Five days: వారానికి ఐదు రోజులే పనిదినాలు..!
ABN , First Publish Date - 2023-02-12T11:08:54+05:30 IST
ఐటీ నగరిగా పేరొందిన బెంగళూరులో ఉద్యోగులంతా ఐదు రోజుల(Five days) పనికే అలవాటు పడ్డారు. ఐటీబీటీ సహా నగరంలోని వందలాది
- ఏడో వేతన కమిషన్కు ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్
బెంగళూరు, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ఐటీ నగరిగా పేరొందిన బెంగళూరులో ఉద్యోగులంతా ఐదు రోజుల(Five days) పనికే అలవాటు పడ్డారు. ఐటీబీటీ సహా నగరంలోని వందలాది కార్పొరేట్ కంపెనీలు ఐదు రోజుల పనిదినాలు కొనసాగిస్తున్నాయి. వారాంతంలో రెండు రోజుల సెలవుల సంస్కృతి కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇదే డిమాండ్ను తెరపైకి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు వారానికి ఐదు రోజులు పనిదినాలుగా మార్చి ప్రతి రోజూ ఒక గంట సమయం పెంచేలా ప్రతిపాదించాలని ఏడో వేతన కమిషన్ను విన్నవించారు. నెలలోని అన్ని శనివారాలు సెలవులుగా ప్రకటించాలని, కార్యాలయాల పనిగంటలు ఉదయం 10 గంటల నుంచి కాకుండా 9.30 గంటలకే ప్రారంభించి సాయంత్రం 5.30కు బదులు 6 గంటలకు ముగించాలని కోరారు. ప్రతిరోజూ గంట ఎక్కువ సమయం కేటాయించడం వల్ల ఐదు పనిగంటలు పెరుగుతాయని ఉద్యోగుల సంఘాలు విన్నవించాయి. వేతన కమిషన్ ముందు పలు డిమాండ్లు పెట్టారు. దీంతో నూతన పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని, 2006 ఏప్రిల్ ముందు నుంచి కొనసాగించేలా ఉత్తర్వులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. మూల వేతనానికి ప్రస్తుతం ఉండే 31 శాతం కరువు భత్యాన్ని విలీనం చేసి 40 శాతం ఫిట్మెంట్ సౌలభ్యం కల్పించాలని, 2022 జూలై 1 నుంచి అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల్లో నైపుణ్యత, క్రియాశీలత పెంచేందుకు ఏటీఐ తరహాలో శిక్షణ ఇవ్వాలని, డి గ్రూప్ ఉద్యోగులకు కనీస వేతనం రూ.31వేలుగా నిర్ధారించాలని, పెండింగ్లో ఉండే వేతన శ్రేణిని గరిష్ట వేతనానికి మధ్య ఉండే శాతాన్ని, ప్రస్తుతం ఉండే 1:5:20కు బదులుగా 1:8:26కు నిర్ధారించాలని, ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసులో కనీసం 3 నుంచి 4 పదోన్నతులు కల్పించాలని, కృత్రిమ పద్ధతిలో సంతానం పొందే మహిళలకు శిశుపాలన, ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, స్వచ్ఛంద పదవీ విరమణ పొందే ఉద్యోగులకు 15 ఏళ్ల కనీస సేవ లేదా 50 ఏళ్ల వయసు పరిమితిని మార్పు చేసి 12 ఏళ్ల సర్వీసు లేదా 45ఏళ్ల వయసుకు సవరించాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్(Retirement) పింఛనుకు 30 నుంచి 25 ఏళ్లకు తగ్గించాలని, కేంద్రప్రభుత్వం తరహాలోనే విద్యాభత్యం జారీ చేయాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు షడాక్షరి అభిప్రాయం మేరకు వారానికి ఐదు రోజుల పనిదినాల ద్వారా విద్యుత్, నీరు, ప్రభుత్వ వాహనాల ఖర్చు తగ్గనుందని, ఉద్యోగులు రెండు రోజుల సెలవులతో విహార, ఇతర పర్యటనకు వెళ్తే ప్రభుత్వానికి ఆదాయం రానుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, భత్యాల పరిష్కారం కోసం రిటైర్డు చీఫ్ సెక్రటరీ సుధాకర్రావు అధ్యక్షతన ఏడో వేతన కమిషన్ జనవరి 17న కొన్ని అంశాలను విడుదల చేసింది. ఈమేరకు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు తమ అభిప్రాయాలను 65 పేజీల నివేదికను కమిషన్కు శుక్రవారం సమర్పించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉండే 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్లో ప్రస్తావించారు. ఖాళీ ఉద్యోగాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో పని చేసేవారిపై ఒత్తిడి అధికమవుతోందని నివేదికలో పేర్కొన్నారు.
కనీసం లక్ష వేతనానికి ఉపాధ్యాయుల సంఘం డిమాండ్
ఉపాధ్యాయుల వేతనాలను సవరించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ నుంచే తరగతులు ప్రారంభించాలని ఏడో వేతన కమిషన్కు రాష్ట్ర ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల సంఘం పదాధికారులు వినతి పత్రం ఇచ్చారు. వేతన శ్రేణిని రూ.25,800-51,400 నుంచి రూ.51,600 - 1.07 లక్షలుగా నిర్ణయించాలని, పదేళ్ల సర్వీసు చేసినవారికి పదోన్నతులు కల్పించాలని 15ఏళ్ల సర్వీసుకు పెంచే వేతన శ్రేణిని రెట్టింపు చేయాలని కోరారు. 25 ప్రముఖ అంశాలతోపాటు ఉపాధ్యాయుల డిమాండ్లు 135 పేజీల నివేదికను కమిషన్కు సమర్పించారు.
ఇవికూడా చదవండి: 5వసారి ఎన్నికల బ్యానర్ మార్చిన అన్నాడీఎంకే