Share News

Akhilesh Yadav: అఖిలేష్ నోట పీడీఏ మాట...'ఇండియా' ఊసేలేదు..!

ABN , First Publish Date - 2023-10-22T15:00:10+05:30 IST

లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీపై పోరాటానికి ఏర్పడిన 'ఇండియా' కూటమితో సమాజ్‌వాదీ పార్టీ సంబంధాలు కొనసాగించే అవకాశాలు ప్రశ్నార్ధకంగా మారుతున్నాయి. గత మూడు రోజులుగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న ఎస్‌పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఈ అనుమానాలను మరింత పెంచుతోంది. ఈ పోస్ట్‌లో ఆయన తిరిగి పీడీఏ ప్రస్తావన చేశారు. 'ఇండియా' కూటమి ఊసెత్తలేదు.

Akhilesh Yadav: అఖిలేష్  నోట పీడీఏ మాట...'ఇండియా' ఊసేలేదు..!

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీపై పోరాటానికి ఏర్పడిన 'ఇండియా' (I.N.D.I.A.) కూటమితో సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi party) సంబంధాలు కొనసాగించే అవకాశాలు ప్రశ్నార్ధకంగా మారుతున్నాయి. గత మూడు రోజులుగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న ఎస్‌పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఈ అనుమానాలను మరింత పెంచుతోంది. ఈ పోస్ట్‌లో ఆయన తిరిగి పీడీఏ (PDA) ప్రస్తావన చేశారు. 'ఇండియా' కూటమి ఊసెత్తలేదు. పీడీఏ అంటే వెనుకబడిన వర్గాలు (Pichde), దళిత్ (Dalit), మైనారిటీలు (Alpasankhyak) అని అర్ధం.


ఇండియా కూటమిలో భాగస్వామి అయిన సమాజ్‌వాదీ పార్టీకి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 6 సీట్లు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పిన కాంగ్రెస్ తమకు మొండిచేయి చూపించిందంటూ అఖిలేష్ యాదవ్ ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. 18 నియోజకవర్గాల్లో ఇప్పుడు ఇరుపార్టీల అభ్యర్థులు పోటీపడుతున్నారు.


ఈ క్రమంలో అఖిలేష్ యాదవ్ ఆదివారంనాడు ఒక ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అందులో సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్త ఒకరి వీపుపై పార్టీ రంగు ఎరువు, ఆకపచ్చ రంగుతో పాటు ఒక మెసేజ్ కూడా ఉంది. ''మిషన్ 2024. నేతాజీ (ములాయం సింగ్ యాదవ్) ఇప్పటికీ చిరంజీవే. పీడీఏ ఈసారి ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్‌కు విజయాన్ని చేకూర్చిపెడుతుంది. పేద ప్రజలకు న్యాయం జరిగేలా అఖిలేష్ యాదవ్ చూస్తారు'' అని ఆ సందేశంలో ఉంది. పీడీఏ రివల్యూషన్‌గా 2024 ఎన్నికలు ఉండబోతున్నాయని అఖిలేష్ తన సందేశంలో పేర్కొన్నారు.


అఖిలేష్ ఏమన్నారు?

మధ్యప్రదేశ్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రకటించిన వెంటనే గత గురువారంనాడు అఖిలేష్ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను ఫూల్స్ చేస్తుందన్నారు. ఆరు సీట్లు ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తామని తమతో చెప్పి ఎస్‌పీ అభ్యర్థులే లేకుండా జాబితా ప్రకటించారని తప్పుపట్టారు. పొత్తు ఉండదని ముందే చెబితే వారిని కలవడం కానీ, మాట్లాడటం కానీ జరిగేదే కాదన్నారు. అఖిలేష్ కామెంట్లపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు సమస్యను మరింత జఠిలం చేసిందని అంటున్నారు. 'లీవ్ దిస్ అఖిలేష్ వఖిలేష్' అంటూ కమల్‌నాథ్ వ్యాఖ్యానించారు. ఇండియా బ్లాక్ అనేది కేంద్ర స్థాయిలోని విషయమని, లోక్‌సభ ఎన్నికలపై దృష్టిసారించాలన్నదే ఆ కూటమి ఉద్దేశమని చెప్పారు. దీనిపై అఖిలేష్ తిరిగి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రవర్తన ఇలాగే ఉంటే, వారితో ఎవరు ఉంటారు? అని ఆయన ప్రశ్నించారు. కులగణనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న వైఖరిపై కూడా ఆయన సందేహించారు. కులగణన ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అని ప్రశ్నించారు. ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో కులగణాంకాలను ఇవ్వలేదని, వెనుకబడిన తరగతులు, గిరిజనుల మద్దతు లేకుండా గెలవలేమనే విషయం ఇప్పుడు అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. ఆ తరగుతులు ఏవీ కాంగ్రెస్ వెనుక లేవనే విషయం కూడా వారికి బాగా తెలుసునంటూ తూర్పారబట్టారు.

Updated Date - 2023-10-22T15:01:27+05:30 IST