Covid-19: దేశంలో కరోనా డేంజర్ బెల్స్..11 వేలు దాటిన రోజువారీ కేసులు, 29 మరణాలు నమోదు

ABN , First Publish Date - 2023-04-14T12:50:06+05:30 IST

దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్(Indian Medical Association) పలు సూచనలు..

Covid-19: దేశంలో కరోనా డేంజర్ బెల్స్..11 వేలు దాటిన రోజువారీ కేసులు, 29 మరణాలు నమోదు

దేశంలో రోజువారీ కరోనా కేసులు(Daily Covid Cases) క్రమంగా పెరుగుతున్నాయి. గతం కంటే కేసులు ఎక్కువగా నమోదు పెరగడం ఆందోళన కలిగిస్తున్నాయి. భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 11,109 కొత్త కరోనా కేసులు(Covid Cases), 29 మరణాలు నమోదయ్యాయి, ఇది 236 రోజులలో అత్యధికం. అయితే యాక్టివ్ కేసులు 49,622కు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Union Health Ministry) గణాంకాలు చెబుతున్నాయి. శుక్రవారం నమోదైన 29 మరణాలతో కలిపి మరణాల సంఖ్య 5,31,064కి చేరుకుంది.

ఢిల్లీ, రాజస్థాన్‌లలో ముగ్గురు, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌ల నుంచి ఇద్దరు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ బారిన పడి మృతి చెందారు. కోవిడ్ చికిత్స పొంది కోలుకుని 4,42,16,586 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరణాలరేటు 1.19 శాతంగా నమోదైంది. కోవిడ్ రికవరీ రేట్ 98.70 శాతం, మరణాల రేటు 1.19శాతంగా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

కాగా వరుసగా రెండోరోజు మహారాష్ట్రలో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 1,086 కోవిడ్ కేసులు, ఒకరు మృతిచెందగా.. ముంబైలో 274 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 1,527 కరోనా కేసులు నమోదుకాగా ఇద్దరు మృతిచెందారు. ఢిల్లీలో ప్రస్తుతం 3,962 యాక్టివ్ కేసులుండగా.. కరోనా నుంచి 909 బాధితులు కోలుకున్నట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ ప్రకటించింది.

కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్(Indian Medical Association) పలు సూచనలు చేసింది. సరైన పరిశుభ్రతను పాటించాలని తెలిపింది. ఇప్పుడు కరోనా నియంత్రణలో ఉంది..ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. గర్భిణీలు, 60 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారు, అంతర్లీన ఆరోగ్య పరిస్థితులు, రోగనిరోధక శక్తి లేనివారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని కోరింది.

Updated Date - 2023-04-14T13:01:16+05:30 IST