Rahul Gandhi and Priyanka: చిన్నపిల్లల్లా మారిపోయిన రాహుల్-ప్రియాక.. మంచు బంతులు విసురుకుంటూ..

ABN , First Publish Date - 2023-01-30T16:41:54+05:30 IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన ‘భారత్ జోడో’(Bharat Jodo) యాత్ర ముగిసింది. గతేడాది సెప్టెంబరు 7న తమిళనాడులోని

Rahul Gandhi and Priyanka: చిన్నపిల్లల్లా మారిపోయిన రాహుల్-ప్రియాక.. మంచు బంతులు విసురుకుంటూ..

శ్రీనగర్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన ‘భారత్ జోడో’(Bharat Jodo) యాత్ర ముగిసింది. గతేడాది సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారి(Kanyakumari)లో ప్రారంభమైన యాత్ర 4,080 కిలోమీటర్ల మేర సాగింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల మీదుగా సాగుతూ జమ్మూ కశ్మీర్ చేరుకున్న యాత్ర నేడు ముగిసింది.

శ్రీనగర్‌లో భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా అత్యంత అరుదైన దృశ్యం కనిపించింది. రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra) ఇద్దరూ చిన్నపిల్లలు అయిపోయారు. ఒకరిపై ఒకరు మంచు బంతులు (Snow Balls) విసురుకుంటూ ఆడుకున్నారు. చేతులు వెనక మంచు బంతుల్ని పట్టుకున్న రాహుల్ సోదరి వద్దకు వెళ్లి తలపై వాటితో కొట్టి పరిగెడుతున్న సోదరుడిని పట్టుకుని ప్రియాంక కూడా తలపై మంచును కొట్టడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారిపోయింది. ఓవైపు మంచు కురుస్తుండగా వీరిద్దరి సరదా ఆటను చూసి అందరూ మురిసిపోయారు. ఆ తర్వాత ప్రియాంక తన సోదరుడ్ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియోను వీడియోను రాహుల్ తన ట్విట్టర్(Twitter) ఖాతాలో పోస్టు చేశారు. ‘భారత్ జోడో యాత్ర చివరి రోజున శ్రీనగర్ క్యాంప్ సైట్‌లో అందమైన ఉదయం’ అని ఆ వీడియోకు ఆయన క్యాప్షన్ తగిలించారు.

4,080 కిలోమీటర్ల మేర సాగిన భారత్ జోడో యాత్ర ముగింపు ఉత్సవం సోమవారం శ్రీనగర్‌లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరగింది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge), ప్రియాంక గాంధీ వాద్రా సమక్షంలో జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం రాహుల్ గాంధీ సారథ్యంలో షేర్-ఇ-కశ్మీర్ స్టేడియంలో ర్యాలీ నిర్వహించారు. డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఐ, ఆర్ఎస్‌పీ, ఐయూఎంఎల్ తదితర ప్రతిపక్ష పార్టీల నాయకులు కాంగ్రెస్ నేతలతో జతకలిశారు.

రాహుల్‌పై మెహబూబా ప్రశంసల జల్లు

భారత్ జోడో యాత్ర ముగింపు సభలో పాల్గొన్న పీడీపీ (PDP) చీఫ్ మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై ప్రశంసల జల్లు కురిపించారు. గాడ్సే భావజాలం లాక్కున్న దాన్ని పునరుద్ధరించాలని గాంధీని కోరారు. ఆయనలో భారత్ ఓ ఆశా కిరణాన్ని చూస్తోందన్నారు. తన ఇల్లు అయిన కశ్మీర్‌కు వచ్చానని రాహుల్ అన్నారని, ఇది మీ ఇల్లేనని, దేశం నుంచి గాడ్సే భావజాలం లాక్కున్నదానిని పునరుద్ధరిస్తారనే ఆశాభావం తనకు ఉందని ముఫ్తీ అన్నారు. జమ్మూ-కశ్మీరులో ఓ ఆశా కిరణాన్ని చూస్తున్నానని గాంధీజీ గతంలో అన్నారని, నేడు, దేశం రాహుల్ గాంధీలో ఓ ఆశా కిరణాన్ని చూస్తోందని ముఫ్తీ ప్రశంసించారు.

Updated Date - 2023-01-30T16:42:46+05:30 IST