కథ కుంచెకి.. కనీవినీ ఎరుగని రీతిలో 28 గంటల పాటు కథా చిత్ర/ కూచి కుంచె విన్యాసం

ABN , First Publish Date - 2023-03-28T10:53:53+05:30 IST

మార్చి 18, 19 తేదీల్లో ప్రపంచ కథా దినోత్సవం సందర్భంగా అమెరికాలోని 'బీ పాజిటివ్ విత్ భాస్కర్' ఛానెల్, జూమ్, యూట్యూబ్ వేదికల ద్వారా 24 గంటల కథా మారథాన్ నిర్వహించింది.

కథ కుంచెకి.. కనీవినీ ఎరుగని రీతిలో 28 గంటల పాటు కథా చిత్ర/ కూచి కుంచె విన్యాసం

ఎన్నారై డెస్క్: మార్చి 18, 19 తేదీల్లో ప్రపంచ కథా దినోత్సవం సందర్భంగా అమెరికాలోని 'బీ పాజిటివ్ విత్ భాస్కర్' ఛానెల్, జూమ్, యూట్యూబ్ వేదికల ద్వారా 24 గంటల కథా మారథాన్ నిర్వహించింది. 12 దేశాల నుండి 125 మందికి పైగా కథకులు వారి వారి కథలను వినిపించారు. కార్యక్రమ నిర్వహకులు విజయ భాస్కర్ రాయవరం మాట్లాడుతూ.. ఈ వేడుకలో తనికెళ్ళ భరణి, వంగూరి చిట్టెన్ రాజు, వోలేటి పార్వతీశం, సత్యం మందపాటి, పొత్తూరి విజయలక్ష్మి వంటి లబ్ద ప్రతిష్టులైనవారెందరో పాల్గొన్నారని చెప్పారు. ఈ కథాకళతో పాటు ప్రముఖ చిత్రకారులు, కార్టూనిస్ట్ కూచి సాయి శంకర్ చిత్ర కళా నైపుణ్యం అబ్బురపరిచింది.

NN.jpg

కూచి సాయి విశేషంగా ఈ 125 మంది వినిపించిన కథలని వింటూ, అప్పటికప్పుడు ఆయా కథలని ప్రతిబింబించే బొమ్మలు వేశారు. 10 నిమిషాల పాటు చెప్పిన ప్రతి కథ విని, కథ ముగిసే లోపు దాని సారాంశం గ్రహించి 10 నిమిషాల్లో కథకి తగ్గ బొమ్మ వేసేందుకు ఎంత ఏకాగ్రత అవసరం అవుతుందో ఊహించవచ్చు. అలాంటిది మధ్యలో విరామం వంటివేమీ లేకుండా చివరి కథ వరకు చెక్కుచెదరని చిరునవ్వుతో 28 గంటల పాటు మెళకువగా ఉండి ఒక యజ్ఞంలా అద్భుతమైన 125కి పైగా బొమ్మలు వేశారాయన. 'ఐక్యమేవ జయతే' అనే ఈ ఏటి ఇతివృత్తంపై కథకులు విభిన్నమైన కథలను ఎంచుకుని వినిపించడం ఒక ఎత్తైతే, ఒకదానికి ఒకటి పోలిక లేని చిత్తరువులను అప్పటికప్పుడు 'లైవ్ ఆర్ట్' పద్ధతిలో సృజించిన చిత్ర కళాకారుడి ప్రతిభ సర్వత్రా నీరాజనాలు అందుకుంటోంది.

N.jpg

ఈ కథాచిత్ర సమ్మేళనం 28 గంటల పాటుసాగి పలువురి ప్రశంసలు పొంది రికార్డులని సొంతం చేసుకునే దిశగా పయనిస్తోంది. ఇలాంటి ప్రయత్నం ఇప్పటి వరకూ ఎవరూ చేయలేదని, కథ-కళ కలిపి కథాచిత్ర సమ్మేళనాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి అని నిర్వాహకులు తెలియజేశారు. దాంతో 'హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్' లోనే గాక, 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్' లోనూ ఈ వినూత్న కార్యక్రమం చోటు దక్కించుకునే అవకాశం ఉందని 'బీ పాజిటివ్ విత్ భాస్కర్' ఛానల్ భాస్కర్ రాయవరం తెలిపారు. పది కథల చొప్పున, కథలన్నింటినీ తెలుగు నేలకు జవజీవాలిచ్చే బాహుదా, మంజీర, వంశధార, నాగావళి వంటి నదుల పేర్లతో విభజించిన భాగాలకు పలువురు సంధాతలుగా వ్యవహరించారు. ఐతే ఈ కార్యక్రమం మొత్తానికి ఉన్న ఒకే ఒక కళాకారుడు కూచి కావడం విశేషం.

Updated Date - 2023-03-28T10:53:53+05:30 IST