Kharge, Rahul: మన ఓటు శాతం ఎందుకు తగ్గిందో చెప్పండి..?

ABN , First Publish Date - 2023-08-06T08:46:13+05:30 IST

తమ పార్టీకి తమిళనాట ఓటు శాతం ఎందుకు తగ్గిందని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ (టీఎన్‌సీసీ) నేతలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు

Kharge, Rahul: మన ఓటు శాతం ఎందుకు తగ్గిందో చెప్పండి..?

- రాష్ట్ర నేతలను నిలదీసిన ఖర్గే, రాహుల్‌

చెన్నై, (ఆంధ్రజ్యోతి): తమ పార్టీకి తమిళనాట ఓటు శాతం ఎందుకు తగ్గిందని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ (టీఎన్‌సీసీ) నేతలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge), మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ(Rahul Gandhi) గట్టిగా నిలదీశారు. ఓటుశాతం తగ్గడానికి గల కారణాలను అన్వేషించి, మున్ముందు మరింత పెరిగేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. 2024లో లోక్‌సభకు జరుగనున్న ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ దేశంలోని వివిధ రాష్ట్రాల నేతలను ఢిల్లీకి పిలిపించుకున్న విషయం తెలిసిందే. ఆ మేరకు శుక్రవారం రాష్ట్రానికి చెందిన 27 మంది నేతలతోనూ భేటీ అయ్యారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి, అసెంబ్లీ కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ సెల్వపెరుందగై, ఎంపీ కార్తీ చిదంబరం, మాజీ ఐఏఎస్‌ అధికారి శశికాంత్‌ సెంథిల్‌ సహా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశం వాడివేడిగా జరిగినట్లు తెలిసింది. కాగా తమిళనాట డీఎంకే-కాంగ్రెస్‌ కూటమి బలంగా వుండడంతో మళ్లీ 39 స్థానాలను కైవసం చేసుకునేలా గట్టిగా ప్రయత్నించాలని ఖర్గే సూచించారు. ఇందుకోసం బూత్‌ కమిటీలను పటిష్ఠం చేయాలని స్పష్టం చేశారు. అంతేగాక రాష్ట్ర కాంగ్రె్‌సను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, కొత్త నిర్వాహకులను ఎంపిక చేసి వ్యూహ రచన చేయాలన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్‌ రాజకీయాల గురించి అన్ని వర్గాల వారికి వివరించాలని సమావేశంలో రాహుల్‌గాంధీ దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో తమిళనాట ఏ ఏడాదికి ఆ ఏడాది ఎందుకు ఓటు బ్యాంకు తగ్గుతోందని, దీనిపై కూలంకషంగా చర్చించాల్సిన అవసరముందని ఆయన సూచించారు. ఈ భేటీ పలువురు జాతీయ నేతలు కూడా పాల్గొన్నారు. ఐదు దశాబ్దాల క్రితం తమిళనాట పార్టీ వైభవం, ఆ తరువాత తగ్గుతూ వచ్చిన ప్రాభవం, అందుకు గల కారణాలపై నేతలు సవివరంగా చర్చించుకున్నారు. ఈ సమావేశం అనంతరం అళగిరి విలేఖరులతో మాట్లాడుతూ.. ఖర్గే, రాహుల్‌ నేతృత్వంలో జరిగిన భేటీలో రాష్ట్ర నేతల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. పుదుచ్చేరి సహా 40 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవాలని దిశానిర్దేశం చేశారన్నారు. 3 గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో రాష్ట్ర కాంగ్రె్‌సలో నెలకొన్న సమస్యలు, భవిష్యత్తు ప్రణాళికలపైనా చర్చించామన్నారు. రాష్ట్రంలో ప్రాంతీయ స్థాయిలో మహానాడులు చేపట్టాలని నిర్ణయించామని, వాటికి రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కూడా ఆహ్వానిస్తామని తెలిపారు. అంతేగాకుండా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేసేలా కార్యక్రమాలు చేపడతామని కేఎస్‌ అళగిరి తెలిపారు.

Updated Date - 2023-08-06T08:46:13+05:30 IST