Vande Sadharan: పేదల కోసం వందే సాధారణ్ రైళ్లు.. అక్టోబరులో ప్రారంభం

ABN , First Publish Date - 2023-07-17T20:55:38+05:30 IST

పేదలను దృష్టిలో పెంచుకుని రైల్వే శాఖ వందే భారత్‌ రైళ్లలో సరికొత్త వేరియంట్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు వందే భారత్‌ స్లీపర్‌, వందే మెట్రో, వందే సాధారణ్‌ రైళ్లను పరిచయం చేయనుంది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి వందే సాధారణ్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్లు గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నాయి.

Vande Sadharan: పేదల కోసం వందే సాధారణ్ రైళ్లు.. అక్టోబరులో ప్రారంభం

కేంద్రంలోని మోదీ సర్కారు (Modi Government) ప్రవేశపెట్టిన వందే భారత్ (Vande Bharat) రైళ్లు సామాన్యులకు గుదిబండలా మారాయి. ఆయా రైళ్లలో ఛార్జీలు ఎక్కువ ఉండటంతో సామాన్యులు ప్రయాణించలేకపోతున్నారు. వందే భారత్ రైళ్లు ప్రజలను వేగంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నా అధిక ఛార్జీలను భరించలేక పేదలు మిగతా రైళ్లలో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా ఇప్పటివరకు 25 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను భారతీయ రైల్వేలు (Indian Railways) అందుబాటులోకి తెచ్చాయి. త్వరలో మరిన్ని వందే భారత్ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వే ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే.. కొన్ని మార్గాల్లో వందేభారత్ రైళ్లకు మంచి డిమాండ్ ఉంది. కొన్ని మార్గాల్లో మాత్రం ఈ రైళ్లలో ఆక్యుపెన్సీ చాలా తక్కువగా ఉంటోంది. అయితే పేదలను దృష్టిలో పెంచుకుని రైల్వే శాఖ వందే భారత్‌ రైళ్లలో సరికొత్త వేరియంట్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు వందే భారత్‌ స్లీపర్‌, వందే మెట్రో, వందే సాధారణ్‌ రైళ్లను పరిచయం చేయనుంది. ప్రస్తుతం వందేభారత్ రైళ్లు 550 కి.మీ. వరకు కవర్ చేస్తున్నాయి. వీటిలో కేవలం చైర్‌కార్‌ సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో ప్రవేశపెట్టనున్న వందే భారత్‌ రైళ్లు 550 కిలోమీటర్లకు పైగా దూరాన్ని కవర్‌ చేయనున్నాయి. ఇందులో మిగతా రైళ్లలో మాదిరిగానే స్లీపర్‌ బోగీలు ఏర్పాటు చేయనున్నారు.


అటు మధ్యతరగతి, పేద ప్రజల కోసం వందే సాధారణ్ రైళ్లను రైల్వేశాఖ తీసుకురానుంది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి వందే సాధారణ్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు వందే సాధారణ్‌ రైళ్ల ప్రారంభంపై చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ బీజీ మాల్యా ఓ ప్రకటన చేశారు. ఈ రైళ్లను అక్టోబర్‌లో ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ రైళ్లు గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని బీజీ మాల్యా అన్నారు. ఈ రైళ్లలో ఛార్జీలు తక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ఆయా రైళ్లలో అన్నీ నాన్‌ ఏసీ బోగీలను ఏర్పాటు చేయనుండగా.. మిగతా సౌకర్యాలన్నీ వందే భారత్‌ రైళ్లలో ఉన్నట్లే ఉంటాయి. కొత్తగా తీసుకురాబోతున్న నాన్‌ ఏసీ రైలులో 22 కోచ్‌లు ఉంటాయని, రెండు వైపులా లోకోస్ ఉంటాయని సమాచారం అందుతోంది.

ఇది కూడా చదవండి: Shocking: 25 ఏళ్ల ఈ కుర్రాడు.. ఎలా చనిపోయాడో తెలిస్తే నివ్వెరపోవడం ఖాయం.. స్నేహితులతో సరదాగా కాసిన పందెమే..!

అయితే వందే సాధారణ్ రైలు గంటకు 130 కిలోమీటర్ల వేగం మించితే శబ్దం, దుమ్ము తీవ్రంగా ఉంటుందని, అప్పుడు కిటికీలకు షీల్డ్ పెట్టాల్సి ఉంటుందని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ బీజీ మాల్యా తెలిపారు. ఒకవేళ షీల్డ్ పెడితే ఏసీ అవసరం అవుతుందన్నారు. అందువల్ల ఈ రైళ్ల వేగం 130 కి.మీ లోపలే ఉంటుందన్నారు. మరోవైపు వందే మెట్రో రైళ్లను కూడా రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకురానుంది. వందే మెట్రో రైలు 100-150 కిలోమీటర్ల వరకు ఉన్న నగరాలను కవర్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. వందే మెట్రో రైలు ప్రతిరోజు నాలుగైదు ట్రిప్పులు వేయనుంది. ఆయా రైళ్లలో చైర్‌కార్స్‌ అందుబాటులో ఉంటాయి.

కాగా వందే భారత్‌ రైళ్లకు కాషాయ రంగు వేయాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. వందేభారత్‌ రైలు బయటి భాగం ఎక్కువగా తెలుపు రంగులో ఉండటం వల్ల మట్టి అంటుకుని మురికిగా కనిపించే అవకాశముందని, అందువల్ల కాషాయ రంగుకు మార్చాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2023-07-17T20:55:45+05:30 IST