Who Is Luthra : చంద్రబాబు తరపున వాదిస్తున్న సిద్ధార్థ్ లూథ్రా ఎవరు.. బ్యాగ్రౌండ్, ఫీజు కథేంటి..!?
ABN , First Publish Date - 2023-09-10T14:22:13+05:30 IST
కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల తరపున ఆయన అనేక కేసుల్లో బలమైన వాదనలు వినిపించారు. వైట్ కాలర్ నేరాలు, సైబర్ మోసాలు, క్రిమినల్ చట్టాలకు సంబంధించిన కేసుల్లో వాదనలు వినిపించడంలో ఆయనకు గొప్ప నైపుణ్యం ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరపున అవినీతి నిరోధక శాఖ కోర్టులో వాదనలు వినిపించేందుకు వచ్చిన సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా ఎంతో అనుభవశాలి. ప్రాథమిక హక్కులు, ఎన్నికల సంస్కరణలు, క్రిమినల్ చట్టాలు, విధానపరమైన అంశాల్లో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల తరపున ఆయన అనేక కేసుల్లో బలమైన వాదనలు వినిపించారు. వైట్ కాలర్ నేరాలు, సైబర్ మోసాలు, క్రిమినల్ చట్టాలకు సంబంధించిన కేసుల్లో వాదనలు వినిపించడంలో ఆయనకు గొప్ప నైపుణ్యం ఉంది.

న్యాయశాస్త్రంలో దిట్ట
సిద్ధార్థ్ లూథ్రా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయ శాస్త్రంలో డిగ్రీ చేశారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో క్రిమినాలజీలో ఎంఫిల్ చేశారు. నోయిడాలోని ఎమిటీ విశ్వవిద్యాలయం ఆయనకు న్యాయశాస్త్రంలో గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. ఢిల్లీ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ సభ్యునిగా, ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సొసైటీ ఉపాధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. రెండు ఇండియన్ లీగల్ జర్నల్స్ సలహా మండళ్లలో ఆయన సభ్యుడు. అంతేకాకుండా ఆయన దేశ, విదేశాల్లో న్యాయ శాస్త్రాన్ని బోధిస్తూ ఉంటారు. బ్రిటన్లోని నార్తుంబ్రియా విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్లోని ఎమిటీ విశ్వవిద్యాలయంలో ఆనరరీ ప్రొఫెసర్ కూడా.

కీలక కేసుల్లో బలమైన వాదనలు
మన దేశంలోని టాప్ క్రిమినల్ లాయర్స్లో ఒకరైన సిద్ధార్థ్ లూథ్రా మూడు దశాబ్దాల నుంచి న్యాయవాద వృత్తిని ప్రాక్టీస్ చేస్తున్నారు. 2007లో ఆయనకు సీనియర్ అడ్వకేట్ డిజిగ్నేషన్ లభించింది. 2010 నుంచి ఆయన సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. 2012 జూలై నుంచి 2014 మే వరకు ఆయన అదనపు సొలిసిటర్ జనరల్గా పని చేశారు. కేంద్ర, రాష్ట్రాల తరపున ఆయన అనేక కేసుల్లో సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై మాజీ కేంద్ర మంత్రి, దివంగత అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో జైట్లీ తరపున వాదనలు వినిపించారు. తెహల్కా కేసులో 2002లో అప్పటి రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ను లూథ్రా క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఢిల్లీ హైకోర్టులో 2004 నుంచి 2007 వరకు భారత ప్రభుత్వం తరపున అనేక కేసుల్లో వాదనలు వినిపించారు. పాత్రికేయుడు వినయ్ రాయ్ ఫేస్బుక్, గూగుల్, యాహూ వంటి 21 సామాజిక మాధ్యమాలకు వ్యతిరేకంగా కేసు దాఖలు చేశారు. ఈ కేసులో ఫేస్బుక్ తరపున లూథ్రా వాదనలు వినిపించారు. వాట్సాప్ ప్రైవసీ పాలసీపై ఇద్దరు విద్యార్థులు దాఖలు చేసిన కేసులో కూడా ఆయన ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించారు.

ఫీజు గురించి తెలుసుకుంటే, అమ్మో అనాల్సిందే!
సిద్ధార్థ్ లూథ్రా కోర్టుకు హాజరవాలంటే రూ.5 లక్షలు వసూలు చేస్తారని విశ్వసనీయ సమాచారం. ప్రయాణ ఖర్చులు, బస, ఇతర సదుపాయాల కోసం అదనంగా వసూలు చేస్తారని తెలుస్తోంది. కేసు తీవ్రతనుబట్టి ఒకసారి కోర్టులో హాజరవడానికి రూ.15 లక్షల వరకు ఆయన డిమాండ్ చేస్తారని సమాచారం.

ఇవి కూడా చదవండి :
CBN Arrest Case : ఏసీబీ కోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన చంద్రబాబు.. ఏం చెప్పారంటే..?