Nara Lokesh: కేటీఆర్ వ్యాఖ్యలకు నారా లోకేష్ కౌంటర్.. అంత భయం ఎందుకు?

ABN , First Publish Date - 2023-09-26T19:22:33+05:30 IST

చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగోళ్లు ప్రపంచ వ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు తెలిపారని.. హైదరాబాద్‌లో కూడా తెలుగువాళ్లు ఉండటంతో శాంతియుతంగానే నిరసన తెలిపారని లోకేష్ వ్యాఖ్యానించారు.

Nara Lokesh: కేటీఆర్ వ్యాఖ్యలకు నారా లోకేష్ కౌంటర్.. అంత భయం ఎందుకు?

ఏపీ రాష్ట్రానికి సంబంధించిన అంశంపై తెలుగోళ్లు హైదరాబాద్‌లో నిరసన తెలపడం శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమేనని అన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగోళ్లు ప్రపంచ వ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు తెలిపారని.. హైదరాబాద్‌లో కూడా తెలుగువాళ్లు ఉండటంతో శాంతియుతంగానే నిరసన తెలిపారని లోకేష్ వ్యాఖ్యానించారు. ఎక్కడా కూడా శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా టీడీపీ అభిమానులు ప్రవర్తించలేదని.. అయినా వాళ్లు ఎందుకు భయపడుతున్నారో తనకు అర్ధం కావడం లేదని కేటీఆర్‌ను ఉద్దేశించి లోకేష్ అన్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఏపీలో టీడీపీ నేతల అరెస్టుపై ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ పాలన, ప్రతిపక్షాల అణిచివేతపై రాష్ట్రపతికి తాము వివరించినట్లు లోకేష్ తెలిపారు.

ఇది కూడా చదవండి: AP Politics: ఇంకో ఛాన్స్ ఇవ్వాలని కోరుతూ జగన్ యాత్ర.. ప్రజల్లోకి వెళ్లే దమ్ముందా?

2019 నుంచి ఏపీలో ప్రతిపక్షాలపై జరుగుతున్న అరాచకాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకువచ్చామని నారా లోకేష్ అన్నారు. భవిష్యత్‌కు గ్యారంటీ అని తమ నాయకుడు చంద్రబాబు, యువగళంతో తాను, వారాహి యాత్రతో పవన్ కళ్యాణ్.. ఇలా ముగ్గురుం ప్రజల్లో చైతన్యం తీసుకువస్తుంటే భయపడిపోయిన జగన్ అక్రమ అరెస్టులు చేసి తమను నిర్బంధిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. చంద్రబాబును రెండు రోజులు కస్టడీలోకి తీసుకుని ఆధారాలు ఇవ్వాలని సీఐడీ అధికారులు వేడుకున్నారని.. ఒకవేళ ఆధారాలు ఉంటే మీడియా ముఖంగా ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అంశంపై తాము ఓ వెబ్‌సైట్ అందుబాటులోకి తీసుకువచ్చి వివరిస్తున్నామని.. తాము ఏ కంపెనీ దగ్గర కనీసం కప్పు కాఫీ కూడా తాగలేదని.. అలాంటిది అవినీతి ఎలా చేస్తామని లోకేష్ నిలదీశారు. యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తానని నిన్న ప్రకటించిన తర్వాత తనను ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో ఇరికించిన పరిస్థితి అందరూ గమనించారని పేర్కొన్నారు. యువగళం కోసం ఇప్పటికే పర్మిషన్‌లు పెట్టుకున్నామని.. తప్పకుండా యాత్ర చేసి తీరుతానని స్పష్టం చేశారు. కాగా రాష్ట్రపతిని కలిసిన టీడీపీ నేతల్లో లోకేష్‌తో పాటు ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్‌, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌ ఉన్నారు.

president.jpg

Updated Date - 2023-09-26T19:22:33+05:30 IST