Atiq Ahmed Encounter: మాఫియా ఏరివేతలో సామాజిక వివక్ష

ABN , First Publish Date - 2023-04-19T07:11:42+05:30 IST

సమానవకాశాలు కొరవడ్డ సామాజిక వర్గాలకు చెందిన పలువురు రాజకీయ అండ దండలతో ఆమోదయోగ్యమైన నేతలుగా ఎదిగారు.

Atiq Ahmed Encounter: మాఫియా ఏరివేతలో సామాజిక వివక్ష

సమానవకాశాలు కొరవడ్డ సామాజిక వర్గాలకు చెందిన పలువురు రాజకీయ అండ దండలతో ఆమోదయోగ్యమైన నేతలుగా ఎదిగారు. ఇటువంటి నేతలు దేశవ్యాప్తంగా చాలా మంది ఉన్నా, ఉత్తరప్రదేశ్, బిహార్‌లలో వారి సంఖ్య మరీ ఎక్కువ. ఫూలన్ దేవి, రాజు భయ్యా, వికాస్ దూబే, మున్నా భజరంగీ, అతీఖ్ అహ్మద్, మొఖ్తార్ అన్సారీ, బ్రజేశ్ సింగ్, డిపి యాదవ్ తదితరులు ఉత్తరప్రదేశ్‌లో ప్రముఖులు. వీరిలో వెనుకబడ్డ వర్గాలకు చెందిన వారితో పాటు ముస్లింలు, అగ్రకుల ఠాకూర్లు, బ్రాహ్మణులు కూడా ఉన్నారు.

అందరూ నేర చరితులే. అదెలా ఉన్నా ప్రజాక్షేత్రంలో వీరందరికి ఎంతో కొంత మేరకు సానుకూలత ఉంది. విదేశాలలో కూడా వీరందరికీ వీరాభిమానులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో ఈ నేతలు అందరూ చక్రాలు తిప్పిన వారే. నేరస్థులకు దన్నుగా నిలిచిందన్న పేరు ములాయంసింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీకి ఉండేది. అయినప్పటికీ కళ్యాణ్ సింగ్ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కావడంలో ఈ మాఫియాలోని కొన్ని వర్గాలు కీలక పాత్ర వహించాయనేది ఒక చారిత్రక వాస్తవం. కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెన్వెంటనే రాజు భయ్యా ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా నేరమయమైన రాజకీయం ఉత్తరప్రదేశ్‌లో సాధారణమై పోయింది. అయితే ముఖ్యమంత్రిగా యోగి అదిత్యనాథ్ వచ్చిన తర్వాత ఆ పరిస్థితిలో గణనీయమైన మార్పు చోటు చేసుకొంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ముంబాయి తరహా బలవంతపు వసూళ్ళు కాకుండా ఉత్తరప్రదేశ్‌లో భూముల దురాక్రమణ ప్రధాన ధ్యేయంగా మాఫియా పని చేస్తుంది. ఈ అక్రమాలను రూపుమాపే లక్ష్యంతో ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆన్‌లైన్ పోర్టల్‌లో ప్రత్యేకంగా ఒక వ్యవస్ధను ఏర్పాటు చేశారు. యూపీలోని స్ధానికులతో పాటు విదేశాలలో ఉన్న యూపీ వాసులు కూడా తమ భూముల కబ్జా గురించి ఫిర్యాదు చేసేందుకు ఆ సదుపాయం ప్రయోజనకరంగా ఉపయోగపడుతోంది. దీనికి తోడుగా యోగి సర్కార్ ప్రారంభించిన ఎదురు కాల్పుల విధానం నేరస్థులలో వణుకు పుట్టించింది. అయితే మాఫియా ఏరివేతలో ముఖ్యమంత్రి సామాజిక వివక్ష ప్రదర్శిస్తున్నారని ఠాకూరేతర వర్గాలు ఆరోపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలోని కొన్ని సామాజిక పెత్తందారీ వర్గాల తరహాలో యూపీ గ్రామీణ ప్రాంతాలలో ఠాకూర్లకు అధిపత్యం ఉన్నది. రాజు భయ్యా, వికాస్ దూబే ఇరువురిపై పోలీసులను హతమార్చారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే వికాస్ దూబేను ఎన్‌కౌంటర్ చేసి రాజు భయ్యాతో ముఖ్యమంత్రి సమావేశం కావడాన్ని ఠాకూరేతర వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అతీఖ్ అహ్మద్, అతని సోదరుడు పోలీసు పహారాలో హత్యకు గురికావడంతో పాటు అతీఖ్ కుమారుడు ఎన్‌కౌంటర్‌లో మరణించిన పరిస్ధితులపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గంగా జమున తెహజీబ్‌కు పుట్టినిల్లయిన అలహాబాద్‌లో అతీఖ్ అహ్మద్ ఒక బలమైన నాయకుడు. చదువు సంధ్యలకు దూరం కాకుండా కష్టపడి చదవాలని తనను కలిసిన యువజనులకు అతడు మరీ మరీ చెప్పుతుండేవాడు. పలువురు యువతీయువకుల విద్యాభ్యాసానికి ఆయన ఆర్థిక సహకారం అందించాడు. ఇటువంటి మంచిపనులతో అతీఖ్‌కు అలహాబాద్‌లో ఆదరణ పెరిగింది. అతీఖ్ మాత్రమే కాదు, డిపి యాదవ్ మొదలైన నేరచరితులు అందరూ తమను నమ్ముకున్న వారి పిల్లలకు విదేశీ విద్య అందించడానికి కూడా సహాయపడ్డారు. లండన్ నుండి బారిష్టర్ విద్యనభ్యసించడానికి ఎన్‌కౌంటర్‌లో మరణించిన అతీఖ్ కొడుకు బారిష్టర్ విద్యనభ్యసించడానికి లండన్ వెళ్లదలుచుకున్నాడు. అసదోద్దీన్ ఓవైసీ అతడికి ఆదర్శం. లండన్‌కు వెళ్ళడానికి పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోగా తండ్రిపై ఉన్న నేరాల చిట్టా కారణాన పోలీసులు అనుకూల నివేదిక ఇవ్వలేదు. దీంతో అతీఖ్ కుమారుడికి పాస్ పోర్టు జారీ కాలేదు.

