Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత కోసం రంగంలోకి మంత్రి కొడుకు!
ABN , First Publish Date - 2023-05-09T18:28:11+05:30 IST
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi liquor scam) కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi liquor scam) కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అరెస్ట్ అవుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Arvind Kejriwal) సహా పలువురు ఆప్ (AAP) నేతలతో కలిసి సౌత్ గ్రూప్ (South Group) అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో అరెస్ట్లు, జైళ్లు, బెయిల్స్ అన్నీ నడుస్తున్నాయి.
కానీ, కొత్తగా ఈ కేసులో మంత్రి సబిత ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి (Karthik reddy) ఎంటర్ అయ్యారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra reddy) కొడుకు ఈ కేసులో ఈడీ (ED), సీబీఐలు (CBI) సౌత్ గ్రూప్ అంటూ కొందరి పేర్లను ప్రస్తావిస్తున్నాయని, కానీ వ్యక్తుల గురించి చెప్పే సమయంలో సౌత్ అని చెప్పటం దక్షిణ భారత పౌరులను అవమానించటమేనని ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో వ్యక్తుల విషయంలో ఫలానా ఏరియా అంటూ అందరినీ చిన్నచూపు చూసేలా మెన్షన్ చేయవద్దంటూ ఉన్న కేసుల తీర్పులను ఉటంకించారు. కోర్టు కూడా ఏకీభవిస్తూ, మీరు సీబీఐ,ఈడీలకు లెటర్ ఇవ్వాలంటూ పేర్కొంది.
ఇంత వరకు బాగానే ఉన్నా... కవిత విచారణ సమయంలోనూ, వైసీపీ ఎంపీ కొడుకు అరెస్ట్ సమయంలోనూ సౌత్ గ్రూప్ లాబీ అన్న పేర్లను సీబీఐ, ఈడీలు వాడాయి. వాడుతున్నాయి. కానీ, వారెవరూ ఇందులో సౌత్ అనే పదం వాడొద్దంటూ మెన్షన్ చేయలేదు. వారి తరఫున ఎంతో పేరు మోసిన లాయర్లు కూడా ఎంటరైనా వారు కూడా దాన్ని పట్టించుకోలేదు. కానీ, మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి ఈ సమయంలో ఎందుకు ఎంటరైనట్లు అనే చర్చ ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకు కూడా యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నారు. తన తల్లి ప్రాతినిధ్యం వహిస్తున్నమహేశ్వరం నియోజకవర్గం రాజకీయాలతో పాటు రాజేంద్రనగర్ కేంద్రంగా కార్తీక్ రెడ్డి పనిచేస్తున్నారు. ఇటీవల ఓ మీటింగ్లో తాను వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) తరఫున రాజేంద్రనగర్ నుండి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తీవ్రంగా ప్రతిఘటించినా... పార్టీ పెద్దల జోక్యంతో ఆ పంచాయితీ అలా ముగిసిపోయింది.
ఇప్పుడు కార్తీక్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత కోసం ఏకంగా సుప్రీం తలుపు తట్టారంటే... రాజేంద్ర నగర్ సీటు కోసమే పార్టీ పెద్దల మెప్పు పొందేందుకు అయి ఉంటుందని చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడే వచ్చారంటే పార్టీ కోరిక మేరకు అయితే కాదని, తనకు తాను సొంతగా... పార్టీ పెద్దల మెప్పు కోసమే అన్న టాక్ వినిపిస్తోంది.