JP Nadda: రాహుల్ గాంధీ చేసిన ఓబీసీ డిమాండ్‌కి మాట మార్చేసిన జేపీ నడ్డా.. అసలేం జరిగిందంటే?

ABN , First Publish Date - 2023-09-21T21:51:25+05:30 IST

బీజేపీ నేతల మాటల గారడీ గురించి అందరికీ తెలిసిందే. ఏదో అడిగితే, ఇంకేదో సమాధానం చెప్తారు. అడిగిన దానికేదీ సూటిగా జవాబు ఇవ్వరు. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు, వీళ్లిచ్చే సమాధానాలకు..

JP Nadda: రాహుల్ గాంధీ చేసిన ఓబీసీ డిమాండ్‌కి మాట మార్చేసిన జేపీ నడ్డా.. అసలేం జరిగిందంటే?

బీజేపీ నేతల మాటల గారడీ గురించి అందరికీ తెలిసిందే. ఏదో అడిగితే, ఇంకేదో సమాధానం చెప్తారు. అడిగిన దానికేదీ సూటిగా జవాబు ఇవ్వరు. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు, వీళ్లిచ్చే సమాధానాలకు.. నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ అడిగిన డిమాండ్‌కి కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భిన్నంగానే స్పందించారు. బుధవారం మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ కోటాను రాహుల్ డిమాండ్ చేశారు. అలాగే.. కుల గణన వివరాలను కూడా వెల్లడించాలని కోరారు. ప్రభుత్వ కార్యదర్శులు 90 మంది ఉంటే, అందులో ముగ్గురు మాత్రమే ఓబీసీకి చెందినవారు ఉన్నారని రాహుల్ పేర్కొన్నారు.


రాహుల్ చేసిన వ్యాఖ్యలకు గురువారం రాజ్యసభలో జేపీ నడ్డా బదులిస్తూ.. ‘ట్యూటర్’ వ్యాఖ్యలతో పక్కదారి పట్టించేందుకు బాగానే ప్రయత్నించారు. ‘‘నేను ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను. ఒక నాయకుడు నాయకుడిలాగే ఉండాలి. ట్యూటర్‌లా ఉంటే ప్రయోజనం ఉండదు. ఇలాంటి ట్యూటర్ వ్యాఖ్యలు పనిచేయవు’’ అని అన్నారు. అనంతరం.. ప్రభుత్వ కార్యదర్శుల్లో ఓబీసీ కమ్యూనిటీకి చెందిన వారు ముగ్గురు మాత్రమే ఉన్నారని రాహుల్ చేసిన వ్యాఖ్యలతో తాను షాకయ్యానన్నారు. దేశ బడ్జెట్‌లో 5 శాతం మాత్రమే ఓబీసీలకు వెళ్తున్నాయని రాహుల్ వ్యాఖ్యానించడం తనని ఆశ్చర్యానికి గురి చేసిందని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో గతాన్ని తవ్వుతూ.. కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు ట్రై చేశారు..

గతంలో కాంగ్రెస్ పాలిస్తున్న సమయంలో ఓబీసీల గురించి పట్టించుకోలేదని, 1992లో సుప్రీంకోర్టు కోరిన తర్వాతే సర్వీసుల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేశారని జేపీ నడ్డా పేర్కొన్నారు. ఈ దేశానికి మొదటి ఓబీసీ ప్రధానమంత్రి(మోదీ)ని అందించింది బీజేపీ-ఎన్డీఏ అని గుర్తంచుకోవాలని అన్నారు. బీజేపీకి చెందిన 303 లోక్‌సభ ఎంపీలలో 85 మంది ఓబీసీ వర్గానికి చెందినవారు ఉన్నారని వివరణ ఇచ్చారు. లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న మొత్తం బలం కంటే.. బీజేపీ ఓబీసీ ఎంపీల సంఖ్య ఎక్కువగా ఉందని చురకలంటించారు. అయితే.. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ కోటా గురించి మాత్రం జేపీ నడ్డా స్పందించకపోవడం గమనార్హం.

Updated Date - 2023-09-21T21:51:25+05:30 IST