Janagarjana Vs BRS : రాహుల్ కామెంట్స్పై ఒక్క ముక్కలో కౌంటరిచ్చేసిన మంత్రి హరీష్.. ఇలా మాట్లాడేశారేంటో..!
ABN , First Publish Date - 2023-07-02T21:51:42+05:30 IST
జనగర్జన సభావేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బీఆర్ఎస్పై (BRS) చేసిన విమర్శలపై తెలంగాణ మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు...
జనగర్జన సభావేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బీఆర్ఎస్పై (BRS) చేసిన విమర్శలపై తెలంగాణ మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ‘రాహుల్ గాంధీ గారు.. దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది. అవినీతికి మారుపేరుగా మారిన పార్టీ మీది. అందుకే మీ పార్టీ పేరే స్కాంగ్రెస్గా మారింది. అందుకే దేశ ప్రజలు మిమ్మల్ని అధికారం నుంచి దించి మూలన కూర్చోబెట్టింది. బీఆర్ఎస్ ఎవరికీ బీ టీం కాదు.. మాది పేద ప్రజలకు ఏ టీం. ప్రజల సంక్షేమం చూసే ఏ క్లాస్ టీం. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్కు లేదు. అందుకే దేశాన్ని బీజేపీ కబంద హస్తాల నుంచి కాపాడేందుకే బీఆర్ఎస్ పుట్టింది. రాష్ట్రంలో పొడు పట్టాల పంపిణీ కళ్లకు కనిపించలేదా..?. మేం పట్టాలు పంచినంక మళ్లీ మీరిచ్చేదేంది?. అప్డేట్ తెలుసుకోని ఔట్ డేటెడ్ పొలిటీషియన్ రాహుల్ గాంధీ’ అని హరీష్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.
పెద్ద జోక్ ఏమిటంటే..!
‘కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు మొత్తం 80,321.57 కోట్లు అయితే, అవినీతి లక్ష కోట్లు అని అనడం పెద్ద జోక్. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని, కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడ ఇవ్వలేదని మీ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చిన విషయం తెలియదా?. స్కీమ్ల్లోని స్కాం ల్లో ఆరితేరిన కాంగ్రెస్ కుంభకోణాల గురించి మాట్లాడడం.. దెయ్యాలు వేదాలు వల్లించడమే. అప్పుడే ముదిగొండ కాల్పులను మరిచిపోయారా? భూములు అడిగితే జైల్లో వేసిన వాళ్ళు, కరెంట్ అడుగుతే పిట్టల్లా కాల్చి చంపినోళ్లు ఖమ్మంలో కల్లిబొల్లి కబుర్లు చెప్తే నమ్మే వాళ్ళు ఎవరు లేరు. ఖమ్మం సభ ఒక్క ముక్కలో చెప్పాలంటే.. పసలేని ఆరోపణలు, ఊకదంపుడు ప్రసంగాలు.. రాసిచ్చిన స్క్రిప్ట్ తో రాహుల్ స్కిట్..’ అని హరీష్ విమర్శల వర్షం గుప్పించారు.

ఇంతకీ రాహుల్ ఏమన్నారు..?
‘ఒకప్పుడు తెలంగాణ అనేది పేదలకు, రైతులకు, అందరికీ ఓ స్వప్నంలా ఉండేది. కాంగ్రెస్ పార్టీ సాకారం చేసిన ఆ స్వప్నాన్ని బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదేళ్ల పాటు ధ్వంసం చేసింది. కేసీఆర్ తెలంగాణకు తానో రాజులా భావిస్తుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ తన జాగీరు అనుకుంటున్నారు. ఇందిరమ్మ పేదలకు ఇచ్చిన భూములను కేసీఆర్ లాక్కున్నారు. ఈ భూములు కేసీఆర్వి కావు.. మీవి. టీఆర్ఎస్ ఏకంగా తన పేరే మార్చుకుంది. పార్లమెంటులో బీజేపీకి బీ టీమ్లా పనిచేసింది. రైతుల బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తే, ఆ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు పలికింది. ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ముఖ్యమంత్రి దాన్ని సమర్థిస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి రిమోట్ కంట్రోల్ మోదీ చేతుల్లో ఉంది. కేసీఆర్ స్కాములన్నీ మోదీకి తెలుసు’ అని బీఆర్ఎస్ సర్కార్పై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.