Mamata Banerjee:కేజ్రీవాల్పై బీజేపీ కుట్ర పన్నుతోంది... మోదీపై విరుచుకుపడ్డ దీదీ
ABN , First Publish Date - 2023-11-01T20:15:29+05:30 IST
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejrival) ని అరెస్ట్ చేయడానికి బీజేపీ కుట్రపన్నుతోందని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) ఆరోపించారు. బుధవారం ఆమె కోల్కతా(Kolkata)లో మాట్లాడుతూ.. రానున్న రాష్ట్రాల శాసన సభ ఎన్నికలతో పాటు.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార బీజేపీ ప్రతిపక్ష పార్టీలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని అన్నారు.
![Mamata Banerjee:కేజ్రీవాల్పై బీజేపీ కుట్ర పన్నుతోంది... మోదీపై విరుచుకుపడ్డ దీదీ](https://media.andhrajyothy.com/media/2023/20231028/mamatha_banerjee_e626348b76.jpg)
ఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejrival) ని అరెస్ట్ చేయడానికి బీజేపీ కుట్రపన్నుతోందని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) ఆరోపించారు. బుధవారం ఆమె కోల్కతా(Kolkata)లో మాట్లాడుతూ.. రానున్న రాష్ట్రాల శాసన సభ ఎన్నికలతో పాటు.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార బీజేపీ ప్రతిపక్ష పార్టీలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని అన్నారు. ఇందులో భాగంగా కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయాలని పథకం పన్నినట్లు ఆరోపించారు.
ఆమె మాట్లాడుతూ.. "ఎన్నికలకు ముందు బీజేపీ ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam) పేరుతో ఈడీ(ED)ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజాప్రతినిధులపైకి ఉసిగొల్పింది. ఇప్పటికే మనీష్ సిసోదియా(Manish Sisodia) వంటి కీలక నేతలను అరెస్ట్ చేశారు. నవంబర్ 2న కేజ్రీవాల్ ని విచారణ నిమిత్తం పిలుస్తున్నారు. కానీ అక్కడ విచారణ జరగదు. సీఎం అరెస్టుకు ప్లాన్లు రెడీ అయ్యాయి. ఇది బీజేపీ కుట్ర. కుట్రలో భాగమే వెస్ట్ బెంగాల్ ఉప ముఖ్యమంత్రి జ్యోతిప్రియ మల్లిక్ అరెస్ట్. అకారణంగా ఆయన్ని అరెస్ట్ చేశారు. బీజేపీ ప్రతిపక్ష నేతల ఫోన్లను సైతం హ్యాక్ చేస్తోంది. ఇందుకు సంబంధించి యాపిల్ కంపెనీ నుంచి ఇప్పటికే వార్నింగ్ మెసేజ్లు వచ్చాయి" అని ఆమె అన్నారు. ఆమె కామెంట్స్ పై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా(Raghav chadda) స్పందించారు. 2014 నుంచి బీజేపీ ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా 95 శాతం కేసులు నమోదు చేసిందని అన్నారు. ఇండియా కూటమి ఏర్పడిన తరువాత బీజేపీకి భయం పెరిగిందని.. దీంతో కూటమి నేతలే టార్గెట్ గా అరెస్టుల పర్వానికి దిగిందని విమర్శించారు. దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలపై ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. ప్రజా కోర్టులో బీజేపీ(BJP)కి శిక్ష తప్పదని హెచ్చరించారు. అయితే చాలా రాష్ట్రాల్లో తమకు లొంగని ప్రత్యర్థులపై బీజేపీ సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలతో బెదిరింపులకు దిగుతోందని ప్రతిపక్ష ఇండియా కూటమి ఆరోపిస్తూ వస్తోంది. ఈ ఆరోపణల్ని బీజేపీ ఖండిస్తోంది. లోక్ సభ ఎన్నికలకు ముందు తమను అరెస్ట్ చేయడమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తోందని విమర్శిస్తున్నారు ఇండియా కూటమి నేతలు. ఢిల్లీ మద్యం కుంభ కోణం కేసులో ఇప్పటికే డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా అరెస్ట్ అయ్యారు. తరువాతి టార్గెట్ సీఎం కేజ్రీవాలే అని వార్తలు వస్తుండటంతో ఆప్ ఆందోళనగా ఉంది. అరెస్టు జరిగినా జైలు నుంచే పరిపాలన అందిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.