Jaahnavi Kandula: తెలుగు విద్యార్థిని మృతిపై యూఎస్ పోలీస్ అధికారి వెకిలి వ్యాఖ్యలు.. వైరల్‌గా మారిన వీడియో!

ABN , First Publish Date - 2023-09-14T08:36:28+05:30 IST

భారత విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై దర్యాప్తు జరుపుతున్న అమెరికా పోలీసు అధికారి నవ్వుతూ జోకులు పేల్చిన తీరు అతని బాడీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఆ వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో విమర్శలు వెల్లువెత్తాయి.

Jaahnavi Kandula: తెలుగు విద్యార్థిని మృతిపై యూఎస్ పోలీస్ అధికారి వెకిలి వ్యాఖ్యలు.. వైరల్‌గా మారిన వీడియో!

అమెరికా పోలీసు తీరు బాడీ కెమెరాలో రికార్డు

దర్యాప్తునకు ఆదేశించిన ఉన్నతాధికారులు

వాషింగ్టన్‌, సెప్టెంబరు 13: భారత విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై దర్యాప్తు జరుపుతున్న అమెరికా పోలీసు అధికారి నవ్వుతూ జోకులు పేల్చిన తీరు అతని బాడీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఆ వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రాథమిక దర్యాప్తు నివేదికనూ ఆ అధికారి తప్పులతడకగా సమర్పించినట్టు బట్టబయలైంది. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి(23) ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. నార్త్‌ఈస్టర్న్‌ యూనివర్సిటీ సియాటెల్‌ క్యాంప్‌సలో పీజీలో చేరారు. ఈ ఏడాది జనవరి 23న కాలినడకన రోడ్డు దాటుతున్న జాహ్నవిని పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీకొనడంతో ఘటన స్థలంలోనే ఆమె మరణించారు. ఆ సమయంలో ఆ వాహనాన్ని కెవిన్‌ డేవ్‌ అనే పోలీసు అధికారి నడుపుతున్నారు. దర్యాప్తు నిమిత్తం అక్కడికి వచ్చిన పోలీసు అధికారి డానియల్‌ అక్కడ జోకులు వేయడం, నవ్వడం అతని బాడీ కెమెరాలో రికార్డయ్యింది.

డానియల్‌ సియాటెల్‌ పోలీసు ఆఫీసర్స్‌ గిల్డ్‌ ఉపాధ్యక్షుడు. ఘటన స్థలం నుంచే గిల్డ్‌ అధ్యక్షుడు మైక్‌ సోలెన్‌కు డానియల్‌ ఫోన్‌ చేసి ప్రమాద వివరాలు తెలియజేశారు. ‘ఆమె చనిపోయింది’ అంటూ నవ్వడం, ‘ఆమె మామూలు మనిషే. 11 వేల డాలర్ల చెక్కు రాసేయండి సరిపోతుంది’ అంటూ మళ్లీ నవ్వడం వీడియోలో నమోదయ్యాయి. ఆ వీడియోలో చివరగా ‘ఆమె వయసు 26 ఉండొచ్చు. ఆమె జీవితానికి విలువ తక్కువ’ అని డానియల్‌ వ్యాఖ్యానించారు. డ్రైవర్‌ తప్పేమీ లేదని, క్రిమినల్‌ దర్యాప్తు అవసరం లేదని కూడా పైఅధికారికి తెలిపారు. ఈ వీడియో సోమవారం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.

Updated Date - 2023-09-14T08:41:12+05:30 IST