Raithu Barosa : భరోసాపై మడత!

ABN , First Publish Date - 2023-06-02T03:46:15+05:30 IST

రైతు భరోసా విషయంలో జగన్‌ ప్రభుత్వం తనదైన శైలిలో వ్యవహరిస్తోంది! తాను ఇచ్చిన హామీలో సగం మాత్రమే నెరవేరుస్తూ.. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్‌ పథకాన్ని తన పథకానికి జత చేసుకుని పబ్బం గడుపుకొంటోంది!. పైగా ఈ సాయం విషయంలో తన ప్రకటనల్లో ఎక్కడా ..

Raithu Barosa : భరోసాపై మడత!
కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో బటన్‌ నొక్కుతున్న సీఎం జగన్‌

ప్రతి రైతుకూ ఇస్తామని హామీ.. 15 లక్షల మందికి రిక్తహస్తం

17 లక్షల కౌలు సాగుదారుల్లో.. 10% మందికే సాయం అగ్రవర్ణ కౌలురైతులకు మొండిచేయి

కులం, మతం చూడమంటూ నాడు జగన్‌ ప్రగల్భాలు

కేంద్రం సొమ్ముతో సగం సొంత సోకు!

రైతు భరోసా లబ్ధిదారుల్లో ఏటేటా వ్యత్యాసం

పెట్టుబడి సాయంపై మాట తప్పిన వైసీపీ సర్కార్‌

ఇంకా విడుదల కాని కేంద్రం సొమ్ముకూ బటన్‌ నొక్కుడు

ఒక్కో రైతుకు రూ.7,500 అంటూ భారీగా ప్రకటనలు..

ప్రస్తుతానికి రాష్ట్ర సర్కారు ఇచ్చే 5,500 మాత్రమే జమ!

వైసీపీ అధికారంలోకి వస్తే.. సాయం చేసే విషయంలో కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ప్రాంతం చూడమంటూ గత ఎన్నికల సమయంలో వైఎస్‌ జగన్‌ బీరాలు పలికారు. కానీ రైతు భరోసా సాయంలో నాలుక మడతేశారు. పంటకు పెట్టుబడి సాయంలో కౌలురైతుల విషయంలో వివక్ష చూపిస్తున్నారు. కౌలురైతుల్లో 70% దాకా ఉన్న అగ్రవర్ణాలకు పెట్టుబడి సాయం ఇవ్వకుండా ఎగనామం పెడుతున్నారు. రాష్ట్రంలో 64 లక్షల మంది భూమి ఉన్న రైతుల్లో 15 లక్షల మందికి, 17 లక్షల కౌలు రైతుల్లో 15 లక్షల మందికి రైతు భరోసా ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారు. ఇక, కేంద్రం ఇచ్చే సాయం రూ.2 వేలు ఇంకా విడుదల కాకుండానే రూ.7500 చొప్పున జమ చేస్తున్నామంటూ జగన్‌ సర్కారు ప్రకటనలు గుప్పించడం గమనార్హం!


(ఆంధ్రజ్యోతి–అమరావతి)

రైతు భరోసా విషయంలో జగన్‌ ప్రభుత్వం తనదైన శైలిలో వ్యవహరిస్తోంది! తాను ఇచ్చిన హామీలో సగం మాత్రమే నెరవేరుస్తూ.. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్‌ పథకాన్ని తన పథకానికి జత చేసుకుని పబ్బం గడుపుకొంటోంది!. పైగా ఈ సాయం విషయంలో తన ప్రకటనల్లో ఎక్కడా ప్రధానమంత్రి ఫొటో కూడా కనపడనివ్వడం లేదు. వాస్తవానికి రైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 ఇస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ కింద ఇచ్చే రూ.6వేలతో కలిపి రూ.13,500 మూడు విడతలుగా ఇస్తామని ప్రకటించి, అలానే ఇస్తున్నారు. అంటే జగన్‌ ప్రభుత్వం ఇచ్చేది కేవలం రూ.7,500 మాత్రమే. ఎన్నికల ముందు మాత్రం.. ‘రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికీ పెట్టుబడి కోసం రూ.50వేలు ఇస్తాం. పంట వేసే సమయానికి వే నెలలోనే రూ.12,500 ఇస్తాం, కౌలు రైతులందరికీ రైతుభరోసా అందిస్తామ’ని వైసీపీ మేనిఫెస్టోలో జగన్‌ ప్రకటించారు. ఆ ప్రకారం ఇచ్చి ఉంటే కేంద్రం ఇచ్చే రూ.6వేలతో కలిపి రైతులకు రూ.18500 ప్రయోజనం లభించేది. కానీ మొండిచేయిచూపారు. ఇక, రాష్ట్రంలో భూమి ఉన్న రైతులు 64లక్షల మంది, 17లక్షలపైగా కౌలురైతులున్నారని అంచనా ఉంది. అయినా రైతు భరోసా కేవలం 52.30లక్షల రైతులకే వర్తిస్తోంది. ఇందులో 2.80లక్షల మంది కౌలు రైతులు, దేవదాయ కౌలు భూముల సాగుదారులు, అటవీ భూ హక్కు సాగుదారులు ఉన్నారు. కౌలు రైతుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సాయం ఇస్తున్నా .. దాదాపు 70% ఉన్న అగ్రవర్ణ కౌలు రైతులకు మొండిచేయి చూపారు. సొంత భూమి ఉన్న రైతుల్లో 49లక్షల మందికే సాయం చేస్తూ, దాదాపు 15లక్షల మందికి భరోసా ఇవ్వకుండా ఎగనామం పెట్టారు.


