Share News

TS Polls : అనూహ్య నిర్ణయం.. కేసీఆర్‌పై ఎవరు పోటీచేస్తున్నారో చూడండి!

ABN , First Publish Date - 2023-11-05T18:10:09+05:30 IST

అవును.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను హ్యాట్రిక్ కొట్టకుండా ఓడించాలని ప్రతిపక్ష పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే దాన్ని సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు. అంతేకాదు.. కేసీఆర్‌ పోటీచేస్తున్న కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల్లో సైతం కేసీఆర్‌ను ఓడించడానికి వ్యూహాత్మకంగా ప్రతిపక్షాలు అడుగులు వేస్తున్నాయి..

TS Polls : అనూహ్య నిర్ణయం.. కేసీఆర్‌పై ఎవరు పోటీచేస్తున్నారో చూడండి!

అవును.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను హ్యాట్రిక్ కొట్టకుండా ఓడించాలని ప్రతిపక్ష పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే దాన్ని సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు. అంతేకాదు.. కేసీఆర్‌ పోటీచేస్తున్న కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల్లో సైతం కేసీఆర్‌ను ఓడించడానికి వ్యూహాత్మకంగా ప్రతిపక్షాలు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే గులాబీ బాస్‌పై గజ్వేల్ నుంచి బీజేపీ తరఫున ఈటల రాజేందర్‌ను అధినాయకత్వం బరిలోకి దింపుతోంది. మరోవైపు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. ఎన్నికల బరిలో ఏకంగా సీఎం కేసీఆర్‌ను ఢీ కొట్టనున్నారు. కేసీఆర్‌ పోటీ చేస్తున్న కామారెడ్డి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆయన అభ్యర్థితాన్ని పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ నెల 8న స్వయంగా నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. అదేరోజు రేవంత్‌రెడ్డి జన్మదినం కావడంతో నామినేషన్‌ వేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. గజ్వేల్, కామారెడ్డి నుంచి వందల సంఖ్యలో రైతులు, కార్మికులు నామినేషన్లు వేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.


kcr.jpg

ఇంతకీ ఎవరు..?

ఇవన్నీ అటుంచితే.. కేసీఆర్‌పై పోటీచేయడానికి అనూహ్యంగా కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ముందుకొచ్చారు. ఆయన మరెవరో కాదు.. వైఎస్సార్టీపీ జిల్లా అధ్యక్షుడు నీలం సుధాకర్. తాను వైఎస్సార్టీపీ నుంచి పోటీచేస్తే బీఫామ్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఆయన ఫిక్సయ్యారు. అయినప్పటికీ వైఎస్ఆర్ బొమ్మతోనే ప్రచారం చేస్తానని సుధాకర్ చెబుతున్నారు. వైఎస్సార్టీపీ ఎన్నికల బరిలోకి దిగకపోవడంతో తాను ఇలా అనూహ్య నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని.. నియోజకవర్గంలో అణువణువూ తెలుసనీ కచ్చితంగా ప్రభావితం చేయగలనని సుధాకర్ మీడియాకు చెప్పుకొచ్చారు. మరోవైపు.. నీలం అభిమానులు, అనుచరులు మాత్రం కచ్చితంగా కేసీఆర్‌ గెలిచినా మెజార్టీ మీద మాత్రం నీలం గట్టి దెబ్బే కొడతారని చెప్పుకుంటున్నారు.

YSRTP.jpg

ఏం జరుగుతుంది..?

నీలం చేసిన ఈ ప్రకటన తర్వాత వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇక్కడ్నుంచి పోటీచేస్తుండటంతో ఈ పరిస్థితుల్లో నీలం పరిస్థితేంటనేది ప్రశ్నార్థకంగానే మారింది. కాగా.. రేవంత్‌ కామారెడ్డిలో గెలిస్తే.. ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన సీట్లూ కాంగ్రెస్‌ వస్తే.. కేసీఆర్‌నే ఓడించిన ఘనత, టీపీసీసీ అధ్యక్షుడి హోదాతో సీఎం రేసులో ముందు వరుసలో ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. నామినేషన్‌కు ముందే షర్మిల నుంచి ఫోన్.. రేవంత్ భేటీ కావడం రెండూ జరుగుతాయని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. మరి నీలం ఏమని డిసైడ్ అవుతారో.. తనకు తానుగా తప్పుకుంటారా లేకుంటే ఫోన్లు వచ్చాక ఒప్పుకుంటారా..? అనేది తెలియాల్సి ఉంది.

Kama-Reddy.jpg

Updated Date - 2023-11-05T18:10:11+05:30 IST