Unusual heavy rains : ఉత్తరాదిలో ఎందుకు ఈ అసాధారణ భారీ వర్షాలు?

ABN , First Publish Date - 2023-07-10T10:45:15+05:30 IST

ఉత్తర భారతం రెండు రోజుల నుంచి భారీ వర్షాలతో సతమతమవుతోంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానాలలో అసాధారణ వర్షాలు ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటం, హఠాత్తుగా వరదలు సంభవించడం, హైవేలు, వంతెనలు, ఇతర నిర్మాణాలు కొట్టుకుపోవడం వంటివాటివల్ల జనజీవనం అతలాకుతలమవుతోంది.

Unusual heavy rains : ఉత్తరాదిలో ఎందుకు ఈ అసాధారణ భారీ వర్షాలు?

న్యూఢిల్లీ : ఉత్తర భారతం రెండు రోజుల నుంచి భారీ వర్షాలతో సతమతమవుతోంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానాలలో అసాధారణ వర్షాలు ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటం, హఠాత్తుగా వరదలు సంభవించడం, హైవేలు, వంతెనలు, ఇతర నిర్మాణాలు కొట్టుకుపోవడం వంటివాటివల్ల జనజీవనం అతలాకుతలమవుతోంది. మధ్యధరా సముద్ర ప్రాంతంలో తుపానులు, రుతుపవనాల ద్రోణి కలగలిసి ఈ పరిస్థితులను సృష్టించాయి.

భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, జూన్ నెలాఖరు వరకు 10 శాతం వర్షపాతం కొరత ఉండేది. పశ్చిమ తీరంలోనూ, ఉత్తరాదిలోని కొన్ని ప్రాంతాల్లోనూ గడచిన వారంలో రుతుపవనాలు విజృంభించడం వల్ల జూలై 9న దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం కన్నా 2 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వాయవ్య భారతంలో 59 శాతం, మధ్య భారతంలో 4 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, దక్షిణాదిలో 23 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. అదేవిధంగా తూర్పు, ఈశాన్య భారతంలో 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.

శని, ఆదివారాల్లో చండీగఢ్‌లో అత్యధికంగా 32 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అంబాలాలో 22 సెంటీమీటర్లు, ఢిల్లీలో 15 సెంటీమీటర్లు, నంగల్‌లో 28 సెంటీమీటర్లు, రోపార్‌లో 27 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. ఈ ప్రభావం వల్ల ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు హిమాచల్ ప్రదేశ్‌లోని భుంటర్‌లో 10 సెంటీమీటర్లు, మండీలో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

ఊహించినట్లే జరిగింది : మహాపాత్ర

వెదర్ బ్యూరో డైరెక్టర్ జనరల్ ఎం మహాపాత్ర మాట్లాడుతూ, మధ్యధరా సముద్ర ప్రాంతంలో తుపానులు, రుతుపవనాల ద్రోణి ప్రభావంతో జమ్మూ-కశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. జూలైలో వర్షాలు బాగా కురుస్తాయని తాము ముందుగానే చెప్పామన్నారు. వర్షపాతం కొరత ఇప్పుడు భర్తీ అయిందని చెప్పారు. గడచిన తొమ్మిది రోజుల్లో వర్షపాతం జూలై నెలలో 24 శాతం ఎక్కువ అని తెలిపారు. ఇక నుంచి వర్షాలు క్రమంగా తగ్గుముఖం పడతాయని చెప్పారు

ఒడిశా, జార్ఖండ్‌లలో భారీ వర్షాలు

ఒడిశాలో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్‌లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురియవచ్చునని తెలిపింది. కోస్టల్ కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో, మధ్య భారతంలో రానున్న ఐదు రోజుల్లో, పశ్చిమ మధ్య ప్రదేశ్‌లో సోమవారం చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

ఉత్తరాదిలో ఆదివారం కుండపోత వర్షాలు

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీలలో ఆదివారం కుండపోత వర్షాలు కురిశాయి. వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వాహనాలు కొట్టుకుపోవడం, రోడ్లు కోతకు గురికావడం, వంతెనలు కూలిపోవడం వంటి సంఘటనలతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని 10 జిల్లాల్లోనూ, ఉత్తరాఖండ్‌లోనూ రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రధాన నదుల్లో నీటి మట్టం పెరిగింది. ఉత్తరాఖండ్‌లో మంగళవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీలో సోమవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. హర్యానా ప్రభుత్వం 1 లక్ష క్యూసెక్కులకుపైగా నీటిని యమునా నదిలోకి వదిలిపెట్టడంతో ఢిల్లీ ప్రభుత్వం వరద హెచ్చరికను జారీ చేసింది. యమునా నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోందని తాజా సమాచారం వెల్లడిస్తోంది. ఈ నదిలో 3 లక్షల క్యూసెక్కులకుపైగా నీరు ప్రవహిస్తోందని అంచనా. కొండ ప్రాంతాల్లో వర్షాలు కురియడం వల్ల యమునా నదిలో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావచ్చు.

చండీగఢ్-మనాలీ జాతీయ రహదారి మూసివేత

మండీ వద్ద కొండచరియలు విరిగిపడటంతో చండీగఢ్-మనాలీ జాతీయ రహదారిని మూసివేశారు. దీంతో ఈ ప్రాంతంలో పర్యటకులు చిక్కుకుపోయారు. కొన్ని చెట్లు వేళ్లతో సహా కూలిపోయి, రెండంతస్థుల భవనాన్ని ఢీకొట్టాయి. ఈ భవనంలో నివసిస్తున్నవారిని సురక్షితంగా కాపాడగలిగారు. మనాలీలోని ఆలూ మైదానంలో 29 మంది చిక్కుకుపోగా, వారందరినీ హోం గార్డులు కాపాడారు.

కేరళలో యెల్లో అలర్ట్ జారీ

కేరళలోని ఎర్నాకుళం, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ అయింది. ఈ మూడు జిల్లాలతోపాటు, కొట్టాయం, అలపుజ, పఠనంతిట్ట జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

కేజ్రీవాల్ సమావేశం

ఢిల్లీలోని ప్రగతి మైదానం సొరంగాన్ని మూసివేశారు. ఈ సొరంగం మార్గం జలమయం కావడంతో ట్రాఫిక్‌ను అనుమతించడం లేదు. ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండటంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. నగరంలో వాతావరణ పరిస్థితులపై చర్చించేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సచివాలయంలో ఓ సమావేశాన్ని సోమవారం నిర్వహించబోతున్నారు. భారీ వర్షాలు, వరదలు, ట్రాఫిక్ జామ్‌ల నేపథ్యంలో చేపట్టవలసిన చర్యల గురించి చర్చిస్తారు. నగర పాలక సంస్థ అధికారులు, వరద నియంత్రణ శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు.

ఉత్తరాఖండ్‌లో 13 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్

ఉత్తరాఖండ్‌లో వరదలు, కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రాష్ట్రంలో 13 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తర కాశీ, హరిద్వార్, పిథోరాగఢ్, రుద్ర ప్రయాగ్, నైనిటాల్‌లలో ఆకాశం దట్టమైన మేఘాలతో నిండిపోయింది. డెహ్రాడూన్, కోట్‌ద్వార్, పౌరీ, తెహ్రీ జిల్లాల్లో సూర్య కాంతి కనిపించింది.

ఇవి కూడా చదవండి :

Tomatoes Free: స్మార్ట్‌ఫోన్‌ కొంటే 2 కిలోల టొమాటోలు ఫ్రీ!

ఈ వారమే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?

Updated Date - 2023-07-10T10:45:15+05:30 IST