Jagan: జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు జగన్ చేస్తున్న పనేంటంటే..

ABN , First Publish Date - 2023-01-22T18:36:27+05:30 IST

ఆ టీడీపీ నేత జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. ఒక్కమాటలో చెప్పాలంటే క్లోజ్ ఫ్రెండ్ కూడా. 2019లో మెజార్టీ నియోజకవర్గాల్లో ఫ్యాన్ గాలి వీచినా.. ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలో..

Jagan: జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు జగన్ చేస్తున్న పనేంటంటే..

ఆ టీడీపీ నేత జూనియర్ ఎన్టీఆర్‌కు (Jr NTR) అత్యంత సన్నిహితుడు. ఒక్కమాటలో చెప్పాలంటే క్లోజ్ ఫ్రెండ్ కూడా. 2019లో (2019 AP Elections) మెజార్టీ నియోజకవర్గాల్లో ఫ్యాన్ గాలి వీచినా.. ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలో మాత్రం సైకిలే గెలిచింది. కానీ.. ఓటర్ల అభీష్టానికి వ్యతిరేకంగా గెలిచిన కొన్నాళ్లకే ఆయన జగన్ పార్టీకి (YCP) జై కొట్టారు. వైసీపీకి మద్దతు తెలిపిన నాటి నుంచి టీడీపీ అధినేతపై, ఆయన కుమారుడిపై అవాకులూ చవాకులూ పేలడమే పనిగా పెట్టుకున్నారు. ఆ టీడీపీ ఎమ్మెల్యే ఎవరో ఈపాటికే అర్థమై ఉంటుంది. ఆయనే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi). జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన ఈ ‘అదుర్స్’ చిత్ర నిర్మాత వైసీపీకి మద్దతు తెలపడం ఎన్టీఆర్ అభిమానులను విస్మయానికి గురిచేసింది. అప్పటివరకూ వెంట తిరిగిన చాలామంది టీడీపీ కార్యకర్తలు వంశీకి గుడ్‌బై చెప్పేశారు.

గన్నవరం వైసీపీ (Gannavaram YCP) కీలక నేతలైన యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkat rao), దుట్టా రామచంద్రరావుతో (Dutta Ramachandrarao) వంశీకి అస్సలు పడదనేది అందరికీ తెలిసిన విషయమే. బాహాటంగానే యార్లగడ్డ వర్సెస్ వంశీ, దుట్టా వర్సెస్ వంశీ వంటి పరిణామాలు పలుమార్లు బయటపడ్డాయి. అయితే.. ఎవరెన్ని చెప్పినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి గన్నవరం అభ్యర్థిగా పోటీ చేసేది తానేనని వంశీ ఇప్పటికే ప్రకటించుకున్నారు. 2024లో గన్నవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వంశీనేనని సీఎం తనతో చెప్పారని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా అన్నారు. అయితే.. వంశీకి పార్టీ టికెట్ ఇస్తే మాత్రం ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేసేందుకు సిద్ధమే కానీ, వైసీపీలో కొనసాగేందుకు మాత్రం యార్లగడ్డ ససేమిరా అంటున్నారు.

Vallabhaneni-Vamsi.jpg

2019 సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆ తర్వాత వైసీపీ గూటికి చేరారు. అప్పటి నుంచి వంశీకి, ఆ నియోజకవర్గానికే చెందిన దుట్టా రామచంద్రరావు వర్గానికి, యార్లగడ్డ వర్గానికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ వస్తోంది. దుట్టా, యార్లగడ్డ ఇద్దరూ వంశీ వైసీపీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. యార్లగడ్డను బుజ్జగించేందుకు వైసీపీ అధిష్ఠానం ఆయనకు కృష్ణా కో-ఆపరేటివ్‌ బ్యాంకు చైర్మన్‌ పదవి అప్పగించినా అది మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. ఆ తర్వాత యార్లగడ్డ క్రమంగా గన్నవరం నుంచి కనుమరుగయ్యారు. దుట్టా వర్గం మాత్రం వంశీపై పోరాటం చేస్తూనే ఉంది. వంశీని దుట్టా వర్గం మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో వంశీ, దుట్టా వర్గాలు రెండుగా చీలిపోయాయి. దుట్టా రామచంద్రరావు అల్లుడు శివభరత్‌రెడ్డి దుట్టా వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. గ్రావెల్‌ తవ్వకాలతో రెండు వర్గాల నడుమ విభేదాలు బట్టబయలయ్యాయి.

దుట్టా రామచంద్రరావు తన అల్లుడు శివభరత్‌రెడ్డిని రాజకీయ అరంగేట్రం చేయించి, వచ్చే ఎన్నికల్లో గన్నవరం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయించాలన్న వ్యూహంతో ఉన్నారు. అయితే, టీడీపీ తరఫున గెలిచి వైసీపీకి మద్దతు పలుకుతున్న వంశీ వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున తానే పోటీ చేస్తానని చెబుతున్నారు. వీరికి తోడు గత ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకట్రావు సైతం నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో మూడు వర్గాల నడుమ తరచూ ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.

ఈ మూడు వర్గాలకు చెందిన నాయకులు ఎవరికి వారే తమకు అధిష్ఠానం ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకొంటుండంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఇదిలా ఉండగా.. వచ్చే ఎన్నికల్లో గన్నవరం టికెట్ వల్లభనేని వంశీకి కేటాయించాలనే ఆలోచనతో ఉన్న జగన్ యార్లగడ్డ వెంకట్రావుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి శాంతపరచాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే.. ఎమ్మెల్సీ పదవిపై పెద్దగా ఆసక్తి లేని యార్లగడ్డ టీడీపీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు గన్నవరంలో జోరుగా చర్చ నడుస్తోంది. ఏదేమైనా.. జూనియర్ ఎన్టీఆర్‌ క్లోజ్ ఫ్రెండ్‌కు టికెట్ ఇచ్చేందుకు జగన్ పెద్ద సాహసమే చేస్తున్నాడని చెప్పక తప్పదు.

Updated Date - 2023-01-22T18:36:43+05:30 IST