Share News

NRI: న్యూయార్క్‌లో తెలుగు మహిళా ఇంజనీర్‌కి అరుదైన పదవి.. తొలి ఆసియన్ మహిళగా రికార్డ్!

ABN , First Publish Date - 2023-12-08T07:12:40+05:30 IST

అమెరికాలో తెలుగువారు అనేక విజయాలు సాధిస్తూ యావత్ తెలుగుజాతికే గర్వకారణంగా నిలుస్తున్నారు. ప్రపంచ వాణిజ్య రాజధానిగా పిలిచే న్యూయార్క్‌ నగరంలో మున్సిపల్ ఇంజనీర్స్ ఆఫ్ సిటీ న్యూయార్క్ (ఎం.ఇ.ఎన్.వై) మీనికి అధ్యక్షురాలిగా తెలుగు ఇంజనీర్ సుధారాణి మన్నవ పదవీ బాధ్యతలు స్వీకరించారు.

NRI: న్యూయార్క్‌లో తెలుగు మహిళా ఇంజనీర్‌కి అరుదైన పదవి.. తొలి ఆసియన్ మహిళగా రికార్డ్!

ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా సుధారాణి మన్నవ

న్యూయార్క్, డిసెంబర్ 7: అమెరికాలో తెలుగువారు అనేక విజయాలు సాధిస్తూ యావత్ తెలుగుజాతికే గర్వకారణంగా నిలుస్తున్నారు. ప్రపంచ వాణిజ్య రాజధానిగా పిలిచే న్యూయార్క్‌ నగరంలో మున్సిపల్ ఇంజనీర్స్ ఆఫ్ సిటీ న్యూయార్క్ (ఎం.ఇ.ఎన్.వై) మీనికి అధ్యక్షురాలిగా తెలుగు ఇంజనీర్ సుధారాణి మన్నవ పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1903 నుంచి న్యూయార్క్ నగరంలో ఉన్న ఈ ఇంజనీర్స్ అసోషియేషన్‌కు న్యూయార్క్ నగరంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ అసోషియేన్‌లో అధ్యక్ష పదవి చేపట్టిన మొట్టమొదటి భారతీయ మహిళగా సుధారాణి మన్నవ చరిత్ర సృష్టించారు. అంతేకాదు ఈ పదవి చేపట్టిన ఆసియన్ మహిళ కూడా సుధారాణే. ఇది యావత్ తెలుగు వారంతా గర్వించదగ్గ విషయం. అమెరికాతో పాటు భారత్‌లోని సివిల్, ట్రాన్స్ పోర్ట్ ఇంజనీరింగ్ రంగాల్లో సుధారాణి మన్నవ తన సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం న్యూయార్క్ డిపార్టుమెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో టన్నెల్స్, ఈస్ట్ రివర్స్ బ్రిడ్జిల నిర్మాణ సమన్వయ డైరక్టర్‌గా పనిచేస్తున్నారు. సుధారాణి సేవలను న్యూయార్క్ సిటీ మేయర్ ఆఫీసు ఎన్నో సార్లు గుర్తించింది.

న్యూయార్క్ డిపార్టుమెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ సుధారాణికి ఎన్నో సార్లు ఉత్తమ సర్వీస్ అవార్డులు అందించింది. సుధారాణిలో ఇంజనీరింగ్ ప్రతిభతో పాటు నాయకత్వం, సమాజానికి సేవ గుణాలు ఎక్కువగా ఉండటం కూడా ఆమెను అంచెలంచెలుగా ఎదిగేలా చేశాయి. ఇంజనీరింగ్‌ సేవలతో పాటు సుధారాణి సామాజిక సేవలను గుర్తించి 2022లో నసావు కౌంటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ప్రశంస పత్రాన్ని అందించింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియాలో ట్రాఫిక్ డిమాండ్‌పై సుధారాణి సమర్పించిన పరిశోధనా పత్రం బంగారు పతకం సాధించింది. భారత్‌లో పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా మౌలిక సదుపాయల కల్పన ఎలా ఉండాలనేది సుధారాణి మన్నవ తన పరిశోధన పత్రంలో స్పష్టం చేశారు. 2022లో కెఎల్ యూనివర్సిటీ ఉమెన్ అచీవర్ అవార్డుతో సుధారాణి మన్నవను సత్కరించింది. అటు ఇంజనీరింగ్ రంగంలో సత్తా చాటుతూనే తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణపై సుధారాణి మక్కువ చూపుతుంటారు.

Telugu-Engineer.jpg

ప్రస్తుతం న్యూయార్క్‌లోని తెలుగు సాహిత్య , సాంస్కృతిక సంఘం (టీఎల్‌సీఏ)లో కార్య నిర్వహక సభ్యురాలిగా కూడా పనిచేస్తున్నారు. కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చేసిన సుధారాణి మన్నవ ఆ తర్వాత అన్నా యూనివర్సిటీ పరిధిలోని గిండీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్‌లో ఎం.ఇ చేశారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రవాణా ఇంజనీరింగ్‌లో పరిశోధన చేశారు.

  • మరిన్ని NRI NEWS కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-08T07:17:07+05:30 IST