Bihar : కులాలవారీ జన గణన ప్రారంభం

ABN , First Publish Date - 2023-01-07T10:44:21+05:30 IST

బిహార్ (Bihar) ప్రభుత్వం కులాలవారీ జనాభా లెక్కల (caste census) సేకరణలో తొలి దశను శనివారం ప్రారంభించింది.

Bihar : కులాలవారీ జన గణన ప్రారంభం
Nitish Kumar

పాట్నా : బిహార్ (Bihar) ప్రభుత్వం కులాలవారీ జనాభా లెక్కల (caste census) సేకరణలో తొలి దశను శనివారం ప్రారంభించింది. ఇది ఈ నెల 21తో ముగుస్తుంది. రెండో దశ ఏప్రిల్ 1 నుంచి మొదలవుతుంది. మొత్తం మీద ఈ ప్రక్రియ కోసం రూ.500 కోట్లు కేటాయించింది. ఓటర్లను కులాల ఆధారంగా మచ్చిక చేసుకోవడం కోసం ఇది ఉపయోగపడుతుందని జేడీయూ, ఆర్జేడీ భావిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఓ వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ (RJD) నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) మాట్లాడుతూ, కులాలవారీ జనగణనను అడ్డుకోవాలని బీజేపీ (BJP) ప్రయత్నించిందని ఆరోపించారు. బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ అని దుయ్యబట్టారు. కులాలవారీగా జనాభా లెక్కలను సేకరించడం వల్ల శాస్త్రీయ సమాచారం లభిస్తుందని చెప్పారు. ఈ సమాచారం ఆధారంగా సాంఘిక సంక్షేమ పథకాలను ప్రకటించి, అమలు చేయవచ్చునని, బడ్జెట్ కేటాయించవచ్చునని తెలిపారు.

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) నేతృత్వంలోని జేడీయూ (JDU) గత ఏడాది బీజేపీతో తెగదెంపులు చేసుకోవడానికి ప్రధాన కారణంగా కులాలవారీ జనగణననే చూపింది. అనంతరం ఆర్జేడీ, మరికొన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కులాలవారీ జనగణనను నితీశ్, తేజస్వి యాదవ్ సమర్థిస్తున్నారు.

నితీశ్ కుమార్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, కేవలం కులాలవారీగా మాత్రమే జనాభా లెక్కలను సేకరిస్తామని, ఉప కులాల సమాచారాన్ని సేకరించబోమని చెప్పారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఏ స్థాయిలో ఉందో తెలుసుకుంటామన్నారు. ఈ లెక్కలను సేకరించేవారికి తగిన శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఆయన ప్రస్తుతం ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకునేందుకు సమాధాన్ యాత్ర చేస్తున్నారు.

Updated Date - 2023-01-07T10:44:25+05:30 IST