karimnagar: జగిత్యాల, కోరుట్లపై బీజేపీ కన్ను..అసలు బీజేపీ ప్లాన్ ఏంటీ..!

ABN , First Publish Date - 2023-03-08T12:49:03+05:30 IST

ఉత్తర తెలంగాణపై బీజేపీ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. సామాజిక సమీకరణాలపైనా ఆ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. దానిలో భాగంగానే.. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో ...

karimnagar: జగిత్యాల, కోరుట్లపై బీజేపీ కన్ను..అసలు బీజేపీ ప్లాన్ ఏంటీ..!

జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో ఆ సామాజిక వర్గాలపై బీజేపీ కన్నేసిందా?.. భోగ శ్రావణి చేరిక వెనుక.. కాషాయ పార్టీ పెద్ద కసరత్తే చేసిందా?.. ఎంపీ అరవింద్ సరికొత్త వ్యూహం పన్నారా?.. జగిత్యాలలో ఓ సామాజికవర్గం అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారా?.. ఇంతకీ.. బీజేపీ కన్నేసిన ఆ సామాజికవర్గాలేంటి?.. అర్వింద్‌ పన్నిన వ్యూహమేంటి?..అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-145400.jpg

జగిత్యాల, కోరుట్లలో పద్మశాలి ఓట్లపై కన్ను

ఉత్తర తెలంగాణపై బీజేపీ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. సామాజిక సమీకరణాలపైనా ఆ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. దానిలో భాగంగానే.. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో పద్మశాలి ఓట్లను బీజేపీ వైపు తిప్పుకునేందుకు ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యూహాత్మకంగా వ్యవహరించారన్న చర్చ జరుగుతోంది. జగిత్యాలలో పద్మశాలి వర్గానికి చెందిన భోగ శ్రావణిని బీజేపీలో చేర్చుకునేందుకు ఏడాది కాలంగా ప్రయత్నాలు సాగించి చివరికి సక్సెస్‌ అయ్యారు. నిజానికి.. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో పద్మశాలీల ఓట్లు కీలకంగా ఉన్నాయి. జగిత్యాల, కోరుట్లలో మున్నూరు కాపు ఓట్లు కూడా ఎక్కువనే చెప్పొచ్చు. దాంతో.. ఆ సామాజికవర్గానికే చెందిన అరవింద్, బండి సంజయ్‌.. ఇతరులను వారి వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కోరుట్ల నియోజకవర్గంలో పద్మశాలి, మున్నూరు కాపు ఓట్లు 80 వేల వరకూ ఉన్నాయి. జగిత్యాలలోనూ ఆ రెండు సామాజిక వర్గాల ఓట్లు 75 వేల వరకు ఉన్నాయి. ఆ క్రమంలోనే.. ఆ రెండు సామాజికవర్గాలపై కమలనాథులు గట్టి ఫోకస్‌ పెట్టారు.

Untitled-17528.jpg

బీజేపీ టికెట్ కోసం ఇద్దరు, ముగ్గురు ప్రయత్నాలు

వాస్తవానికి.. మున్నూరు కాపు సామాజికవర్గం నుంచి అరవింద్, బండి సంజయ్ ప్రస్తుతం కీలకంగా ఉన్నారు. అందుకే.. పద్మశాలీ వర్గం నుంచి కొంతమందిని పార్టీలోకి చేర్చుకుంటే.. బీజేపీకి మరింత బలం పెరుగుతుందనే వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. అందుకే.. భోగ శ్రావణికి బీజేపీ కండువా కప్పారని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. పద్మశాలీతోపాటూ మిగతా సామాజికవర్గాలనూ బీజేపీ వైపు తిప్పుకునేందుకు.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లోని అసంతృప్తులకు గాలం వేస్తున్నారు. అయితే.. జగిత్యాలలో బీజేపీ టికెట్‌పై రెడ్లు చాలా ఆశలు పెట్టుకున్నారు. పార్టీలో ఉన్న ఇద్దరు, ముగ్గురు నేతలంతా బీజేపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే.. పద్మశాలీ వర్గానికి పెద్దపీట వేస్తే.. రెడ్డి సామాజికవర్గం దూరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ నుంచి డాక్టర్ శైలేందర్‌రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత.. రైతు ఉద్యమం పేరుతో హడావుడి చేసిన తిరుపతిరెడ్డి కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు.

Untitled-155455.jpg

పద్మశాలీ సామాజికవర్గంపై కమలం పార్టీ కన్ను

ఇదిలావుంటే.. జగిత్యాల నియోజకవర్గ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ ముదుగంటి రవీందర్‌రెడ్డి ఇప్పటికే అసంతృప్తితో ఉన్నట్లు చర్చ నడుస్తోంది. తాజాగా.. పద్మశాలీ సామాజికవర్గానికి చెందిన శ్రావణికి ప్రిపరెన్స్‌ ఇస్తే రెడ్డి సామాజికవర్గం నుంచి ఇబ్బందులు తప్పవనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. ఈటెల రాజేందర్, ఎంపీ అరవింద్, బండి సంజయ్ లాంటి కీలక నేతలు.. నేరుగా శ్రావణి ఇంటికే వెళ్లారంటే.. ఆమె సామాజికవర్గం పట్ల ఏ స్థాయిలో మద్దతు కోరుకుంటున్నారో అర్థమవుతోంది. అయితే.. పద్మశాలీ ఓట్లను చేజార్చుకోకుండా బీఆర్ఎస్ కూడా జాగ్రత్తలు తీసుకుంటోంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు.. పద్మశాలీ వర్గంలోని కీలక వ్యక్తులు.. వారి దగ్గరే ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు.. గతంలోనే.. తెలంగాణ వ్యాప్తంగా ప్రభావం చూపుతారన్న కారణంగా జగిత్యాలకు చెందిన ఎల్. రమణకు పద్మశాలీ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు. కానీ.. ప్రస్తుతం అదే పద్మశాలీ సామాజికవర్గంపై కమలం పార్టీ కన్నేయడంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది.

Untitled-1254.jpg

మొత్తంగా.. బీజేపీ, బీఆర్ఎస్.. ఉత్తర తెలంగాణలోని రెండు ప్రధాన సామాజికవర్గాలకు చెందిన ఓట్లను ఆయా పార్టీల వైపు తిప్పుకునేలా ప్రయత్నాలు మొదలు పెట్టాయి. మున్నురు కాపు, పద్మశాలీ సామాజికవర్గాలను మరింత దగ్గర చేసుకోవాలని చూస్తున్నాయి. ఆ క్రమంలోనే.. గతంలో ఎల్‌ రమణకు బీఆర్ఎస్‌ చాన్స్‌ ఇస్తే.. ఇప్పుడు.. బీజేపీ.. జగిత్యాలకు చెందిన భోగ శ్రావణికి కాషాయ కండువా కప్పింది. ఏదేమైనా.. ఎన్నికల నాటికి జగిత్యాలలో భోగ శ్రావణికి ఆమె సామాజికవర్గం ఏ మేరకు మద్దతు ఇస్తుందో చూడాలి.

Updated Date - 2023-03-08T12:49:03+05:30 IST