గతంలో అందరికీ సుఖీభవ!

గతంలో టీడీపీ ప్రభుత్వం కౌలుదారులతో సహా రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసింది. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి రైతుకూ సాయం చేస్తామన్న హామీని విస్మరించి, 30లక్షల మందికి పంగనామాలు పెట్టి.. లబ్ధి పొందుతున్న రైతులకు రూ.5,500 చొప్పున ఎగనామం పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని విపక్షాలు, రైతు సంఘాలు బాహాటంగా విమర్శిస్తున్నాయి.

ఎన్నికల దృష్టితో ఆంక్షల సడలింపు!

రైతు భరోసాకు 2019–20లో 46.69లక్షల రైతు కుటుంబాలకు, 2020–21లో 51.59లక్షల మందికి పెట్టుబడి సాయం అందించింది. 2021–22లో 52.38 లక్షలకు లబ్ధిదారులు పెరిగారని చెప్పిన ప్రభుత్వం.. 2022–23 తొలి విడత 50.10లక్షల మందికే సొమ్ముచెల్లించింది. ‘ఒక రైతు కుటుంబంలో భార్యాభర్తల పేరిట పొలం ఉన్నా.. ఒకరికే సాయం ఇస్తాం.. ఒకే రేషన్‌ కార్డులో భూమి ఉన్న ఇద్దరుంటే... ఒక్కరికే లబ్ధి అందిస్తాం. ఏ రైతు కుటుంబం ఆదాయ పన్ను పరిధిలో ఉన్నా భరోసా ఇవ్వం. రైతు కుటుంబంలోని పిల్లలకు ఉన్నత విద్య అభ్యసిస్తుంటే.. పెట్టుబడి సాయం రాదు.. రైతు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా భరోసా ఇవ్వం’ అంటూ ఆంక్షలు పెట్టడంతో ఏటేటా లబ్ధిదారుల సంఖ్యలో వ్యత్యాసం వస్తోంది. ఒక దశలో భరోసాకు అనర్హులైన రైతుల ఖాతాల నుంచి సొమ్ము రికవరీ చేయాలని, చనిపోయిన రైతుల ఖాతాలకు చెల్లింపులు నిలిపివేసి, జమ అయిన సొమ్మును వెనక్కి తీసుకునే ప్రయత్నాలు చేశారు. అయితే రానున్న ఎన్నికల దృష్ట్యా ఈసారి కాస్త ఎక్కువ మందికి అంటే.. రూ.52.30లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. వీరి కోసం గురువారం కర్నూలు జిల్లా పత్తికొండ సభలో సీఎం జగన్‌ కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రైతు భరోసా సొమ్మును విడుదల చేశారు. ఒక్కో రైతు ఖాతాలో రూ.7,500 చొప్పున 52,30,939 మంది రైతుల ఖాతాల్లో రూ.3,923.21కోట్లు రైతుభరోసా–పీఎం కిసాన్‌ సాయం జమ అవుతుందంటూ వైసీపీ ప్రభుత్వం భారీగా ప్రకటనలు గుప్పించింది. వాస్తవానికి కేంద్రం ఇచ్చే రూ.2వేలు ఇంకా విడుదల కాలేదు. పీఎం కిసాన్‌ చెల్లింపులకు ఇంకా తేదీ ఖరారు కాలేదు. ఇంకా విడుదల కాని కేంద్రం సొమ్ము కూడా ఇప్పుడే ఇస్తున్నట్లు జగన్‌ సర్కార్‌ జారీ చేసిన ప్రకటనపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం ఇచ్చే రూ.5,500 మాత్రమే రైతుభరోసా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.వైసీపీ అధికారంలోకి వస్తే.. సాయం చేసే విషయంలో కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ప్రాంతం చూడమంటూ గత ఎన్నికల సమయంలో వైఎస్‌ జగన్‌ బీరాలు పలికారు. కానీ రైతు భరోసా సాయంలో నాలుక మడతేశారు. పంటకు పెట్టుబడి సాయంలో కౌలురైతుల విషయంలో వివక్ష చూపిస్తున్నారు. కౌలురైతుల్లో 70% దాకా ఉన్న అగ్రవర్ణాలకు పెట్టుబడి సాయం ఇవ్వకుండా ఎగనామం పెడుతున్నారు. రాష్ట్రంలో 64 లక్షల మంది భూమి ఉన్న రైతుల్లో 15 లక్షల మందికి, 17 లక్షల కౌలు రైతుల్లో 15 లక్షల మందికి రైతు భరోసా ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారు. ఇక, కేంద్రం ఇచ్చే సాయం రూ.2 వేలు ఇంకా విడుదల కాకుండానే రూ.7500 చొప్పున జమ చేస్తున్నామంటూ జగన్‌ సర్కారు ప్రకటనలు గుప్పించడం గమనార్హం!


Updated Date - 2023-06-02T03:47:17+05:30 IST