ములాయం సింగ్ యాదవ్‌కు అతీఖ్ సన్నిహితుడుగా ఉండేవాడు. అయితే అఖిలేశ్ యాదవ్‌కు దూరంగా ఉండి బహుజన్ సమాజ్ పార్టీకి దగ్గరయ్యాడు. అతీఖ్ అహ్మద్ జైలులో ఉన్నా ఆయనకు కొన్ని వర్గాలలో ప్రత్యేకించి ముస్లిం సామాజిక వర్గంలో ఆదరణ ఉన్నది. ఈ కారణాన అతని భార్యను అలహాబాద్ మేయర్‌గా ఒక దశలో మాయవతి ప్రతిపాదించారు. అతీఖ్ జైలులో ఉన్నా ఆయన భార్య, కుమారుడు నిర్వహించిన సభలన్నీ విజయవంతమవ్వడం గమనార్హం.

ఆ తర్వాత హైదరాబాద్ నేత అసదుద్దీన్ ఓవైసీ ఉత్తరప్రదేశ్‌లో అడుగుపెట్టి అలహాబాద్ గంగా జమునా తెహజీబ్‌ను బలహీనపరిచాడు. అప్పటి వరకు అందరికీ నాయకుడుగా ఉన్న అతీఖ్ అహ్మద్, ఓవైసీకి దగ్గరవడంతో అతను కేవలం ఒక ముస్లిం వర్గానికి మాత్రమే నాయకుడయ్యాడు. నేర చరిత్రకు తోడుగా విద్వేషపూరిత రాజకీయాలు పరిస్ధితిని మరింత జటిలం చేశాయి.

అతీఖ్ వ్యక్తిగత లేదా నేర చరిత్ర ఎలా ఉన్నా చట్టబద్ధంగా ఆయనను శిక్షించవల్సిన ప్రభుత్వం ఎందుకు విఫలమయింది? ఎవరు అడ్డుకున్నారు? పాకిస్థాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్, పార్లమెంటుపై దాడి నిందితుడు అఫ్జల్ గురు, ప్రధాని ఇందిరా గాంధీని హతమార్చిన బియాంత్, కేహార్ సింగ్‌లను సైతం చట్టపరంగా శిక్షించిన దేశం మనది.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - 2023-04-19T07:20:43+05:30 IST