Mamata Banerjee: బీజేపీ పతనం కర్ణాటక నుంచే ప్రారంభమైతే సంతోషిస్తా

ABN , First Publish Date - 2023-05-04T20:39:34+05:30 IST

భారతీయ జనతా పార్టీ (BJP) పతనం (BJPs downfall) కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly polls) సమయం నుంచే ప్రారంభం కావాలన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే తాను సంతోషిస్తానన్నారు.

Mamata Banerjee: బీజేపీ పతనం కర్ణాటక నుంచే ప్రారంభమైతే సంతోషిస్తా
Bengal CM Mamata Banerjee

కోల్‌కతా: 2024 లోక్‌సభ ఎన్నికల (2024 Lok Sabha elections) నేపథ్యంలో ప్రతిపక్షాల మధ్య ఐక్యత కోరుకుంటోన్న తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (West Bengal Chief Minister Mamata Banerjee) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ (BJP) పతనం (BJPs downfall) కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly polls) సమయం నుంచే ప్రారంభం కావాలన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే తాను సంతోషిస్తానన్నారు.

మణిపూర్‌లో హింసపై మమత ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే శాంతి నెలకొల్పాలంటూ ఆమె ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, కేంద్ర హోం శాఖామంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థంగా అమలు చేయడంలో పశ్చిమబెంగాల్ తొలి స్థానంలో ఉందని, అయినా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని మమత ఆరోపించారు.

మమత ఇటీవలే 2024 లోక్‌సభ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలన్నీ ఐక్యం కావాలని, ఐక్యపోరాటంతో ఈసారి బీజేపీ (BJP) చిత్తు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. మన్ కీ బాత్ పేరుతో బీజేపీ జూట్ కీ బాత్ ప్రచారం చేస్తుంటుందని, ప్రజలను మోసం చేస్తుందని కోల్‌కతాలో చెప్పారు. ఎన్నికల వేళ హామీలివ్వడం ఎన్నికలు కాగానే హామీలు మరవడం బీజేపీ నైజమని మమత ఆరోపించారు.

నితీశ్ ఇటీవలే బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌తో కలిసి మమతను కలుసుకున్నారు. ప్రతిపక్షాల ఐక్యతపై చర్చించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల తరపున ఒకే ఒక్క అభ్యర్థి ఉండాలని నితీశ్ తలపోస్తున్నారు. ప్రతిపక్ష నేతలకు ఇదే విషయంపై నచ్చచెబుతున్నారు. ఈ తరుణంలో మమత కూడా ప్రతిపక్షాల ఐక్యతపై దృష్టి సారించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యతకు నాందిగా లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమించిన నేల బీహార్‌లో ప్రతిపక్షాల సమావేశం జరిగితే బాగుంటుందని ఆమె ఆకాంక్షించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే మే 13 తర్వాత ప్రతిపక్ష పార్టీల నేతలంతా బీహార్ రాజధాని పాట్నాలో సమావేశమౌతారని తెలుస్తోంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని కూడా భావిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా అప్పటికి వస్తాయి కాబట్టి కాంగ్రెస్ నేతృత్వంపై కూడా పాట్నా సమావేశంలో చర్చిస్తారని సమాచారం. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లాంటి కొందరు ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ నేతృత్వాన్ని ఇష్టపడటం లేదు. దీంతో పాట్నా సమావేశంలో చాలా అంశాలపై స్పష్టత వస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Updated Date - 2023-05-04T20:39:37+05:30 IST