Share News

NRI: 49వ సింగపూర్ తెలుగు సమాజం ఆవిర్భావ దినోత్సవం

ABN , First Publish Date - 2023-11-16T08:51:34+05:30 IST

1975 నవంబర్ 11న సింగపూర్‌లోని తెలుగు వారి శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన సింగపూర్ తెలుగు సమాజం అనేక రకాల సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తూ నవంబర్ 11న 49వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది.

NRI: 49వ సింగపూర్ తెలుగు సమాజం ఆవిర్భావ దినోత్సవం

వృద్ధాశ్రమం సందర్శన, రక్తదాన కార్యక్రమాలతో స్ఫూర్తివంతంగా సాగిన 49వ సింగపూర్ తెలుగు సమాజం ఆవిర్భావ దినోత్సవం

NRI: 1975 నవంబర్ 11న సింగపూర్‌లోని తెలుగు వారి శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన సింగపూర్ తెలుగు సమాజం అనేక రకాల సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తూ నవంబర్ 11న 49వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగపూర్‌లోని స్థానిక SASCO వృద్ధాశ్రమం సందర్శన కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ సిటిజన్లు ఉన్న ఈ ఆశ్రమంలో కమిటీ సభ్యులందరూ చురుకుగా పాల్గొని వృద్ధులను పరామర్శించి, వారితో మాటలు కలుపుతూ వారి అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆరోగ్యకరమైన భోజనం, తాజా పండ్లను పంచారు. అలాగే కొత్త దుస్తులను పంపిణీ చేశారు. భోజనాల అనంతరం కమిటీ సభ్యులు ఆ ప్రాంగణ పరిశుభ్రతలో పాలుపంచుకొని వృద్ధాశ్రమం సిబ్బంది హృదయాల్ని గెలిచారు. ఈ సందర్భంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం ద్వారా వృద్ధుల చిరునవ్వు చూసి కమిటీ సభ్యులు అందరూ తమ ప్రయత్నం సఫలం అయ్యింది అని తెలిపారు. అంతే కాకుండా ఈ సందర్భంగా ఏక కాలంలో ఔట్రం పార్క్, పుంగోల్‌లో రక్తదాన శిబిరాలను నిర్వహించి చిరస్మరణీయ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగపూర్‌లోని తెలుగు వారు పాల్గొని జయప్రదం చేశారు. భార్యభర్తలు బండారు యశోద, మాసారపు రాజు‌లు తమ బాబుతో కలసి రక్తదానం చేయటానికి ముందుకు రావడం అందరికీ స్ఫూర్తిని కలిగించింది.

STSSS.jpg

అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ తెలుగు సమాజం ఏర్పాటు చేసిన వ్యవస్థాపకులను, గత అధ్యక్షుల సేవలను కొనియాడారు. తెలుగు సమాజం ఎన్నో సంవత్సరాలుగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ రక్తదానంపై అవగాహన కల్పిస్తూ విశేషమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ సేవా కార్యక్రమాల విశిష్టత, ఆవశ్యకతను తెలియచేస్తూ అందరికీ 49వ సింగపూర్ తెలుగు సమాజం ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాలలో పాల్గొని వాలంటీర్లుగా వ్యవహరించిన ఆరేపల్లి విజయ్ బాబు, ఢీకొండ సంపత్ రావు, రక్తదాతలకు, వృద్ధాశ్రమం నిర్వాహుకులకు సహాయ కోశాధికారి జూనెబోయిన అర్జునరావు ధన్యవాదాలు తెలిపారు. మనం సమాజానికి సేవ చేయాల్సిన అవసరాన్ని, కలిసి పని చేయ్యడం ఆవశ్యకతను ప్రత్యేకించి చెప్పారు.

కార్యానిర్వాహక సభ్యులు తమకు వృద్ధాశ్రమంలో గడిపిన సమయంలో కలిగిన విశాల భావాల్ని పంచుకున్నారు. భవిష్యత్తులో తమకి రాబోయే వృద్ధాప్యం కళ్ళముందు కదలాడిందని, పరుగులమయ జీవితాన్ని కాసేపు ఆపేలా చేసిందని పేర్కొన్నారు. మనలోని అహంకారాన్ని సంపూర్ణంగా తీసేస్తేనే ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తామని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటే మనలో స్వార్ధం తగ్గి ఆనందమయ జీవిత మార్గంలో నడుచుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజుల శ్రీ లక్ష్మి, పాలెపు మల్లిక్, కొత్తా సుప్రియ, బచ్చు ప్రసాద్, పుల్లన్నగారి శ్రీనివాస రెడ్డి, టేకూరి నగేష్, రాపేటి జనార్ధన్, వైదా మహేష్, బద్దం జితేందర్, స్వామి గోపి కిషోర్, రొడ్డ సతీష్, ఉద్ధగిరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

STSS.jpg

Updated Date - 2023-11-16T08:51:36+05:30 IST