Telangana Budget 2023: బడ్జెట్‌లో ప్రవాసీయుల సంక్షేమానికి సున్నా..

ABN , First Publish Date - 2023-02-08T08:53:46+05:30 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ యువత బతుకు దుబాయి, బొంబాయి, బొగ్గు బాయిగా మారిపోయిందని, తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిస్థితి మారుతుందంటూ కేసీఆర్ ఇచ్చిన హామీ స్వరాష్ట్ర బడ్జెట్‌లో ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది.

Telangana Budget 2023: బడ్జెట్‌లో ప్రవాసీయుల సంక్షేమానికి సున్నా..

అమలుకు నోచుకోని సీఎం కేసీఆర్ రూ.500కోట్ల హామీ

నాడూ, నేడూ.. అదే దుబాయి, బొంబాయి, బొగ్గుబాయి..

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ యువత బతుకు దుబాయి, బొంబాయి, బొగ్గు బాయిగా మారిపోయిందని, తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిస్థితి మారుతుందంటూ కేసీఆర్ ఇచ్చిన హామీ స్వరాష్ట్ర బడ్జెట్‌లో ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది. ఈసారి బడ్జెట్‌లో ప్రవాసీయుల సంక్షేమానికి ఎలాంటి కేటాయింపులు జరపకపోవడంతో వారు నిరాశకు గురయ్యారు. గత బడ్జెట్ సమావేశాల్లో గల్ఫ్ ప్రవాసుల గురించి సానుభూతితో పరిశీలిస్తున్నట్లుగా ప్రకటించిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు.. ఈ బడ్జెట్‌లో వారిని పూర్తి విస్మరించారు. గతంలో ఒకసారి సీఎం కేసీఆర్ గల్ఫ్ దేశాల ప్రతినిధులను పిలిపించి 2018-19 బడ్జెట్‌లో రూ.100కోట్లు కేటాయిస్తామని, త్వరలో మరో రూ.500కోట్లు కేటాయిస్తామని ప్రకటించడంతో సంతోషపడ్డారు.

ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని గుర్తించి నిరాశకు గురయ్యారు. ఈసారి దాదాపు 3లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌లో కనీసం రూ.50 కోట్లయినా కేటాయించడం పెద్ద సమస్య కాదని, అయితే నామమాత్రంగానైనా కేటాయింపులు జరపడానికి మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి ప్రయత్నించినా కేసీఆర్ బడ్జెట్ కేటాయింపునకు విముఖత చూపినట్లు తెలుస్తోంది. బిహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్ కార్మికులు హైదరాబాద్‌కు వచ్చి పని చేస్తుండగా.. తెలంగాణ యువత మాత్రం గల్ఫ్ దేశాలకు వెళ్లి పని చేస్తున్న ఔచిత్యాన్ని ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా, బంగారు తెలంగాణలో ప్రవాసుల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపు సమస్యకాదని, అయితే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోందని ప్రవాసీ కార్మికుల నేత మండ భీంరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-02-08T08:54:46+05:30 IST