Kesineni Brothers: బెజవాడ టీడీపీలో ‘బ్రదర్స్ వార్’.. అధిష్టానం తీర్పు ఏంటంటే..

ABN , First Publish Date - 2023-01-16T14:05:55+05:30 IST

బెజవాడ టీడీపీలో (Vijayawada TDP) ‘బ్రదర్స్ వార్’ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఒకే పార్టీలో ఉంటూ కయ్యానికి కాలు దువ్వుతున్న ఆ టీడీపీ నేతలు మరెవరో కాదు..

Kesineni Brothers: బెజవాడ టీడీపీలో ‘బ్రదర్స్ వార్’.. అధిష్టానం తీర్పు ఏంటంటే..

బెజవాడ టీడీపీలో (Vijayawada TDP) ‘బ్రదర్స్ వార్’ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఒకే పార్టీలో ఉంటూ కయ్యానికి కాలు దువ్వుతున్న ఆ టీడీపీ నేతలు మరెవరో కాదు విజయవాడ ఎంపీ కేశినేని నాని (Vijayawada MP Kesineni Nani), ఆయన సోదరుడు కేశినేని చిన్ని (Kesineni Chinni). ఈ ఇద్దరి వైఖరి కారణంగా విజయవాడలో టీడీపీ శ్రేణులు (Vijayawada TDP Cadre) అయోమయంలో పడిన పరిస్థితి. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా తయారైంది ఇక్కడి టీడీపీ కార్యకర్తల పరిస్థితి. తాజాగా.. కేశినేని నాని చేసిన వ్యాఖ్యలతో ఈ ‘బ్రదర్స్ వార్’ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎంపీ కేశినేని నాని జనవరి 15న (సంక్రాంతి రోజున) మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో చిన్నికి టికెట్ ఇస్తే తాను పార్టీకి పనిచేసేది లేదని బాహాటంగానే తెగేసి చెప్పటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చిన్నితో పాటు మరో ముగ్గురికి పార్టీ టికెట్ ఇస్తే ఏమాత్రం సహకరించేది లేదని ఈ టీడీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు అధిష్టానాన్ని ఇరకాటంలోకి నెట్టేశాయి. ఈ అన్నదమ్ములిద్దరూ పార్టీకి కావాల్సిన వాళ్లే కావడంతో ఏ ఒక్కరి వైపు మొగ్గుచూపేందుకు అధినేత చంద్రబాబు సిద్ధంగా లేరు.

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ తరహా వర్గపోరు పార్టీకి నష్టం చేస్తుందని భావించిన సీబీఎన్ ఈ బ్రదర్స్ ఇద్దరినీ పిలిచి మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో కేశినేని చిన్ని టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ఆ మేరకు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. కేశినేని నాని, చిన్ని మధ్య విభేదాలు ఇప్పటికిప్పుడు తెరపైకి వచ్చినవి ఏం కావు. నాని తన సోదరుడితో తనకు దూరం ఉందన్న విషయాన్ని గతేడాది నుంచి చెప్పకనే చెబుతూ వచ్చారు. తన సోదరుడు శివనాథ్‌ను (చిన్ని) ఉద్దేశించి ‘నా శత్రువును మీరు ప్రోత్సహిస్తే, మీ శత్రువును నేను ప్రోత్సహిస్తా..’ అని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అధినేత చంద్రబాబును ఉద్దేశించి చేసినవని టీడీపీ శ్రేణులు భావించాయి.

ఈ ‘బ్రదర్స్ వార్’ ఎప్పుడు వెలుగులోకి వచ్చిందంటే..

