NRI: ఏపీ రాజధాని అమరావతికి కోటి రూపాయల విరాళం.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఎన్నారై ప్రకటన..!

ABN , First Publish Date - 2023-05-31T18:59:53+05:30 IST

రాజధాని అమరావతి నిర్మాణానికి కోటి రూపాయల విరాళం ఇవ్వనున్నట్లు డాక్టర్ హేమప్రసాద్ యడ్ల తెలిపారు. మేరిల్యాండ్‌లో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మేరిల్యాండ్ టీడీపీ అధ్యక్షులు రాజా రావులపల్లి అధ్యక్షత వహించారు.

NRI: ఏపీ రాజధాని అమరావతికి కోటి రూపాయల విరాళం.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఎన్నారై ప్రకటన..!

మేరీల్యాండ్(అమెరికా): రాజధాని అమరావతి నిర్మాణానికి కోటి రూపాయల విరాళం ఇవ్వనున్నట్లు డాక్టర్ హేమప్రసాద్ యడ్ల తెలిపారు. మేరిల్యాండ్‌లో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మేరిల్యాండ్ టీడీపీ అధ్యక్షులు రాజా రావులపల్లి అధ్యక్షత వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. డాక్టర్ హేమప్రసాద్ యడ్ల, గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

డాక్టర్ హేమప్రసాద్ యడ్ల మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం, రాజధాని అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఆ దిశగా ప్రతి ప్రవాసాంధ్రుడు పనిచేయాలని సూచించారు. ‘ అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించడం తెలుగువారందరికీ గర్వకారణం. ఏనాటికైనా తెలుగువారు అమెరికా అధ్యక్షులు కావాలని ఎన్టీఆర్ ఆశించేవారు..’ అంటూ ఎన్టీఆర్‌తో తన అనుబంధాన్ని ఈ సందర్భంగా హేమప్రసాద్ యడ్ల గుర్తుచేసుకున్నారు.

‘ఒక శకం ముగిసింది, ఒక తార రాలిపోయింది, ఒక గొంతు మూగబోయింది, ఒక తరం అంతరించిపోయింది. పీడిత జన హృదయాల్లో నుంచి ఉద్భవించిన నిలువెత్తు చైతన్యం. ప్రజాభిమానమే ఊపిరిగా శ్వాసించి, ధ్యాసించి అమరుడైన అన్న ఎన్టీఆర్‌కు శత వసంతాల నీరాజనం. ఎన్టీఆర్ కాలాన్ని ప్రత్యేక యుగంగా, ఆయనొక యుగపురుషుడిగా తెలుగుసమాజం భావిస్తోంది. అందుకే ఆయన జీవితం అనేక యుగాల వారికి ఆదర్శం..’ అని మన్నవ సుబ్బారావు చెప్పుకొచ్చారు.

మైనేని రాంప్రసాద్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ ది మరణం లేని జననమనీ, మరణించి కూడా జీవిస్తూనే ఉన్నారన్నారు. చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిని చేయడమే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అని ఆయన వ్యాఖ్యానించారు. పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించుకోవడం ప్రతి ఒక్కరిలో సంతోషాన్ని నింపిందని సుబ్బరాయుడు జక్కంపూడి వివరించారు.

NRI-2.jpg

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి

రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం ద్వారా పేదవారికి అండగా నిలిచిన ఎన్టీఆర్ చరిత్ర అందరికీ మార్గదర్శకమని ఎన్నారైలు ముక్తకంఠంతో కొనియాడారు. సినీ రంగంలో రారాజుగా వెలుగొందిన ఆయన్ను జనమంతా గుండెల్లో పెట్టుకున్నారన్నారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కోరుతూ ఈ వేదిక ద్వారా తీర్మానించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేక్‌ను కట్ చేశారు. ప్రముఖ గాయని కల్యాణి ద్విభాష్యం అన్నమయ్య కీర్తనలను ఆలపించారు.

ఈ కార్యక్రమంలో జానకిరామ భోగినేని, ప్రసాద్ గనపనేని, శ్రీనాథ్ రావుల, శివ నెల్లూరి, భాను మాగులూరి, కిషోర్ కంచర్ల, ఆంధ్రాబ్యాంక్ రామ్మోహన్ రావు, ఆకర్ష్ వలివేటి, శ్రీనాథ్ కాండ్రు, శ్రీనివాస్ పైడి, రాంబాబు యలమంచిలి, సుధీర్ నిమ్మగడ్డ, హేమంత్ కాలే, వేణు గోరంట్ల, సుందర్ క్రోసూరి, సీతారాం గంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T19:00:12+05:30 IST