Share News

Diwali: పట్టణం నుంచి పల్లెలకు.. సొంతూళ్లకు 10లక్షల మంది పయనం

ABN , First Publish Date - 2023-11-12T09:13:09+05:30 IST

దీపావళి పండుగను స్వస్థలాల్లో జరుపుకునేందుకు చెన్నై నుంచి దక్షిణాది ప్రాంతాలకు సుమారు 10 లక్షల మంది బయలుదేరి వెళ్లారు.

Diwali: పట్టణం నుంచి పల్లెలకు.. సొంతూళ్లకు 10లక్షల మంది పయనం

- 10 గంటల పాటు స్తంభించిన ట్రాఫిక్‌

- 6 కి.మీ.ల పొడవున నిలిచి పోయిన వాహనాలు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): దీపావళి పండుగను స్వస్థలాల్లో జరుపుకునేందుకు చెన్నై నుంచి దక్షిణాది ప్రాంతాలకు సుమారు 10 లక్షల మంది బయలుదేరి వెళ్లారు. ఒకే సమయంలో ఇటు తాంబరం, అటు కోయంబేడు - పూందమల్లి రహదారి మీదుగా రాష్ట్ర రవాణా సంస్థ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు బస్సులు, దీపావళి(Diwali) ప్రత్యేక రిజర్వుడు బస్సులు, ఆమ్నీ బస్సులు బయలుదేరడంతో మునుపెన్నడూ లేనంతగా వాహనాల రాకపోకలు స్తంభించాయి. శుక్రవారం నగరం నుంచి రాష్ట్ర రవాణా సంస్థ 2100 బస్సులతో పాటు అదనంగా 1895 ప్రత్యేక బస్సులను నడిపింది. ఆ తర్వాత సాయంత్రం ప్రయాణికుల రద్దీ తీవ్రం కావడంతో మరో 138 ప్రత్యేక బస్సులను నడిపింది. ఇదే రీతిలో రోజూ నడిపే 900 ఆమ్నీ బస్సులతోపాటు అనదంగా 700 బస్సులు నడిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం నుంచే నగరంలోని రెండు వైపు ప్రధాన రహదారులు దక్షిణాది నగరాలకు బయలుదేరిన బస్సులతో కిటకిటలాడాయి. దక్షిణాది నగరాలకు చెన్నై - తిరుచ్చి(Chennai - Trichy) జాతీయ రహదారిలో, కోయంబేడు - పూందమల్లి రహదారిలో పదిగంటలపాటు వాహనాల రాకపోకలు స్తంభించాయి. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం వేకువజాము 2.15 గంటల దాకా ఈ రెండు మార్గాలలో రాష్ట్ర రవాణా సంస్థ రోజువారీ బస్సులు, దీపావళి ప్రత్యేక బస్సులు, ఆమ్మీ బస్సులు ఒకే సమయంలో దక్షిణాది జిల్లాలవైపు బయలుదేరటంతో ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా మారింది. వాహనాలన్నీ నత్తనడక నడిచాయి. ట్రాఫిక్‌ పోలీసులు పలు జంక్షన్లలో రాకపోకలను క్రమబద్దీకరించేందుకు శ్రమించాల్సి వచ్చింది. తాంబరం నుంచి బయలుదేరిన బస్సులన్నీ ఆయా ప్రాంతాల్లో స్థానికులు నడిపిన ద్విచక్రవాహనాలు, కార్లు, వ్యాన్‌లు తదితర వాహనాల కారణంగా వేగంగా వెళ్లలేక నత్తనడక నడిచాయి.

nani1.2.jpg

పెరుంగళత్తూరు నుంచి వండలూరు దాకా వాహనాలు కదల్లేని పరిస్థితి కొనసాగింది. కిలోమీటర్‌ దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ పోలీసులు అతికష్టం మీద ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఇదేవిధంగా కోయంబేడు నుంచి పూందమల్లి దాకా రహదారులన్నీ రవాణ సంస్థ, ఆమ్నీ బస్సులతో నిండిపోయాయి. ఈ బస్సులన్నీ ఒకే సమయంలో బయలుదేరటంతో నెర్‌కుండ్రం నుంచి వేలప్పన్‌ చావడి వరకు ట్రాఫిక్‌ రద్దీ పెరిగింది. రాకపోకలు చక్కబరిచేందుకు పోలీసులు తంటాలు పడ్డారు. రవాణా సంస్థ, ఆమ్నీ బస్సులు త్వరలో ప్రారంభం కానున్న కిలాంబాక్కం బస్‌స్టేషన్‌కు వెళ్ళి అక్కడి నుండి ప్రయాణికులను ఎక్కించుకుని బయలుదేరాయి. దీంతో వండలూరు నుంచి కిలాంబాక్కం వరకూ సుమారు రెండు కి.మీ. దూరానికి బస్సులు, వ్యాన్లు సహా అన్ని రకాల వాహనాలు ఎక్కడివక్కడే గంటసేపు కదలలేక పోయాయి. ఇదే విధంగా మరైమలర్‌ నుంచి సింగపెరుమాళ్‌ వరకూ సుమారు ఆరు కి.మీ.ల పొడవునా వాహనాలు బారులు తీరాయి. ఆ వాహనాలన్నీ నత్తనడక నడిచాయి. కోయంబేడు బస్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరి రాష్ట్ర రవాణా సంస్థ బస్సులు, ఆమ్నీ బస్సులు మధురవాయల్‌ నుండి పూందమల్లి వరకూ నెమ్మదిగానే నడిచాయి. రాత్రి 8గంటల నుండి రోహిణి థియేటర్‌ స్టాపు నుంచి నెర్‌కుండ్రం వరకూ వాహనాలు సుమారు గంటసేపు కదలని పరిస్థితులు ఎదురయ్యాయి. ట్రాఫిక్‌ పోలీసులు పలు జంక్షన్‌ల వద్ద నిలిచి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. రాత్రి 10 గంటల తర్వాత ఆ మార్గంలో వాహనాల రాకపోకలు సాఫీగా జరిగాయి. తాంబరం మార్గంలో శనివారం వేకువజాము 3 గంటల వరకూ పలు చోట్ల ట్రాఫిక్‌ స్తంభించింది. గంట తరువాత ఆ మార్గంలో వాహనాలు సాఫీగా నడిచాయి. కోయంబేడు బస్‌స్టేషన్‌లో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రయాణికులు రద్దీ విపరీతంగా పెరిగింది. తిరుచ్చి, మదురై, తిరునల్వేలి, తిరువణ్ణామలై, తంజావూరు, నాగపట్టినం, కన్నియాకుమారి తదితర నగరాలకు వెళ్లేందుకుగాను ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ప్రత్యేక బస్సులు సకాలంలో రాకపోవడంబతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-12T09:15:47+05:30 IST