Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరి కీలక నిర్ణయం.. అక్టోబర్ 2న నిరాహారదీక్ష

ABN , First Publish Date - 2023-09-30T16:16:52+05:30 IST

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి అక్టోబర్ 2న నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. అదే రోజు ప్రజలు సైతం తమ సంఘీభావం తెలపాలని కోరారు.

Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరి కీలక నిర్ణయం.. అక్టోబర్ 2న నిరాహారదీక్ష

స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో చంద్రబాబును జగన్ సర్కారు అరెస్ట్ చేయించింది. ఈ అంశంపై నారా లోకేష్ దేశ రాజధాని ఢిల్లీలో ఉండి న్యాయపోరాటం చేస్తుండగా.. అప్పటి నుంచి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, నందమూరి బాలకృష్ణ టీడీపీ క్యాడర్‌కు ధైర్యం చెప్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ క్యాడర్‌ను ఉత్తేజపరిచేలా వాళ్లు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సెప్టెంబర్ 30న మోత మోగిద్దాం పేరుతో టీడీపీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మరోవైపు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి అక్టోబర్ 2న నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. అదే రోజు ప్రజలు సైతం తమ సంఘీభావం తెలపాలని కోరారు. అక్టోబర్ 2న రాత్రి 7 గంటల నుంచి 5 నిమిషాల పాటు టీడీపీ అభిమానులందరూ తమ ఇంట్లోని లైట్లు ఆపి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఇంటి బయటకు వచ్చి కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపాలని విజ్ఞప్తి చేశారు.

నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ జరిగిన ప్రాంతంలో శనివారం టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో అచ్చెన్నాయుడు సహా యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, నక్కా ఆనంద్‌బాబు, అశోక్ బాబు, బీద రవిచంద్ర, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌రెడ్డి, వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలకు టీడీపీ-జనసేన పొత్తు ఉండటంతో టీడీపీ-జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ జేఏసీ రాష్ట్రస్థాయిలో ఉంటుందని.. ఇకపై ప్రతి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో జనసేనతో సమన్వయం చేసుకుంటూ టీడీపీ కార్యకలాపాలు సాగుతాయని తెలిపారు. అటు చంద్రబాబు అరెస్ట్ వార్తలను తట్టుకోలేక ఇప్పటివరకు 97 మంది చనిపోయారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో చనిపోయిన 97 మంది పట్ల ఈ సమావేశంలో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సంతాపం వ్యక్తం చేసింది.

ఇది కూడా చదవండి: CBN Arrest : చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి హరీష్ ఆసక్తికర కామెంట్స్

కాగా టీడీపీ చేపట్టిన మోత మోగిద్దాం కార్యక్రమానికి జనసేన పార్టీ కూడా మద్దతు తెలిపింది. ఈ మేరకు చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ చేయనున్న మోత మోగిద్దాం కార్యక్రమంలో జనసైనికులు పాల్గొని విజయవంతం చేయాలని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రకు మద్దతు తెలిపిన టీడీపీకి ధన్యవాదాలు తెలిపారు. కృష్ణా జిల్లాలో అవనిగడ్డలో మొదలయ్యే వారాహి యాత్ర అక్టోబర్ 1 నుంచి 5 రోజులపాటు షెడ్యూల్ ఖరారు అయిందని తెలిపారు. అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో పాల్గొని అభిమానులు సక్సెస్ చేయాలని నాదెండ్ల మనోహర్ కోరారు.

Updated Date - 2023-09-30T16:16:52+05:30 IST