Share News

Rahul Gandhi PM Banner: 2024లో రాహుల్ గాంధీనే ప్రధాని.. కొత్త వివాదానికి తెరలేపిన బ్యానర్.. మిత్రపక్షమే ఫైర్

ABN , First Publish Date - 2023-10-26T19:04:48+05:30 IST

2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇండియా కూటమిగా ఏర్పడిన ప్రతిపక్ష పార్టీల మధ్య ఇప్పుడు విభేదాలు తలెత్తినట్టు కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితమే సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ మధ్యప్రదేశ్‌లోని...

Rahul Gandhi PM Banner: 2024లో రాహుల్ గాంధీనే ప్రధాని.. కొత్త వివాదానికి తెరలేపిన బ్యానర్.. మిత్రపక్షమే ఫైర్

2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇండియా కూటమిగా ఏర్పడిన ప్రతిపక్ష పార్టీల మధ్య ఇప్పుడు విభేదాలు తలెత్తినట్టు కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితమే సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ మధ్యప్రదేశ్‌లోని సీట్ల పంపకం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తమ అభ్యర్థులకు ఒక్క టికెట్ కూడా ఇవ్వకపోవడంతో కోపాద్రిక్తుడైన ఆయన.. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. అంతేకాదు.. రాష్ట్ర ఎన్నికల్లో పొత్తు లేదనే విషయం తనకు ముందే తెలిసి ఉంటే, ఇండియా కూటమిలో కలిసేవాడ్ని కాదంటూ బాంబు పేల్చాడు. దీంతో.. అతడు ఈ కూటమి నుంచి తప్పుకుంటాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య (కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ) తాజాగా పోస్టర్ల వివాదం నెలకొంది. ఇటీవల ఎస్‌పీ కార్యకర్త తమ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ను దేశానికి ‘కాబోయే ప్రధాని’గా అభివర్ణిస్తూ ఒక బ్యానర్‌గా ఏర్పాటు చేయగా.. అది వివాదాస్పదంగా మారింది. తానూ ఏం తక్కువ తినలేదన్నట్టు.. ఓ కాంగ్రెస్ కార్యకర్త అందుకు ధీటుగా ఓ బ్యానర్‌ని సిద్ధం చేశాడు. 2024లో రాహుల్ గాంధీనే ప్రధాని అవుతారని చూపుతూ.. లక్నోలోని పార్టీ కార్యాలయం ముందు హోర్డింగ్‌ను ఉంచాడు. అంతేకాదు.. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్‌ను ‘రాష్ట్ర ముఖ్యమంత్రి’గా చేయాలనే పిలుపు కూడా ఆ హోర్డింగ్‌లో ఉంది. దీంతో.. ఉత్తరప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. అటు.. ఈ పోస్టర్‌పై అధికార పార్టీ బీజేపీ సైతం మండిపడింది.


ఈ పోస్టర్‌పై సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఫక్రుల్ హసన్ చాంద్ మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలో వెనుకబడిన, దళితులు, మైనారిటీల సమస్యలపై తమ పార్టీనే పోరాడిందని.. వాళ్లంతా తమ పార్టీ వైపే ఉన్నారని అన్నారు. కాబట్టి.. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పోస్టర్లు ఎన్ని వేసుకున్నా అభ్యంతరం లేదని అన్నారు. ప్రజలు అఖిలేశ్ యాదవ్‌నే ప్రధానమంత్రిగా చేయాలని కోరుకుంటున్నారని అన్నారు. ఇదే సమయంలో అధికార బీజేపీ ఈ పోస్టర్ల వ్యవహారంపై స్పందిస్తూ.. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పగటి కలలు కంటున్నాయని చురకలంటించింది. ఇండియా కూటమిలోని ఇతర సభ్యులపై తమ పార్టీ అభ్యర్థినే ప్రధానమంత్రిగా ప్రకటించాలనే ఒత్తిడి తెచ్చేందుకు ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోందని పేర్కొంది.

అటు.. రాహుల్ గాంధీనే 2024లో ప్రధాని అవుతారని హోర్డింగ్ పెట్టిన నితాంత్ సింగ్ నితిన్ మాట్లాడుతూ.. ఇది పార్టీ కార్యకర్తల భావన అని పేర్కొన్నాడు. సాధారణ ప్రజలు రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌తో కలిసి రావాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రత్యక్ష పోటీ ఉంటుందని.. రాహుల్ గాంధీ తప్పకుండా ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే.. రాష్ట్రానికి అజయ్ రాయ్ ముఖ్యమంత్రి అవుతారని, మా పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని నితిన్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-10-26T19:04:48+05:30 IST