New Parliament Building: ఆర్కిటెక్చర్ ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుందనడానికి ఇదే నిదర్శనం..!

ABN , First Publish Date - 2023-09-23T14:39:45+05:30 IST

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు వేదికైన కొత్త పార్లమెంటు భవనంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. భవన నిర్మాణాన్ని తప్పుపట్టింది. కొత్త కాంప్లెక్స్‌ను పార్లమెంటు భవనం అనే కన్నా 'మోదీ మల్టీప్లెక్స్'. 'మోదీ మారియట్' అంటే మంచిదని మండిపడింది.

New Parliament Building: ఆర్కిటెక్చర్ ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుందనడానికి ఇదే నిదర్శనం..!

న్యూఢిల్లీ: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు వేదికైన కొత్త పార్లమెంటు భవనం (New Parliment Building)పై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. భవన నిర్మాణాన్ని తప్పుపట్టింది. కొత్త కాంప్లెక్స్‌ను పార్లమెంటు భవనం అనే కన్నా 'మోదీ మల్టీప్లెక్స్' (Modi Multiplex), 'మోదీ మారియట్' (Modi Marriot) అంటే మంచిదని మండిపడింది. రెండు సభల్లోని లాబీల్లో అనవసరమైన చర్చలు జరుగుతున్నాయని, అబద్ధాలు ప్రచారమవుతున్నాయని, ఆర్కిటెక్చర్ ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుందనడానికి ఇదే నిదర్శనమని తెలిపింది. రాజ్యాంగాన్ని తిరగరాయాల్సిన అవసరం లేకుండానే ప్రజాస్వామ్యాన్ని ప్రధాని ఖూనీ చేశారంటూ విమర్శించింది. మోదీ సర్కార్‌పై ఒక సుదీర్ఘమైన ట్విటర్ పోస్ట్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ (Jairam Ramesh) ఈ వ్యాఖ్యలు చేశారు.


''కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి చాలా హంగామా చేశారు. ప్రధాని తన లక్ష్యం నెరవేర్చుకునేందుకే ఇంత పెద్ద హైప్ తీసుకువచ్చారు. దీన్ని మోదీ కాంప్లెక్స్ అనో, మోదీ మారియట్ అనో పిలిస్తే బాగుంటుంది. నాలుగు రోజుల పాటు పార్లమెంటుకు వెళ్తే మాకు విషయం అర్ధమైంది. ఉభయ సభల లాబీల్లో అనవసర ముచ్చట్లు, అబద్ధాలు ప్రచారమవుతున్నాయి'' అని జైరామ్ రమేష్ విశ్లేషించారు. పాత పార్లమెంటు భవనంతో పోల్చిచూసినప్పుడు కొత్త పార్లమెంటు భవనం చాలా ఇరుగ్గా ఉందన్నారు. ఒకరినొకరు చూసుకోవాలంటే బైనాక్యులర్స్ వాడాలమో అనేలా ఉందన్నారు. రెండు సభల మధ్య నడిచేందుకు పాత భవననంలో చాలా సులువుగా ఉండేదని, కొత్త బిల్డింగ్‌లో దారి తప్పితే వెనక్కి వచ్చేందుకు కూడా లేదని, చాలా గందరగోళంగా ఉందని చెప్పారు. పార్టీలకు అతీతంగా తన సహచరులు చాలామంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని, డిజైన్ విషయంలో సరైన సలహాలు తీసుకోలేదని సెక్రటేరియట్ సిబ్బంది నుంచి కూడా వినిపించిందని చెప్పారు. 2024లో మోదీ ప్రభుత్వం మారాక కానీ ఈ కొత్త భవనాన్ని సరైన విధంగా వినియోగించుకునే అవకాశం ఉండదని ఆయన కొసమెరుపు ఇచ్చారు.

Updated Date - 2023-09-23T14:48:37+05:30 IST