AP Politics: వైసీపీ హయాంలో ఇక రాజధాని లేనట్లేనా?

ABN , First Publish Date - 2023-07-15T13:56:08+05:30 IST

2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని విషయంలో యూ టర్న్ తీసుకుంది. ఏపీకి మూడు రాజధానులు అని చెప్తూనే పాలన రాజధానిగా విశాఖను తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల వివాదం ఏపీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టుకు కూడా చేరింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబరుకు వాయిదా వేసింది.

AP Politics: వైసీపీ హయాంలో ఇక రాజధాని లేనట్లేనా?

2014లో తెలంగాణ విడిపోయిన తర్వాత నవ్యాంధ్ర ప్రదేశ్‌కు ఇప్పటివరకు రాజధాని లేకపోవడం నిజంగా విచారకరం అనే చెప్పాలి. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి సీఎం చంద్రబాబు అన్ని విధాలుగా ఆలోచించి అన్ని ప్రాంతాల వారికి సమదూరంలో ఉండేలా విజయవాడ-గుంటూరు మధ్యలో అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అమరావతికి అప్పటి ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి కూడా మద్దతు పలికింది. ఆ సమయంలో మూడు పంటలు పండే భూములను రాజధానికి ఇచ్చేందుకు తొలుత రైతులు ఒప్పుకోకపోయినా చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్ గురించి వివరించారు. ఆ విధంగా వారిని ఒప్పించి భూసేకరణ చేపట్టారు. సింగపూర్ తరహాలో అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు నిపుణులతో చర్చించి నిధులు సేకరించి రాజధానిలో పెద్ద ఎత్తున కట్టడాలకు ప్లాన్ చేశారు.

అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని విషయంలో యూ టర్న్ తీసుకుంది. ఏపీకి మూడు రాజధానులు అని చెప్తూనే పాలన రాజధానిగా విశాఖను తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేపట్టింది. అయితే అప్పటికే అమరావతికి భూములు ఇచ్చిన రైతులు వైసీపీ సర్కారుపై తిరగబడ్డారు. కోర్టులో కేసులు వేశారు. అమరావతినే రాజధానిగా అమలు చేయాలంటూ మహాపాదయాత్ర కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల వివాదం ఏపీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టుకు కూడా చేరింది. రాజధానిపై వైసీపీ వైఖరిని హైకోర్టు తప్పుబట్టింది. వైసీపీ సర్కారు ఆదేశాలపై స్టే విధించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది.

ఇటీవల వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు వాద, ప్రతివాదనలను పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబరుకు వాయిదా వేసింది. అయితే గత రెండేళ్లుగా విశాఖ నుంచి పాలనను ప్రారంభిస్తామని వైసీపీ చెప్తూనే వచ్చింది. కానీ కోర్టులో కేసులు నడుస్తుండటంతో వైసీపీ కూడా విశాఖ నుంచి పాలన అందించే విషయాన్ని వాయిదాలు వేస్తూ వస్తోంది. ఈ ఏడాది దసరా నుంచి విశాఖ నుంచి సీఎం జగన్ పాలన ప్రారంభిస్తారని ఇటీవల వైసీపీ నేతలు ప్రకటించారు. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు రాజధాని విచారణను డిసెంబర్ వరకు వాయిదా వేయడంతో మరోసారి వైసీపీకి చుక్కెదురైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పండగ వచ్చిన ప్రతిసారి రాజధాని విషయంపై వైసీపీ సర్కారు మాయమాటలను చెప్తుందని ప్రజలు భావిస్తున్నారు.

కాగా ముందస్తు ఎన్నికలకు వైసీపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుత వైసీపీ హయాంలో రాజధాని లేనట్లేనని పలువురు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ డిసెంబరు నాటికి సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించినా అప్పటికప్పుడు రాజధాని నుంచి పాలన ప్రారంభించడం సులువైన విషయం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసలు సుప్రీంకోర్టు తీర్పు ఎన్నికల ముందు వస్తుందా? రాదా? అన్న విషయం ప్రస్తుతం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే కోస్తా జిల్లాల్లో రాజధాని విషయంలో ప్రజల్లో ప్రభుత్వం వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉంది. అటు ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోనూ వైసీపీకి అనుకూల పరిస్థితి కనిపించడం లేదు. ఆ పార్టీ కావాలనే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మొత్తంగా చూస్తే రాజధాని విషయంలో వైసీపీ సుడిగండంలో చిక్కుకుందని రాజకీయ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

TeluguDesam : నారా లోకేష్‌తో చేతులు కలిపిన వైసీపీ యంగ్ ఎంపీ.. ఏదో జరుగుతోందంటూ ఎక్కడ చూసినా ఇదే చర్చ..!

AP Politics: పరువు తీసుకున్న పోసాని.. ఉమెన్ ట్రాఫికింగ్ అంటే తెలుసా?

Updated Date - 2023-07-15T13:56:08+05:30 IST