Syllabus Row: ఎన్‌సీఈ ఆర్‌టీ తొలిగించిన పాఠ్యాంశాలను స్టేట్ సిలబస్‌లో చేర్చేందుకు కేరళ నిర్ణయం

ABN , First Publish Date - 2023-04-26T14:46:27+05:30 IST

12వ తరగతి పాఠ్యపుస్తకాల్లోని కొన్ని భాగాలను తొలగించాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్..

Syllabus Row: ఎన్‌సీఈ ఆర్‌టీ తొలిగించిన పాఠ్యాంశాలను స్టేట్ సిలబస్‌లో చేర్చేందుకు కేరళ నిర్ణయం

తిరువనంతపురం: 12వ తరగతి పాఠ్యపుస్తకాల్లోని కొన్ని భాగాలను తొలగించాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) తీసుకున్న నిర్ణయంతో విభేదిస్తున్న కేరళ (Kerala) ప్రభుత్వం ఇందుకు ప్రత్యామ్నాయ చర్యలకు ఉపక్రమించింది. తొలగించిన భాగాలను స్టేట్ సిలబస్‌లో చేర్చడం ద్వారా అనుబంధ పాఠ్య పుస్తకాలను తీసుకురావాలని నిర్ణయించింది.

ఎన్‌సీఈఆర్‌టీ ఇటీవల 11, 12 తరగతికి చెందిన చరిత్ర, రాజకీయ శాస్త్రం పుస్తకాల నుంచి కొన్ని భాగాలను తొలగించింది. మహాత్మాగాంధీ హత్య, గుజరాత్ అల్లర్లు, మొఘలుల చరిత్ర, ఆర్ఎస్ఎస్‌పై నిషేధం వంటి కొన్ని ముఖ్యమైన భాగాలను పాఠ్యాంశాల నుంచి తొలిగించింది. ఈ చర్యను కేరళ ప్రభుత్వం బహిరంగంగానే విమర్శించింది. పాఠ్యపుస్తకాల్లో చరిత్రను వక్రీకరించే కేంద్ర ప్రభుత్వ చర్య గర్హనీయమని పేర్కొంది. ఎన్‌సీఈఆర్‌టీనీ పునర్వస్థీకరించాలని, ఇందులో రాష్ట్ర ప్రతినిధులకు చోటు కల్పించాలని డిమాండ్ చేసింది. తొలగించిన భాగాలతో అనుబంధ పాఠ్యపుస్తకాలను తీసుకురావడానికి గల అవకాశాలను పరిశీలిస్తామని కూడా తెలిపింది.

ఇందుకు అనుగుణంగానే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (SCERT) పాఠ్యాంశాల స్టీరింగ్ కమిటీ మంగళవారంనాడు సమావేశమైంది. ముఖ్యంగా ఎన్‌సీఆర్‌టీ 11, 12వ తరగతి సోషల్, రాజకీయ శాస్త్రంలో తొలగించి భాగాలపై సమగ్రంగా చర్చించింది. ఈ చర్య సహేతుకం కాదని కమిటీ అభిప్రాయపడింది. రేషనలైజేషన్ పేరుతో తొలగించిన భాగాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కేరళ పాఠ్యాంశాలలో వీటిని యథాతథంగా ఉంచాలని అభిప్రాయపడింది. ఆసక్తకిరంగా, స్టీరింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న కేరళ విద్యా శాఖ మంత్రి వి.శివన్‌కుట్టి సైతం ఇప్పటికే పాఠ్యాంశాల్లో ఎన్‌సీఈఆర్‌టీ చేసిన మార్పులపై కేంద్రాన్ని, ఎన్‌సీఈఆర్‌టీని తప్పుపట్టారు. రాజకీయ దురుద్దేశాలతోనే ఈ మార్పులు చేశారని ఆరోపించారు.

అనుబంధ పాఠ్యపుస్తకాలు

కాగా, చరిత్ర, రాజకీయ శాస్త్రం, అర్ధశాస్త్ర, సోషియాలజీలో కొన్ని భాగాలను ఎన్‌సీఈఆర్‌టీ తొలగించడం సహేతుకం కాదని ఎస్‌సీఆర్‌టీ డైరెక్టర్ ఎం.జయచంద్రన్ మండిపడ్డారు. తొలగించిన భాగాలను అనుబంధ పాఠ్యపుస్తకాలలో చేర్చి, వాటిని రాష్ట్రంలో పంపిణీ చేస్తామని చెప్పారు. రెండు నెలల్లో పాఠ్యపుస్తకాలను సిద్ధం చేస్తామని, ఆగస్టు నాటికి పుస్తకాలు విద్యార్థులకు చేరుతాయని తెలిపారు.

Updated Date - 2023-04-26T14:47:59+05:30 IST