకు సైన్ చేసేవాడు. ఈ కారణంగానే మధుబాల కూడా మతం మారి పెళ్లి చేసుకోవాలని ప్రేమ్‌నాథ్‌ను ఒప్పించాలని చూసినప్పుడు అతను పెళ్ళికి నిరాకరించాడు. ఈకారణంతోనే అలనాటి అగ్ర నటి బీనా రాయ్‌ని పెళ్లి చేసుకున్నాడు ప్రేమ్‌నాథ్‌. ఈ వార్తతో మధుబాల తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ప్రేమనాథ్‌తో ఇలా చెప్పింది - మీరు నా ప్రేమను తిరస్కరించారు, మీరు కూడా ప్రేమ కోసం ఆరాటపడే రోజు వస్తుందని కోపంలో చెప్పి వెళ్ళిపోయింది మధుబాల. చివరికి అదే జరిగింది. ప్రేమ్‌నాథ్‌, బీనా రాయ్‌ల వైవాహిక జీవితం అంత బాగా సాగలేదు. ప్రేమ్‌నాథ్‌ మద్యం సేవించడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న మధుబాల.. మద్యం తాగవద్దని ప్రేమనాథ్‌తో ప్రమాణం తీసుకుంది. మద్యంమే తాగాలనుకుంటే రక్తం తాగినా మంచిదే అంది.. ఈ మాటలు ప్రేమనాథ్ హృదయాన్ని తాకాయి. ఈ ఒక్కమాటతోనే దాదాపు 14 ఏళ్ల పాటు అతను మద్యం ముట్టలేదు.

ఈరోజు నువ్వు వెళ్ళిపోతే, నేను ఎప్పటికీ నీ దగ్గరకు రాను: దిలీప్ కుమార్

తరానా సినిమా సెట్స్‌లో దిలీప్ కుమార్, మధుబాల కలుసుకున్నారు. మొదట్లో ఇద్దరూ స్నేహితులే అయినా క్రమంగా మధుబాల ఇష్టపడడం మొదలుపెట్టింది. ఒకసారి ఆమె తన సన్నిహిత మేకప్ ఆర్టిస్ట్ ద్వారా దిలీప్ కుమార్‌కి ఒక లేఖతో పాటు గులాబీని పంపింది. లేఖలో ఇలా రాసి ఉంది- మీకు నేనంటే ఇష్టం అయితే ఈ లేఖను పువ్వును అంగీకరించండి, లేకుంటే వెనక్కి పంపండి. దిలీప్ కుమార్ లేఖను అంగీకరించారు. ఆ తర్వాత వారి ప్రేమ చిగురించింది.

1955లో మొదటిసారిగా, ఇన్సానియత్ సినిమా ప్రీమియర్ సమయంలో, ఇద్దరూ కలిసి బహిరంగ ప్రదేశంలో కనిపించారు. అయితే, ఇద్దరూ కలిసి బహిరంగ ప్రదేశంలో కనిపించడం కూడా ఇదే చివరిసారి. తొమ్మిదేళ్ళు ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇద్దరి మధ్యా మధుబాల తండ్రి కల్పించుకోవడంతో ప్రేమకు బీటలు వారాయి. దిలీప్ కుమార్ చాలా అహంకారని, మొండివాడనే అభిప్రాయాలు మధుబాల తండ్రికి బలంగా ఉండేవి. ఓ రోజు దిలీప్ కుమార్ పెళ్లి చేసుకుందాం అని చెప్పడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. దీనిపై దిలీప్ కుమార్ మాట్లాడుతూ - ఈరోజు నువ్వు వెళ్లిపోతే నేను ఎప్పటికీ నీదగ్గరకు రాను. అన్నాడు. దీని తర్వాత అతను నిజంగానే మధుబాల దగ్గరకు తిరిగి రాలేదు. మొఘల్-ఎ-ఆజం చిత్రంలో అనార్కలి, సలీం జంటలో దిలీప్ కుమార్, మధుబాల చాలా ఇష్టపడ్డారు, కానీ షూటింగ్ సమయంలో ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఇదే పంతాన్ని అతను మధుబాల చనిపోయినా వదలలేదు. ఆమెను కడసారి చూడడానికి కూడా వెళ్ళలేదు. ప్రేమలో త్వాగం ఉంటుంది. దిలీప్ ప్రేమలో ప్రేమతో పాటు బాధతో కూడిన కక్ష కూడా ఉంది.

