Delhi Liquor Case : ఐదు గంటలు పూర్తయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ.. ఇంకా ఎంతసేపు ఉంటుందంటే...!

ABN , First Publish Date - 2023-03-11T16:23:24+05:30 IST

దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (BRS MLC Kavitha) ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు...

Delhi Liquor Case : ఐదు గంటలు పూర్తయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ.. ఇంకా ఎంతసేపు ఉంటుందంటే...!

దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (BRS MLC Kavitha) ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. శనివారం నాడు ఉదయం 11 గంటలకు ఈడీ (ED) ఎదుట హాజరైన కవిత ఇప్పటి వరకూ బయటికి రాలేదు. అయితే.. ఈడీ విచారణ ఇప్పటికే ఐదు గంటలు పూర్తయ్యింది. ఇవాళ రాత్రి 8 గంటల వరకూ విచారణ కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంకా విచారించాల్సింది చాలానే ఉందని అందుకే రాత్రి వరకూ అధికారులు విచారిస్తారని తెలుస్తోంది. సాయంత్రం 3.30 గంటలకు కవితకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. విచారణ గది నుంచి కాసేపు బయటికి వచ్చి మళ్లీ ఈడీ అధికారుల ఎదుట విచారణకు వెళ్లారామె. ఇప్పటివరకూ కవిత వ్యక్తిగత సమాచారాన్ని ఈడీ అధికారులు అడిగి తెలుసుకున్నారని సమాచారం. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో మహిళా అధికారి సమక్షంలో ఈ విచారణ మొత్తం అధికారులు వీడియో షూట్ చేస్తున్నారు. నలుగురు సభ్యుల స్పెషల్ ఈడీ బృందం చేత కవిత విచారణ జరుగుతోంది.

ఎవరెవర్ని విచారిస్తున్నారు..?

కవితతో పాటు మొత్తం 9 మందిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మనీష్ సిసోడియా (Manish Sisodia), కవిత, అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, దినేష్ అరోరా, బుచ్చిబాబు, సిసోడియా మాజీ కార్యదర్శి అరవింద్, ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్‌లను విడివిడిగా, కలిపి ఈడీ ప్రశ్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఇప్పటికే అరుణ్ పిళ్ళై, మనీష్ సిసోడియా ఈడీ కస్టడీలో ఉన్నారు.

ఏమేం అడుగుతున్నారు..?

ముఖ్యంగా స్కామ్‌లో సౌత్ గ్రూప్ పాత్రపై ఎక్కువసేపు విచారించారని సమాచారం. అంతేకాకుండా అరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు మాజీ ఆడిటర్ బుచ్చిబాబు వాట్సాప్ చాట్ ఆధారంగా కూడా ప్రశ్నలు అడుగుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే కవిత-పిళ్లై ఇద్దర్నీ కాన్‌‌ఫ్రాంటేషన్ ఇంటరాగేషన్ ద్వారా అధికారులు విచారిస్తున్నారు. కాన్‌‌ఫ్రాంటేషన్ ఇంటరాగేషన్ అంటే.. కేసుతో సంబంధం ఉన్నవారిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించడం అని అర్థం.

తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు..

కవితను ఈడీ విచారిస్తుండటంతో తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. కవితపై బండి సంజయ్ (Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలతో తెలంగాణలో దుమారం రేగింది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. తీవ్ర ఆగ్రహంతో బండి సంజయ్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడిక్కడ దగ్ధం చేస్తున్నారు. మరోవైపు.. బండి కామెంట్స్‌ను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. బండి సంజయ్‌కు నోటీసులిచ్చిన మహిళా కమిషన్.. వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. బండిని డీజీపీ విచారించాలని మహిళా కమిషన్ ఆదేశించింది.

Updated Date - 2023-03-11T16:31:24+05:30 IST