NRI: 3నెలల కింద జాబ్ కోసం కెనడా వెళ్లిన భారత వ్యక్తి.. ఇంతలోనే విషాద ఘటన..

ABN , First Publish Date - 2022-12-27T11:53:22+05:30 IST

కెనడాలో క్రిస్మస్ పండగవేళ (Christmas Eve) విషాద ఘటన చోటు చేసుకుంది.

NRI: 3నెలల కింద జాబ్ కోసం కెనడా వెళ్లిన భారత వ్యక్తి.. ఇంతలోనే విషాద ఘటన..

టొరంటో: కెనడాలో క్రిస్మస్ పండగవేళ (Christmas Eve) విషాద ఘటన చోటు చేసుకుంది. బ్రిటీష్ కొలంబియాలోని ఐసీ జాతీయరహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో (Bus Accident) నలుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఓ భారత వ్యక్తి (Indian) కూడా ఉన్నాడు. మృతుడిని అమృత్‌సర్ (Amritsar) వాసి కరణ్‌జోత్ సింగ్ సోధిగా (Karanjot Singh Sodhi) కెనడా అధికారులు గుర్తించారు. కాగా, సింగ్ ఇటీవలే ఉద్యోగం కోసం కెనడా వెళ్లడం.. ఇంతలోనే ఈ ఘోరం జరగడం అతడి కుటుంబంలో విషాదాన్ని నింపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్ (Amritsar) పరిధిలోని బట్లాకు చెందిన కరణ్‌జోత్ సింగ్ సోధి మూడు నెలల కింద కెనడా వెళ్లాడు. అక్కడ ఓ పంజాబీ మీడియా ఏజెన్సీలో ఉద్యోగం చేస్తున్నాడు.

ఈ క్రమంలో శనివారం (డిసెంబర్ 24న) విధుల్లో భాగంగా మరికొందరితో కలిసి బస్సులో వాంకోవర్-కెలోవ్నా (Vancouver-Kelowna) మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. బ్రిటీష్ కొలంబియాలోని ఐసీ నేషనల్ హైవేపై సాయంత్రం 6గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్నవారిలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. వారిలో కరణ్‌జోత్ సింగ్ ఒకడు. అలాగే మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కెనడా అధికారులు తెలిపారు. వీరిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందట. ఇక కరణ్‌జోత్ సింగ్ మృతితో అతడి స్వస్థలం బట్లాలో విషాదం అలుముకుంది. అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కరణ్‌జోత్ సింగ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు స్నేహితులు తెలిపారు.

Updated Date - 2022-12-27T11:53:24+05:30 IST