నాకు చనిపోవాలని లేదు, బతకాలని ఉంది: మధుబాల

1960లో మధుబాల కిషోర్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు. కిషోర్‌కుమార్‌కు అనారోగ్యం గురించి తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు. పెళ్లి తర్వాత, అతను మధుబాలను లండన్‌కు తీసుకెళ్లాడు, అక్కడ ఆమె 2 సంవత్సరాలు మాత్రమే జీవించగలదని తెలిసింది. కిషోర్ లో ఓ నిర్లక్ష్యం కనిపించేది..మధుబాల పరిస్థితి రోజురోజుకు దిగజారింది. శరీరం స్వాధీనంలో లేదు. పైగా ఊపిరితిత్తుల వ్యాధి కూడా ఉంది, దాని కారణంగా ప్రతి నాలుగు-ఐదు గంటలకు ఆక్సిజన్ ఇవ్వాల్సి వచ్చింది. మధుబాల చాలా సేపు మంచం మీదనే ఉంది. శరీరంలో ఎముకలు మాత్రమే మిగిలాయి. భర్తను చూసి ఎప్పుడూ ఏడుస్తూ 'నాకు బతకాలని ఉంది, చావాలని లేదు' అని చెప్పేది. దీంతో ఆమె బాగానే ఉందని భావించి మేకప్ వేసుకునేవాడు భర్త కిషోర్ కుమార్.

దేవుడు చెక్కిన పాలరాతి శిల్పం..

ఎందరో ప్రేక్షకుల హృదయాలనే కాదు.. ఈ పుత్తడిబొమ్మ అప్పటి టాప్ కో స్టార్స్ మతుల్ని కూడా పోగొట్టింది. "మధుబాల వేరొకరితో ప్రేమలో ఉందని నాకు తెలుసు, కానీ నేను ఆమెతో పిచ్చిగా ప్రేమలో పడ్డాను. నేను ఆమె కంటే అందమైన స్త్రీని ఎప్పుడూ చూడలేదు". ఈమాటలను 'వీనస్ ఆఫ్ ది స్క్రీన్' మధుబాల కోసం షమ్మీ కపూర్ తన జీవిత చరిత్ర 'షమ్మీ కపూర్ ది గేమ్ ఛేంజర్'లో రాశాడు. మధుబాల అందాల మాయాజాలం అలాంటిది మరి., షమ్మీ కపూర్ ఆమెను ప్రేమించకుండా ఉండలేకపోయాడు..అంతేనా మధుబాల అందం ఎంతగా అతనిమీద ప్రభావం చూపిందంటే, మధుబాల స్వచ్ఛమైన శాఖాహారి, ఆమెను చూడగానే షమ్మీ నాన్ వెజ్‌ను అలవాటును వదులుకున్నాడట.

మధుబాల తండ్రి దిలీప్ కుమార్‌తో పెళ్లి చేయడానికి సిద్ధంగా లేడు, కానీ కమల్ అమ్రోహితో వివాహం చేయడానికి సిద్ధపడ్డాడు. మధుబాలకు లక్షలాది మంది అభిమానులు ఉన్నా.. దురదృష్టవశాత్తూ ఆమె కోరుకున్న వ్యక్తిని జీవితంలోకి తెచ్చుకోలేకపోయింది. మధుబాల కిషోర్ కుమార్‌ను వివాహం చేసుకుంది, కానీ చివరి క్షణంలో ఆమె అనారోగ్యం పాలైనప్పుడు, అతను కూడా ఆమెకు దూరంగా ఉన్నాడు. కేవలం 36 ఏళ్ల వయసులో, 23 ఫిబ్రవరి 1969న, మధుబాల ప్రపంచానికి వీడ్కోలు పలికింది.

Updated Date - 2023-02-23T15:49:58+05:30 IST