Supreme Court: మీరు పెట్టే పోస్టులకు మీరే బాధ్యులు

ABN , First Publish Date - 2023-08-20T03:16:57+05:30 IST

సోషల్‌ మీడియా(Social Media)లో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టే వారు వాటి పర్యవసానాలకు కూడా సిద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు(Supreme Court) హెచ్చరించింది. తమ పోస్టులు ఎంత దూరం వెళ్లగలవు? ఎంత ప్రభావం చూపిస్తాయనే స్పృహ వాటిని పెట్టే ప్రతీ ఒక్కరికీ ఉండాలని వ్యాఖ్యానించింది.

Supreme Court: మీరు పెట్టే పోస్టులకు   మీరే బాధ్యులు

‘సామాజిక’ బాధ్యతండీ..

అవెంత వరకు వెళ్తాయో గుర్తెరగాలి

పర్యవసానాలకు సిద్ధమవ్వాలి: సుప్రీం

న్యూఢిల్లీ, ఆగస్టు 19: సోషల్‌ మీడియా(Social Media)లో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టే వారు వాటి పర్యవసానాలకు కూడా సిద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు(Supreme Court) హెచ్చరించింది. తమ పోస్టులు ఎంత దూరం వెళ్లగలవు? ఎంత ప్రభావం చూపిస్తాయనే స్పృహ వాటిని పెట్టే ప్రతీ ఒక్కరికీ ఉండాలని వ్యాఖ్యానించింది. 2018లో మహిళా జర్నలిస్టుల(women journalists)పై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన తమిళనాడు మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీ శేఖర్‌పై రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు రాగా, అప్పటి అన్నాడీఎంకే(AIADMK) ప్రభుత్వం క్రిమినల్‌ చర్యలకు ఉపక్రమించింది. అన్నాడీఎంకే మిత్రపక్షం బీజేపీకి చెందిన శేఖర్‌ ఆ పోస్టును కొద్ది గంటల్లోనే తొలగించి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. కేసులు కొనసాగడంతో వాటిని కొట్టేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆయనకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వగా, సుప్రీంకోర్టుకు వచ్చారు.

సుప్రీంకోర్టు కూడా హైకోర్టునే సమర్థించింది. పోస్టు పెట్టిన రోజు శేఖర్‌ కంట్లో మందు వేసుకున్నారని, పోస్టు చేసిన కంటెంట్‌లోని ప్రతీ అంశాన్ని ఆయన క్షుణ్ణంగా చదవలేదని న్యాయవాది చేసిన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తీర్పు సందర్భంగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ పీకే మిశ్రాలతో కూడిన సుప్రీం ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్‌ మీడియా వాడేవారు తాము పోస్టు చేస్తున్న కంటెంట్‌ ఏంటనే స్పృహ కలిగి ఉండాలని సూచించింది. ఒక అంశాన్ని సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నపుడే దాని ద్వారా తలెత్తే విపరిణామాలకు బాధ్యత వహించేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. సోషల్‌ మీడియా పోస్టు వదిలిన బాణంతో సమానమని, ఒకసారి పోస్టు చేశాక జరిగే నష్టాన్ని నివారించడం సాధ్యం కాదని చెప్పింది.

ఎఫ్‌ఐఆర్‌ పబ్లిక్‌ డాక్యుమెంటే

ఎవిడెన్స్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 74 ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ పబ్లిక్‌ డాక్యుమెంటేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గాయపడిన వ్యక్తి నుంచి ఎఫ్‌ఐఆర్‌గా నమోదు చేసిన వాంగ్మూలాన్ని మరణ వాంగ్మూలంగా పరిగణించవచ్చునని పేర్కొంది. జంట హత్యల కేసులో బిహార్‌కు చెందిన ఆర్జేడీ మాజీ ఎంపీ ప్రభునాథ్‌ సింగ్‌ను దోషిగా ప్రకటిస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

స.హ.చట్టంపై పర్యవేక్షణ

అధికారులకు బాధ్యతలను నిర్దేశించిన సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)లోని సెక్షన్‌-4 సక్రమంగా అమలయ్యేలా చూడాలని కేంద్ర సమాచార కమిషన్‌, అన్ని రాష్ట్రాల సమాచార కమిషన్లను సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా, స్ర్తీ, పురుషులు దీర్ఘకాలం పాటు సహజీవనం చేస్తే వారు వివాహం చేసుకున్నట్టుగా చట్టం అభిప్రాయపడుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బలమైన సాక్ష్యాలు ఉంటే తప్ప దీన్ని తిరస్కరించలేరని తెలిపింది. ఈ బంధం బలహీనపడినప్పుడు కూడా దాన్ని గుర్తించకుండా ఉండలేదని పేర్కొంది.

దేశంలో ‘రోమియో-జూలియట్‌’ చట్టం సాధ్యమేనా

దేశంలో ‘రోమియో-జూలియట్‌’ చట్టాన్ని అమలు చేయవచ్చా అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుత చట్టాల ప్రకారం 18 ఏళ్లలోపు వయసు ఉన్న బాలికలు, 18 ఏళ్లు దాటిన బాలురు పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నా దాన్ని క్రిమినల్‌ నేరంగా పరిగణిస్తున్నారు. అత్యాచార నేరం కింద బాలుడ్ని అరెస్టు చేస్తున్నారు. అయితే ఈవయసు ఉన్నవారు పరస్పర సమ్మతితో శారీరక సబంధం పెట్టుకుంటే దాన్ని నేరంగా పరిగణించకూడదంటూ చాలా దేశాలు రోమియో-జూలియట్‌ చట్టాన్ని తీసుకొచ్చాయి. శృంగారంలో పాల్గొన్న బాలుడ్ని అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాయి. ఇదే చట్టాన్ని దేశంలో అమలు చేయాలని కోరుతూ న్యాయవాది హర్ష్‌ విభోర్‌ సింఘాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. 16-18 ఏళ్ల బాలికలతో 16-19 ఏళ్ల బా లురు పరస్పర అంగీకారంతో సంబంధం పెట్టుకోవడాన్ని నేరంగా పరిగణించకూడదని పిటిషనర్‌ కోరారు.

Updated Date - 2023-08-20T05:31:38+05:30 IST