Budget 2023 : అమృత కాలంలో తొలి బడ్జెట్ : నిర్మల సీతారామన్

ABN , First Publish Date - 2023-02-01T11:25:57+05:30 IST

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించారు. ఇది అమృత కాలంలో మొదటి బడ్జెట్ అని తెలిపారు.

Budget 2023 : అమృత కాలంలో తొలి బడ్జెట్ : నిర్మల సీతారామన్
Nirmala Sitharaman

న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించారు. ఇది అమృత కాలంలో మొదటి బడ్జెట్ అని తెలిపారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు అయిన నేపథ్యంలో అన్ని వర్గాల అభివృద్ధికి దోహదపడే బడ్జెట్ ఇది అని తెలిపారు. ఆధార్, కోవిన్ భారత దేశ ప్రొఫైల్‌ను శక్తిమంతం చేశాయన్నారు. గడచిన తొమ్మిదేళ్ళలో తలసరి ఆదాయం రెట్టింపు అయిందన్నారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదో స్థానంలో ఉందన్నారు. జీ20 ప్రెసిడెన్సీ మన దేశ పాత్రను బలోపేతం చేసే గొప్ప, విశిష్ట అవకాశమని చెప్పారు. 220 కోట్ల కోవిడ్ వ్యాక్సినేషన్ జరగడం విశేషమని తెలిపారు. దేశంలో 44.6 కోట్ల మంది బీమా పరిధిలో ఉన్నట్లు తెలిపారు. అమృత కాలంలో టెక్నాలజీ ఆధారంగా పని చేయడమే లక్ష్యమని తెలిపారు. ఉద్యోగావకాశాల సృష్టిపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు తెలిపారు.

మైనారిటీల సాధికారత, మహిళా సాధికారత, అందరికీ తగిన అవకాశాల కల్పనపై దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంపై దృష్టిపెట్టినట్లు తెలిపారు. ఉజ్వల యోజన క్రింద 9.6 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. చేతి వృత్తులవారి కోసం ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీని ప్రకటించారు.

పర్యాటక రంగాన్ని ఉద్యమ ప్రాతిపదికపై అభివృద్ధి చేస్తామన్నారు. హరిత ఇంధనం ద్వారా గ్రీన్ గ్రోత్‌కు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ బడ్జెట్‌కు ఏడు ప్రాధమ్యాలు ఉన్నాయన్నారు. సమ్మిళిత అభివృద్ధి, అన్ని వర్గాలకు సమానావకాశాలు, వ్యవసాయానికి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రా, రైతులకు ఓపెన్ సోర్స్ డిజిటల్ ఇన్‌ఫ్రా, జమ్మూకశ్మీరు, ఈశాన్య భారతం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. రైతులను కేంద్రంగా చేసుకుని కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్‌ను ప్రకటించారు. దీని కోసం రూ.2,000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. చిరుధాన్యాల ఉత్పత్తిలో ప్రపంచ కేంద్రంగా మన దేశాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. వ్యవసాయ రంగంలో రూ.20 లక్షల కోట్ల రుణ వితరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మత్స్యకారులకు మద్దతుగా నిలవడం కోసం రూ.6,000 కోట్లు పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించినట్లు తెలిపారు.

Updated Date - 2023-02-01T12:13:47+05:30 IST