Share News

Hotel Horror: హోటల్‌లో 500 మంది కాలేజీ అమ్మాయిలు.. రూమ్స్‌ను చూసి డౌట్.. ఆన్‌లైన్‌లో హోటల్‌ పేరుతో వెతికితే..!

ABN , First Publish Date - 2023-11-30T14:33:12+05:30 IST

జమ్మూ కశ్మీర్ నుంచి విజ్ఞానయాత్రకు వచ్చిన 500 మంది కాలేజీ విద్యార్థినులకు ముంబైలోని ఓ హోటల్‌లో భయంకరమైన అనుభవం ఎదురయింది. హోటల్‌లో తమకు కేటాయించిన గదులన్నీ అపరిశుభ్రంగా ఉండటమే కాకుండా.. బెడ్ షీడ్స్ కూడా దుర్వాసన రాసాగాయి. అనుమానంతో ఆ హోటల్ పేరును గూగుల్‌లో సెర్చ్ చేస్తే..

Hotel Horror: హోటల్‌లో 500 మంది కాలేజీ అమ్మాయిలు.. రూమ్స్‌ను చూసి డౌట్.. ఆన్‌లైన్‌లో హోటల్‌ పేరుతో వెతికితే..!

ముంబై: జమ్మూ కశ్మీర్ నుంచి విజ్ఞానయాత్రకు వచ్చిన 500 మంది కాలేజీ విద్యార్థినులకు ముంబైలోని ఓ హోటల్‌లో భయంకరమైన అనుభవం ఎదురయింది. హోటల్‌లో తమకు కేటాయించిన గదులన్నీ అపరిశుభ్రంగా ఉండటమే కాకుండా.. బెడ్ షీడ్స్ కూడా దుర్వాసన రాసాగాయి. హోటల్‌లో పరిస్థితులను చూసి అక్కడ తమకు సరైన భద్రత ఉంటుందా..? అన్న అనుమానం ఆ విద్యార్థినుల్లో కలిగింది. అసలు ఈ హోటల్‌కు నెటిజన్లు ఏం రివ్యూలు ఇచ్చారా..? అని గూగుల్‌లో పేరును టైప్ చేయగానే కనిపించిన లింక్స్ చూసి ఆ విద్యార్థినులు కంగుతిన్నారు. ఆ హోటల్‌లో గతంలో చాలా సార్లు సెక్స్ రాకెట్ బృందాలను పట్టుకున్నట్టుగా వార్తలు, వీడియోలు కనిపించడంతో అంతా నివ్వెరపోయారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఐఆర్‌‌సీటీసీ కొన్నాళ్ల క్రితమే జ్ఞానోదయ ఎక్స్‌ప్రెస్ అనే సర్వీసును ప్రారంభించింది. కాలేజ్ ఆన్ వీల్స్ అనే పేరుతో ఓ విజ్ఞానయాత్రకు రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న పలు యూనివర్శిటీలకు విద్యార్థులను తీసుకెళ్తుంది. కొంత రుసుము తీసుకుని భోజనం, బస వంటి ఏర్పాట్లను అన్నిటినీ ఐఆర్‌సీటీసీయే చూసుకుంటుంది. అయితే జమ్మూ కశ్మీర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఇటీవల ఈ విజ్ఞానయాత్రకు తమ రాష్ట్ర విద్యార్థులను తీసుకెళ్లాలని భావించింది. దీనిలో భాగంగా జమ్మూ కశ్మీర్ లోని పలు కాలేజీలకు చెందిన 800 మంది విద్యార్థినులు ఈ అడ్వెంచర్ ప్రాజెక్టులో భాగమయ్యారు. నవంబర్ 19న జమ్మూ కశ్మీర్ నుంచి ఈ యాత్ర ప్రారంభమయింది. అయిదు రోజుల తర్వాత ముంబైకు ఈ జ్ఞానోదయ ఎక్స్‌ప్రెస్ చేరుకుంది.

