AP Politics: వైసీపీ ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్.. సమాధానం చెప్పే దమ్ముందా?

ABN , First Publish Date - 2023-08-25T21:54:09+05:30 IST

వైసీపీ ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్ విసిరారు. ఇసుక దోపిడీపై 10 ప్రశ్నలు సంధించి 48 గంటల్లో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలోని నాలుగున్నరేళ్లలో జగన్ రూ.40వేల కోట్ల ఇసుక దోపిడీకి పాల్పడినట్లు చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు.

AP Politics: వైసీపీ ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్.. సమాధానం చెప్పే దమ్ముందా?

ఏపీలో గత నాలుగేళ్లుగా పాలిస్తున్న జగన్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఇసుకాసురుడు పేరుతో ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్ విసిరారు. ఇసుక దోపిడీపై 10 ప్రశ్నలు సంధించి 48 గంటల్లో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలోని నాలుగున్నరేళ్లలో జగన్ రూ.40వేల కోట్ల ఇసుక దోపిడీకి పాల్పడినట్లు చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు జగన్ ఆరు సూత్రాలను అమలు చేస్తున్నాడని విమర్శించారు. ఆహారం, నీరు, ఫలహారం, ఆశయం, పైశాచిక ఆనందం, లక్ష్యం పేరుతో ఈ సూత్రాలను జగన్ పాటిస్తున్నాడని మండిపడ్డారు.

ఇతర రాష్ట్రాలతో పోటీ పడాల్సిన ఏపీని జగన్ నాశనం చేశారని చంద్రబాబు అన్నారు. ఆహారం పేరుతో ఇసుక, గనులను.. నీరు పేరుతో మద్యాన్ని.. ఫలహారం పేరుతో భూమిని.. ఆశయం పేరుతో విధ్వంసాన్ని.. పైశాచిక ఆనందం పేరుతో ప్రజల్ని హింసించడం.. లక్ష్యం పేరుతో లక్షల కోట్లను దోపిడీ చేయడం వంటి పనులను జగన్ చేస్తున్నాడని చంద్రబాబు తన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అంతేకాకుండా ప్రభుత్వానికి 10 ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు అన్నారు.


చంద్రబాబు 10 ప్రశ్నలు ఇవే..

1) ఈ నాలుగున్నరేళ్లలో ఇసుక తవ్వింది ఎంత? ప్రభుత్వ ఆదాయం ఎంత?

2) జీఎస్టీ ఎంత చెల్లించారు.. ఏ సంస్థ పేరుతో చెల్లించారు?

3) రాష్ట్రంలో ఉన్న శాండ్ స్టాక్ పాయింట్లు ఎన్ని? వాటిలో ఉన్న స్టాక్ ఎంత?

4) ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ (ఈసీ) ఉన్న రీచ్‌లు ఎన్ని? ఎన్ని మెట్రిక్ టన్నుల తవ్వకాలకు అనుమతి ఇచ్చారు?

5) ఎన్జీటీ ఆర్డర్ ప్రకారం SEIAA ఈసీలను రద్దు చేయడం నిజం కాదా?

6) ఎన్జీటీ ఆర్డర్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లినా స్టే నిరాకరించలేదా?

7) ఎన్జీటీ ఆర్డర్ అమలు పరచడం లేదని వేసిన ఎగ్జి్క్యూటివ్ పిటిషన్‌లో ప్రభుత్వాన్ని ఎన్జీటీ తప్పుబట్టింది వాస్తవం కాదా?

8) కమిషన్ ప్రతినెలా రూ.35 కోట్లు చెల్లించలేక పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమ్‌రాజ్ ఆత్మహత్య నిజం కాదా?

9) ఒప్పందాలు లేకపోయినా రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు చేస్తోందెవరు?

10) 48 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇసుక దోపిడీపై సమాధానం చెప్పాలి

కాగా తప్పుడు వాగ్ధానాలతో జగన్ అధికారంలోకి వచ్చారని చంద్రబాబు విమర్శలు చేశారు. ఇసుక దోపిడీతో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందన్నారు. ఇసుక తోడేసి ప్రాజెక్టులను విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యాపార అనుభవం లేని జేపీ పవర్ వెంచర్స్ కు అప్పగించారని.. వాటాలో తేడా రావడంతో టర్న్ కీ సంస్థను బయటకు గెంటేశారని వివరించారు. వర్షాకాలంలో ఇసుక తవ్వకూడదనే నిబంధన ఉన్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. కృష్ణానదిలోనూ రోడ్లు వేసి ఇసుకను తవ్వుకుంటున్నారని ధ్వజమెత్తారు.

Updated Date - 2023-08-25T21:54:09+05:30 IST