కేశినేని నాని, ఆయన సోదరుడు కేశినేని శివనాథ్‌ (చిన్ని) మధ్య వార్‌ 2022లోనే ముదిరిపాకాన పడింది. విజయవాడ కేంద్రంగా చిన్ని వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. చాలా కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భాగస్వాములు కావడంతో ఈ కార్యక్రమాలకు రాజకీయ రంగు పులిమారు. అదే సమయంలో గతంలో కేశినేని నానీకి సన్నిహితంగా ఉన్న పలువురు టీడీపీ నాయకులు శివనాథ్‌కు దగ్గరవుతూ వచ్చారు. ఈ పరిణామాలన్నీ కేశినేని బ్రదర్స్‌ నడుమ దూరాన్ని పెంచాయి. అయితే, తన సోదరుడు నానీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, టీడీపీ అధికారంలోకి రావడం, చంద్రబాబు సీఎం కావడం అనే లక్ష్యాలతో తాను కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని శివనాథ్‌ ప్రకటించారు. నాని మాత్రం తన సోదరుడితో తనకు దూరం ఉందన్న విషయాన్ని బహిరంగంగానే చెప్పేశారు.

కేశినేని నాని వైఖరి అప్పటి నుంచీ ఇంతే..

2019 ఎన్నికల నుంచి నాని తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని ఇరుకున పెడుతూ వస్తున్నారు. 2019లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి మూడు ఎంపీ స్థానాలు దక్కాయి. విజయవాడ నుంచి ఎంపీగా నాని గెలుపొందారు. ఈ గెలుపు తన ఒక్కడి కారణంగానే తప్ప పార్టీ అండతో కాదన్న అభిప్రాయంలో ఆయన ఉండిపోయారు. దీంతో విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల టీడీపీ నాయకులతో పాటు నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం నియోజకవర్గ నాయకులతో నానీకి దూరం పెరుగుతూ వచ్చింది. అయినా పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు ప్రాధాన్యత ఇస్తూనే వచ్చారు. కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న నెట్టెం రఘురామ్‌ను 2020లో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించారంటే కేవలం నాని మాటకు విలువ ఇచ్చే.

మంత్రి పదవి పొందిన కొడాలి నాని జీవితాంతం దేవినేని ఉమాకు రుణపడి ఉండాలని అప్పట్లో నాని ట్వీట్‌ చేయడం గమనార్హం. పార్లమెంటులో టీడీపీపక్ష నేత, విప్‌ పదవుల విషయంలో కూడా చంద్రబాబుపై నాని అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇంటిపై, కార్యాలయంపై దాడి జరిగిన సందర్భాల్లో స్పందించలేదు. పార్టీ కార్యాలయంపై దాడి సమయంలో విజయవాడలో ఉండి కూడా రాలేదు. ఒంగోలులో జరిగిన మహానాడుకు ఎంపీ నాని, ఆయన కుమార్తె కేశినేని శ్వేత హాజరుకాలేదు. 2022, జూలై 9న నందిగామ నియోజకవర్గం పరిటాలలో జరిగిన 35 నియోజకవర్గాల రైతుపోరు సభకు సైతం రాలేదు. మొత్తం మీద తరచూ తన మార్కు వ్యవహారశైలితో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో చర్చనీయాంశంగా నిలుస్తున్నారు.

కారుపై స్టిక్కర్‌ వివాదంతో నాని, చిన్ని విభేదాలు తెరపైకి..

ఎంపీ కేశినేని నాని తన తమ్ముడిని టార్గెట్‌ చేస్తూ హైదరాబాద్‌, విజయవాడ పోలీసులకు చేసిన ఫిర్యాదు అప్పట్లో కలకలం రేపింది. తన పేరుతో ఉన్న నకిలీ ఎంపీ స్టిక్కర్‌ను అంటించుకుని టీఎస్‌07 హెచ్‌డబ్ల్యూ 7777 అనే కారు తిరుగుతోందని విజయవాడ, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్లకు ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణం చర్య తీసుకోవాల్సిందిగా కోరారు. నాని పేర్కొన్న వాహనం ఆయన సోదరుడు శివనాథ్‌ సతీమణి పేరుతో ఉండటం గమనార్హం. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో పోలీసులు ఈ కారును ఆపి తనిఖీలు చేయడంతో ఈ ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది. తనకు పోటీగా విజయవాడలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే అక్కసుతోనే నాని ఫిర్యాదు చేశారని శివనాథ్‌ అనుచరులు ఆ సందర్భంలో ఆరోపించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-01-16T14:10:02+05:30 IST