Congress : ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయి.. 2024లో అనూహ్య ఫలితాలు.. : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2023-06-02T09:09:45+05:30 IST

భారత దేశంలో ప్రతిపక్షాలు ఐకమత్యంగా ఉన్నాయని, రానున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు.

Congress : ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయి.. 2024లో అనూహ్య ఫలితాలు.. : రాహుల్ గాంధీ

వాషింగ్టన్ : భారత దేశంలో ప్రతిపక్షాలు ఐకమత్యంగా ఉన్నాయని, రానున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) చెప్పారు. ప్రతిపక్షాల ఐక్యత బలంపై ఆయన గొప్ప నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అమెరికాలోని మూడు నగరాల్లో పర్యటించేందుకు వెళ్లిన ఆయన గురువారం వాషింగ్టన్‌లో నేషనల్ ప్రెస్ క్లబ్‌లో మాట్లాడారు.

రానున్న రెండేళ్లలో కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తుందని, పైకి కనిపించని ప్రభంజనం ఉందని చెప్పారు. ఫలితాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయన్నారు. భారత దేశంలో ప్రతిపక్షాలు చాలా ఐకమత్యంగా ఉన్నాయన్నారు. రోజు రోజుకూ ఈ ఐక్యత బలోపేతం అవుతోందన్నారు. అన్ని ప్రతిపక్ష పార్టీలతోనూ తాము నిరంతరం మాట్లాడుతున్నామని, చాలా మంచి కృషి జరుగుతోందని తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికలు చాలా కీలకమైనవని, బీజేపీ ప్రభుత్వాన్ని ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలు చేతులు కలుపుతున్నాయని చెప్పారు. భావ సారూప్యతగల రాజకీయ పార్టీలతో జూన్ 12న పాట్నాలో సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నాయకత్వం వహించే అవకాశం ఉందన్నారు.

కర్ణాటక ఫలితాలపై..

కర్ణాటకలో బీజేపీని గద్దె దించి, కాంగ్రెస్ ఘన విజయం సాధించడం గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ, రాబోయే మూడు, నాలుగు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ఫలితాల కోసం వేచి చూడమని కోరారు. ఏం జరగబోతోందో చెప్పడానికి ఇదే మంచి సంకేతమని చెప్పారు. ఇది చాలా సంక్లిష్టమైన చర్చ అని తెలిపారు. ఇతర ప్రతిపక్ష పార్టీలతో కూడా మనం పోటీ పడుతున్న సందర్భాలు ఉన్నాయన్నారు. అవసరమైనట్లుగా ఇచ్చి, పుచ్చుకోవడం తప్పనిసరి అన్నారు. అలా జరుగుతుందని తాను గట్టి నమ్మకంతో ఉన్నానని చెప్పారు.

పత్రికా స్వేచ్ఛపై..

భారత దేశంలో పత్రికా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మైనారిటీల సమస్యలు, ఆర్థిక వ్యవస్థ గురించి అడిగిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ సమాధానాలు చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న అత్యధిక ప్రజాదరణ గురించి అడిగినపుడు ఆయన మాట్లాడుతూ, దేశంలో వ్యవస్థలను కబ్జా చేశారన్నారు. దేశంలో పత్రికా వ్యవస్థను కబ్జా చేశారన్నారు. తాను విన్న ప్రతిదానినీ తాను నమ్మబోనని చెప్పారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ చాలా చాలా ముఖ్యమని చెప్పారు. తాను భారత్ జోడో యాత్రలో భాగంగా కన్యా కుమారి నుంచి కశ్మీరు వరకు పాదయాత్ర చేశానన్నారు. లక్షలాది మంది భారతీయులతో తాను నేరుగా మాట్లాడానన్నారు. వారు సంతోషంగా ఉన్నట్లు తనకు కనిపించలేదన్నారు. పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తీవ్రమైన సమస్యలని తెలిపారు. ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోందన్నారు. పత్రికా స్వేచ్ఛ మాత్రమే కాదని, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు ఉన్నాయన్నారు. భారతీయులు చర్చించేందుకు అవకాశం కల్పిస్తున్న సంస్థాగత వ్యవస్థలపై ఆంక్షలు అమలవుతున్నాయన్నారు. ప్రజలు తమలో తాము చర్చించుకునేందుకు అవకాశం కల్పించే వ్యవస్థలు ఒత్తిడికి గురవుతున్నాయన్నారు.

బీజేపీ విమర్శలు

రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై భారత దేశాన్ని అవమానించడం మానుకోవడం లేదని బీజేపీ విమర్శించింది. ఆయన మోదీని విమర్శించాలనుకుంటారని, చివరికి దేశాన్ని అవమానిస్తున్నారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి :

Raithu Barosa : భరోసాపై మడత!

Former CM: మాజీ సీఎం సంచలన ప్రకటన.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

Updated Date - 2023-06-02T09:14:08+05:30 IST