అయితే విద్యార్థినులకు వసతి సౌకర్యం కల్పించడంలో భాగంగా ముంబైలోని గోరెగాన్ ప్రాంతంలోని రాయల్ పామ్ హోటల్‌కు ఓ 500 మంది విద్యార్థినులను పంపించారు. ఇంకో 300 మంది అమ్మాయిలకు మరో హోటల్‌లో ఏర్పాట్లను చేశారు. అయితే రాయల్ పామ్ హోటల్‌కు చేరుకున్న అమ్మాయిలకు.. అక్కడి వాతావరణం కాస్త ఇబ్బందికరంగా అనిపించింది. వారికి కేటాయించిన గదులు కూడా అపరిశుభ్రంగా కనిపించాయి. బెడ్ షీట్స్ కూడా దుమ్ముపట్టిపోయి తీవ్ర దుర్వాసన రాసాగాయి. హోటల్‌లో సీసీ కెమెరాలు కూడా లేవు. అక్కడి సిబ్బంది వ్యవహార శైలి కూడా అనుమానాస్పదంగా అనిపించింది. దీంతో ఆ విద్యార్థినుల్లో కొందరు ఆ హోటల్ పేరును గూగుల్ లో సెర్చ్ చేసి రివ్యూలు వెతకసాగారు.

హోటల్ పేరును గూగుల్‌లో సెర్చ్ చేయగానే వచ్చిన వార్తలను, వీడియోలను చూసిన విద్యార్థినులు కంగుతిన్నారు. గతంలో ఇదే హోటల్‌లో చాలాసార్లు భారీ సెక్స్ రాకెట్స్‌ను పోలీసులు పట్టుకున్నారన్న విషయం తెలిసి అంతా అవాక్కయ్యారు. అయినప్పటికీ ఎలాగోలా ఈ ఒక్కరోజు ఇదే హోటల్లో ఉందామని అంతా నిర్ణయించుకున్నారు. అయితే రాత్రి భోజనాన్ని ఆ హోటల్ సిబ్బంది ఓ హాల్‌లో ఏర్పాటు చేశారు. కాలేజీ విద్యార్థినులు అంతా ఆ హాల్‌లోకి వెళ్తే కేవలం 100 కుర్చీలు మాత్రమే కనిపించాయి. అయినప్పటికీ సర్దుకుని భోజనం చేయడం ప్రారంభించించారు. ఇంతలో సడన్‌గా అప్పుడప్పుడు కరెంట్ కట్ అవడాన్ని విద్యార్థినులు గమనించారు. అయితే ప్రతీ పదిహేను, ఇరవై నిమిషాలకు ఓసారి ఇలాగే జరుగుతూ ఉండటంతో పవర్ కట్స్ కారణం కాదన్న అనుమానం వారికి వచ్చింది. దీంతో నిశితంగా గమనిస్తే.. పవర్ కట్స్ సమయంలో విద్యార్థినులను అక్కడున్న హోటల్ సిబ్బంది అసభ్యంగా తాకుతూ ఉండటం.. దాన్ని సీక్రెట్ గా మరో సిబ్బంది వీడియో తీస్తుండటం కనిపించింది.

దీంతో ఆ హోటల్ సిబ్బంది ఫోన్‌ను తీసుకుని.. ఆ వీడియోను డిలీట్ చేయబోతే.. అందులో మరిన్ని అభ్యంతరకమైన వీడియోలు, ఫొటోలు కనిపించాయి. దీంతో ఇది కాస్తా తీవ్ర వివాదాస్పదంగా మారింది. హోటల్ యాజమాన్యానికి పోన్ చేసినా.. వారి నుంచి ఎలాంటి స్పందన కూడా కనిపించలేదు. దీంతో విద్యార్థినులతో పాటు వచ్చిన జమ్మూ కశ్మీర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు, ఐఆర్‌సీటీసీ అధికారులు రంగంలోకి దిగారు. ఈ విషయంపై తాము విచారణ చేస్తామనీ.. కాంట్రాక్టర్‌తో పాటుగా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని ఐఆర్‌సీటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సీమా కుమార్ విద్యార్థినులకు హామీ ఇచ్చారు.

కాగా, ఆ హోటల్‌లో ఆ రోజు రాత్రి అంతా ఉండాలంటే తమకు భయం వేసిందనీ, నిద్ర కూడా పట్టలేదని కాలేజీ విద్యార్థినులు అంతా వాపోయారు. ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి బయటపడతామా అని ఎదురు చూశామన్నారు. తమకు బస ఏర్పాటు చేసిన హోటల్ చరిత్రను ఆరా తీయకపోవడం శోచనీయమన్నారు. ఈ ఘటనకు కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2023-11-30T14:33:13+05:30 IST