Quota bill: రాహుల్ సీటు మహిళలకు కేటాయిస్తే ఒప్పుకుంటారా?.. కేంద్ర మంత్రి సూటి ప్రశ్న

ABN , First Publish Date - 2023-09-24T20:00:26+05:30 IST

మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుపై న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆదివారంనాడు తొలిసారి స్పందించారు. బిల్లును ముందుగానే అమలు చేసి రాహుల్ గాంధీ నియోజకవర్గాన్ని ఒక మహిళకు కేటాయిస్తే ఆయన ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు.

Quota bill: రాహుల్ సీటు మహిళలకు కేటాయిస్తే ఒప్పుకుంటారా?.. కేంద్ర మంత్రి సూటి ప్రశ్న

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు (Women's Reservation Bill) అమలుపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేస్తు్న్న వ్యాఖ్యలు, బిల్లు ఎప్పట్నించి అమలవుతుందనే విషయంపై జరుగుతున్న చర్చపై కేంద్రం న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్(Arjun Ram Meghwal) రాజస్థాన్ లోని జైపూర్‌లో ఆదివారంనాడు తొలిసారి స్పందించారు. ఇదే సమయంలో రాహుల్‌ గాంధీకి చురకలు వేశారు. ''బిల్లును ముందుగానే అమలు చేసి రాహుల్ గాంధీ నియోజకవర్గాన్ని ఒక మహిళకు కేటాయిస్తే ఆయన ఒప్పుకుంటారా?'' అని ప్రశ్నించారు.


రాజ్యాంగంలోని 42వ సవరణ ప్రకారం 2026 వరకూ నియోజకవర్గాల పునర్విభజన కుదరదని మంత్రి తెలిపారు. డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కాగనే లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించే ఎంపీల సంఖ్య 800కు పెరుగుతుందని చెప్పారు. గడువు ముగియకుండానే రిజర్వేషన్లు అమలు చేయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ''రాహుల్ గాంధీ వయనాడ్ ఎంపీగా ఉన్నారు. ఆ నియోజకవర్గాన్ని ఒక మహిళకు మేము కేటాయిస్తే ఆయన మమ్మల్ని విమర్శించరా? అందుకోసమే ఏ సీటును మహిళలకు కేటాయించాలనే విషయాన్ని డీలిమిటేషన్ కమిటీ నిర్ణయిస్తుంది'' అని ఆయన తెలిపారు.


కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టి లోక్‌సభకు వచ్చేసరికి ఉపసంహరించుకుందని మేఘ్వాల్ గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే అప్పట్లో కాంగ్రెస్ అలా చేసిందని విమర్శించారు.

Updated Date - 2023-09-24T20:09:25+05:30 IST