Karnataka Assembly Polls: ఎన్నికల వేళ బీజేపీకి ఊహించని మద్దతు.. కమలనాథుల్లో ఊపు..

ABN , First Publish Date - 2023-04-05T16:01:00+05:30 IST

కన్నడనాట సినీ నటుడిగా అభిమానుల్లో క్రేజ్ సంపాదించుకున్న కిచ్చా సుదీప్ (Kannada actor Kichcha Sudeep) కమలం పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని ప్రకటించారు.

Karnataka Assembly Polls: ఎన్నికల వేళ బీజేపీకి ఊహించని మద్దతు.. కమలనాథుల్లో ఊపు..
Actor Kichcha Sudeep will campaign for BJP in Karnataka Assembly elections

బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల (Karnataka Assembly Polls) వేళ భారతీయ జనతా పార్టీకి (BJP) గట్టి మద్దతు లభించింది. కన్నడనాట సినీ నటుడిగా అభిమానుల్లో క్రేజ్ సంపాదించుకున్న కిచ్చా సుదీప్ (Kannada actor Kichcha Sudeep) కమలం పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని ప్రకటించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైతో(Karnataka CM Basavaraj Bommai) కలిసి బెంగళూరులో విలేకరుల సమావేశంలో పాల్గొన్న సుదీప్ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తానని చెప్పారు. బొమ్మైతో తనకున్న అనుబంధంతోటే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తాను రాజకీయాల్లోకి రాబోవడం లేదని, కేవలం బీజేపీకి మద్దతు ప్రకటించి ప్రచారం చేయడానికే వచ్చానన్నారు. బీజేపీ సిద్ధాంతం తనకు నచ్చుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై మాట్లాడుతూ నటుడు కిచ్చా సుదీప్‌ మద్దతు తమకు మరింత శక్తినిస్తుందని చెప్పారు. పూర్తి మెజార్టీతో తాము మరోసారి అధికారంలోకి రాబోతున్నామని చెప్పారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కారుకు (double engine government) ప్రజలు బీజేపీకే పట్టం కడతారని బొమ్మై ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన తనకు, బీజేపీకి మద్దతిచ్చిన కిచ్చా సుదీప్‌కు ధన్యవాదాలు తెలిపారు.

పార్టీలన్నీ జోరుగా ప్రచారం సాగిస్తున్న వేళ కిచ్చా సుదీప్ మద్దతు ప్రకటించడం తమకు కలిసి వస్తుందని ఇతర బీజేపీ నేతలు కూడా ఆశాభావం వ్యక్తం చేశారు.

హీరోగా సుదీప్ నటించిన కన్నడ, తెలుగు, హిందీ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కిచ్చా, నాంది, స్పర్శ తదితర సినిమాలు తీశారు. దర్శకుడిగా మై ఆటోగ్రాఫ్ సినిమా తీశారు. కెంపెగౌడ, మాణిక్య తదితర హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. రాజమౌళి దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ఈగ సినిమాలో సుదీప్ విలన్‌గా నటించారు. సుదీప్ బుల్లితెరపైన కూడా మెరుస్తున్నారు. అనేక రియాల్టీ షోలకు హోస్ట్‌గా ఉన్నారు.

224మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 119మంది, కాంగ్రెస్‌‌కు 75 మంది, జేడీఎస్‌కు 28మంది సభ్యులుండగా 2సీట్లు ఖాళీగా ఉన్నాయి.

కర్ణాటక (Karnataka)లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

Updated Date - 2023-04-05T16:24:40+05:30 IST