AP Politics: ఇంకో ఛాన్స్ ఇవ్వాలని కోరుతూ జగన్ యాత్ర.. ప్రజల్లోకి వెళ్లే దమ్ముందా?

ABN , First Publish Date - 2023-09-26T19:00:43+05:30 IST

తనకు ఇంకో ఛాన్స్ ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్ మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆశీర్వాద యాత్ర పేరుతో ఈసారి జనంలోకి వెళ్తున్నట్లు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి.

AP Politics: ఇంకో ఛాన్స్ ఇవ్వాలని కోరుతూ జగన్ యాత్ర.. ప్రజల్లోకి వెళ్లే దమ్ముందా?

ఏపీ సీఎం జగన్ మరోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నారు. గత ఎన్నికలకు ముందు రాష్ట్రమంతటా పాదయాత్ర చేసి తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను వేడుకున్నారు. నవరత్నాలు అంటూ హామీలు ఇచ్చి అందరినీ మభ్యపెట్టి ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో అధికారం సంపాదించారు. తీరా ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చాక రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. కేంద్రంతో లాలూచీ పడి ప్రత్యేక హోదాను మరుగున పడేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండా నాలుగేళ్లుగా తాత్సారం చేస్తున్నారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మాట తప్పిందే కాకుండా మద్యం ధరలు పెంచి పేదలను దోచుకుంటున్నారు. నిరుద్యోగుల గురించి పట్టించుకోకుండా సొంత పార్టీ నేతల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష నేతలపై వరుసగా కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో తనకు ఇంకో ఛాన్స్ ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్ మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆశీర్వాద యాత్ర పేరుతో ఈసారి జనంలోకి వెళ్తున్నట్లు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈసారి ఆశీర్వాద యాత్ర పేరుతో జగన్ ప్రజలకు హామీలు ఇవ్వరంట. చంద్రబాబు అవినీతి కేసులపై ప్రజలకు వివరిస్తారట. తనను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను వేడుకుంటారట.

jagan kiss.jpg

సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జగన్ ప్రజల దగ్గరకు వెళ్లలేదు. ఎలాంటి యాత్రలు చేపట్టలేదు. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో మరోసారి ప్రజల వద్దకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అయితే ఒకప్పుడు పాదయాత్ర పేరుతో ప్రజలకు పోటీ పడి ముద్దులు పెట్టిన జగన్.. ఇప్పుడు సొంత కార్యకర్తలను, నేతలను కలవడానికి కూడా ఇష్టపడటం లేదు. అటు ఇప్పటి వరకు బటన్ నొక్కే సభలకు పరదాల చాటున సీఎం జగన్ హాజరవుతున్నారు తప్పితే ప్రజలను నేరుగా కలిసిన సందర్భాలు లేవు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో జనంలోకి వచ్చేందుకు జగన్ సాహసిస్తారా అన్న విషయం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే సర్వేల్లో వైసీపీ ఓటమి తప్పదని క్లారిటీ వచ్చేసింది. ఈ నేపథ్యంలో క్యాడర్‌కు దగ్గర కావడానికి జగన్ ఆశీర్వాద యాత్రను ఉపయోగించుకుంటారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ యాత్రలో వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసి కార్యకర్తలతో మమేకం అవుతూ ప్రత్యర్థులపై మాటల తూటాలను ప్రయోగించేందుకు జగన్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.


టీడీపీ-జనసేన పొత్తు చూసి జగన్‌లో ఓటమి భయం ప్రారంభమైందని.. అందుకే ప్రజా సమస్యలను డైవర్ట్ చేసేందుకు ప్రతిపక్ష నేతల అరెస్టులను తెరపైకి తెచ్చారని సోషల్ మీడియా వేదికగా పలువురు చర్చించుకుంటున్నారు. అందుకే ఆశీర్వాద యాత్ర చేసి ప్రతిపక్ష నేతలను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వాలని జగన్ ఆకాంక్షిస్తున్నారు. అయితే ఆశీర్వాద యాత్ర సందర్భంగా జగన్ బస్సెక్కి వస్తారా.. రైలెక్కి వస్తారా.. కారెక్కి వస్తారా లేదా తనకు అలవాటైన రీతిలో హెలికాప్టర్ ఎక్కి వస్తారా అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఎలా వచ్చినా ఎన్నికల నాటికి ప్రతి జిల్లాలో పర్యటించాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. తాను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తాయని గట్టి నమ్మకంతో కనిపిస్తున్న జగన్‌ను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు.. రాష్ట్రాన్ని భారీస్థాయిలో అప్పులపాలు చేసినందుకు జేజేలు కొడతారా లేదా తరిమికొడతారా అన్న విషయం ఆసక్తి రేపుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ తీరుపై సొంత పార్టీ నేతల్లోనూ వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో వాళ్లు ఆశీర్వాద యాత్రకు ఎంతమాత్రం సహకరిస్తారో కూడా వేచి చూడాలని అంటున్నారు. వైనాట్ 175 నినాదం ఏ మాత్రం పనిచేస్తుందో మరో ఆరునెలల్లో తెలిసిపోతుందని చర్చించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

AP Politics: మాజీ మంత్రి పేర్ని నానికి ఏమైంది? ఆలయంలో ఇదేం ప్రవర్తన?

Andhra Pradesh: జగన్ సర్కారుకు టీచర్లు షాక్.. జీపీఎస్‌ రద్దు చేయాలని ఆందోళనలు

Updated Date - 2023-09-26T19:00:43+05:30 IST