BJP: బీజేపీకి మొత్తం ఎన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్లు రాలేదో తెలుసా...

ABN , First Publish Date - 2023-05-14T13:23:54+05:30 IST

కర్ణాటకలో కాంగ్రెస్‌ సునామీ దెబ్బకు అధికార బీజేపీ అభ్యర్ధులు 31 నియోజకవర్గాల్లో డిపాజిట్‌(Deposit) కోల్పోయారు.

BJP: బీజేపీకి మొత్తం ఎన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్లు రాలేదో తెలుసా...

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో కాంగ్రెస్‌ సునామీ దెబ్బకు అధికార బీజేపీ అభ్యర్ధులు 31 నియోజకవర్గాల్లో డిపాజిట్‌(Deposit) కోల్పోయారు. జేడీఎస్‌ 139 నియోజకవర్గాల్లో డిపాజిట్‌ కోల్పోయింది. శాసనసభ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో రం గంలోకి దిగిన ఆమ్‌ ఆద్మీపార్టీ అభ్యర్థులు 210 నియోజకవర్గాల్లో డిపాజిట్‌ కోల్పో యారు. కేపీసీసీ మాజీ అధ్యక్షుడు దినేష్‌ గుండూరావ్‌(Dinesh Gundurao) బెంగళూరులోని గాంధీ నగర్‌లో కేవలం 105 ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు. వెయ్యిలోపు ఓట్ల మెజార్టీతో 25 మంది కాంగ్రెస్‌ అభ్యర్ధులు గెలుపొందడం విశేషం. కాగా జయనగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్ధి సౌమ్యారెడ్డి 164 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా బీజేపీ అభ్యర్థి సీకే రామ మూర్తి డిమాండ్‌తో రీకౌంటింగ్‌ జరిపారు. దానితో బీజేపి అభ్యర్ధికి 17 ఓట్ల మెజార్టీ లభించింది. దీనితో ఇక్కడ తీవ్ర ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్‌, బీజేపి కార్యకర్తల నినాదాలతో ఉద్రికత్త నెలకొంది. ముందస్తుగా జయనగర్‌లో అద నపు పోలీసు బలగాలను మొహరింప చేశారు. బీజేపీ అభ్యర్ధి గెలిచినట్లు ప్రకటిస్తే న్యాయపోరాటం చేస్తామని కేపీసీసీ కార్యాధ్యక్షుడు రామలింగారెడ్డి ప్రకటించారు.

2018తో పోలిస్తే ఆధిక్యం

2018 ఎన్నికలతో పోల్చితే 5 శాతానికి పైగా అదనపు ఓట్లతో కాంగ్రెస్‌ 56 స్థానా లను అధికంగా గెలుపొందింది. బీజేపీ 39 స్ధానాలను కోల్పోయింది. జేడీఎస్‌ 18 స్ధానాలను కోల్పోయింది. మైసూరుప్రాంతంలో మినహా జేడీఎస్‌ ప్రభావం ఎక్కడా పెద్దగా కనిపించలేదు. బెంగళూరు నగరంలోని 28 స్ధానాలకు గాను బీజేపీ 15 స్థానాలు, కాంగ్రెస్‌ 13 స్ధానాలు గెలిచాయి. మధ్య కర్ణాటక ప్రాంతంలోని 25 స్థా నాలకు గాను కాంగ్రెస్‌ 19 స్ధానాలు గెలుచుకోగా బీజేపీకి కేవలం 5 సీట్లు దక్కాయి. జేడీఎస్‌కు 1 సీటు లభించింది. కోస్తా కర్ణాటకలో బీజేపీ హవా కొనసాగింది. మొత్తం 19 స్ధానాలకు గాను బీజేపీకి 13 సీట్లు, కాంగ్రెస్‌కు 6 సీట్లు దక్కాయి. హైదరాబాదు కర్ణాటక (కల్యాణ కర్ణాటక)లో 41 స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 26, బీజేపికి 10, జేడీఎస్‌కు 3 స్థానాలు దక్కాయి. ముంబై కర్ణాటక (కిత్తూరు కర్ణాటక) ప్రాంతంలో మొత్తం 33 సీట్లు ఉండగా వీటిలో కాంగ్రెస్‌కు 33, బీజేపీకి 16, జేడీఎస్‌కు 1 సీటు లభించింది. మైసూరు ప్రాంతంలో మొత్తం 61 స్థానాలు ఉండగా కాంగ్రెస్‌ 39 సీట్లు సాధించింది. బీజేపీకి 6, జేడీఎస్‌కు 14 సీట్లు లభించాయి. మైసూరు ప్రాంతంలో కాంగ్రెస్‌ బాగా పుంజుకోవడం ద్వారా జేడీఎస్‌ సీట్లకు గండికొట్టిందనే చెప్పాలి.

Updated Date - 2023-05-14T13:23:54+05:30 IST