JDS joins NDA: అమిత్‌షాను కలిసిన కుమారస్వామి, లాంఛనంగా ఎన్డీయేలో చేరిక..

ABN , First Publish Date - 2023-09-22T17:35:18+05:30 IST

జాతీయ ప్రజాస్వామ్య కూటమి లో జనతా దళ్ సెక్యులర్ శుక్రవారంనాడు లాంఛనంగా చేరింది. ఇందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను జనతాదళ్ నేత హెచ్‌డీ కుమారస్వామి ఢిల్లీలో కలుసుకున్నారు.

JDS joins NDA: అమిత్‌షాను కలిసిన కుమారస్వామి, లాంఛనంగా ఎన్డీయేలో చేరిక..

న్యూఢిల్లీ: జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA)లో జనతా దళ్ సెక్యులర్ (JDS) శుక్రవారంనాడు లాంఛనంగా చేరింది. ఇందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను (Amit shah) జనతాదళ్ నేత హెచ్‌డీ కుమారస్వామి (HD Kumaraswamy) ఢిల్లీలో కలుసుకున్నారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా పాల్గొన్నారు.


లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ, జేడీఎస్ మధ్య పొత్తు కుదరనుందంటూ కొద్దికాలంగా సంకేతాలు వెలువడుతున్నాయి. పొత్తులో భాగంగా కర్ణాటకలో 4 లోక్‌సభ స్థానాల్లో జేడీఎస్ పోటీ చేయనుందనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో జేడీఎస్ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి గురువారంనాడు పార్లమెంటులో అమిత్‌షాను కలుసుకున్నారు. కర్ణాటక రాజకీయ పరిణాలపై కొద్దికాలంగా వీరి మధ్య మంతనాలు జరుగుతున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తు నడిచింది. అయితే బీజేపీ 28 సీట్లలో 25 సీట్లు ఎగరేసుకుపోయింది. బీజేపీ హవా నడవడంతో ఆ పార్టీ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థి కూడా మాండ్య నియోజకవర్గం నుంచి గెలుపొందారు. జేడీఎస్ ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. కేవలం 19 అసెంబ్లీ సీట్లు గెలుచుకుని పార్టీ చరిత్రలోనే అత్యంత దయనీయ ఫలితాలను చవిచూసింది. కాగా, ఢిల్లీలో ఇటీవల జరిగిన ఎన్‌డీఏ సమావేశానికి జేడీఎస్‌కు ఎలాంటి ఆహ్వానం పంపలేదు. అటు విపక్ష 'ఇండియా' బ్లాక్ సైతం బెంగళూరులో జూలైలో జరిగిన సమావేశానికి జేడీఎస్‌ను ఆహ్వానించ లేదు. ఈ నేపథ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేతో చెలిమికి జేడీఎస్ మరోసారి మొగ్గుచూపింది.

Updated Date - 2023-09-22T17:35:18+05:30 IST