Tamil Politics: ముదురుతున్న డీఎంకే ప్రభుత్వం, గవర్నర్ వివాదం.. అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత అరెస్ట్..
ABN , First Publish Date - 2023-06-19T11:26:28+05:30 IST
గవర్నర్, డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం ముదురుతున్న సమయంలో ఆ పార్టీ సభ్యుడు శివాజీ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
చెన్నై: గవర్నర్(Governor), డీఎంకే ప్రభుత్వం (DMK Government) మధ్య వివాదం ముదురుతున్న సమయంలో ఆ పార్టీ సభ్యుడు శివాజీ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గవర్నర్ రవి Governor Ravi), బీజేపీ నేత ఖుష్బూపై (Khushbu) వివాస్పద వ్యాఖ్యలు చేసిన శివాజీ కృష్ణమూర్తిని పార్టీ సస్పెండ్ చేయగా..ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తి (DMK Leader Shivaji Krishnamurthi) వ్యవహారంపై బీజేపీ నేత ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణమూర్తి అభ్యంతరకర వ్యాఖ్యలపై సీఎం స్టాలిన్కు వీడియో ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
‘‘మీ కుటుంబంలోని మహిళలపై ఇలాంటి ప్రకటనలు చేస్తే మీరు అంగీకరిస్తారా’’ అని సీఎం స్టాలిన్కు ట్వీట్ చేశారు. శివాజీ కృష్ణమూర్తి తన వ్యాఖ్యలతో నన్ను మాత్రమే కాదు.. మిమ్మల్నీ, మీ నాన్న లాంటి గొప్ప నాయకుడిని కూడా అవమానించాడని పేర్కొంది. శివాజీ లాంటి వాళ్లను రాజకీయంగా ప్రోత్సహిస్తే..మీరు చాలా నష్టపోవాల్సి ఉంటుందని ఖుష్ఫూ హెచ్చరించింది. పోకిరీలకు అడ్డాగా డీఎంకే మారుతోందని, ఇది సిగ్గుచేటని ఖుష్బూ విమర్శించారు.
కాగా.. జనవరిలో ఓ సమావేశంలో శివాజీ కృష్ణమూర్తి తమిళనాడు గవర్నర్ రవి, బీజేపీ నేత ఖుష్బూపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘గవర్నర్ తన ప్రసంగంలో అంబేద్కర్ పేరును ఉచ్చరించేందుకు ఇష్టపడలేదని, తమిళ ప్రభుత్వ ప్రసంగాన్ని చదవకపోతే కాశ్మీర్ వెళ్లిండి..మేం ఉగ్రవాదులను పంపుతాం..వాళ్లు మిమ్మల్ని కాల్చి వేస్తారంటూ’’ శివాజీ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. గవర్నర్కు, డీఎంకే ప్రభుత్వానికి వివాదం ముదురుతున్న నేపథ్యంలో ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతవారం అరెస్టయిన మంత్రి సెంథిల్ బాలాజీని మంత్రిగా కొనసాగించాలన్న సీఎం స్టాలిన్ చేసిన ప్రతిపాదనను గవర్నర్ రవి ఆమోదించలేదు. బాలాజీ శాఖలను మరో ఇద్దరు మంత్రులకు బదిలీ చేయడానికి మాత్రమే ఆమోదించారు. అయితే మంత్రుల ఎంపిక ముఖ్యమంత్రి అధికారమని.. ఇందులో గవర్నర్ జోక్యం అవసరంలేదని స్టాలిన్ వాదిస్తున్నారు.పోర్ట్పోలియో లేని మంత్రిగా బాలాజీని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.